200 రోజుల తర్వాత ఒడ్డుకు.. పట్టాయాలో హైఅలర్ట్‌! | Why Is Pattaya on High Alert Amid 5000 US Sailors Arrive | Sakshi
Sakshi News home page

200 రోజుల తర్వాత ఒడ్డుకు.. పట్టాయాలో హైఅలర్ట్‌!

Sep 2 2026 10:19 AM | Updated on Sep 2 2026 10:28 AM

Why Is Pattaya on High Alert Amid 5000 US Sailors Arrive

థాయ్‌లాండ్‌లోని ప్రముఖ పర్యాటక నగరం పట్టాయాలో ఈ వారం భారీ సందడి నెలకొననుంది. అమెరికా నేవీకి చెందిన దాదాపు 5,000 మంది సైనికులు లామ్‌ చబాంగ్‌ పోర్టుకు చేరుకోనున్నారు. సెలవులు ముగిసే వరకు వాళ్లు అక్కడే గడపబోతున్నారు. అయితే ఇంతకాలం కుటుంబాలకు దూరంగా ఉన్న వీళ్లు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం, ప్రలోభాలకు లొంగిపోయే అవకాశం లేకపోలేదు. అందుకే అక్కడి పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. 

పట్టాయా.. ఒకప్పుడు చిన్న మత్స్యకార గ్రామం. వియత్నాం యుద్ధ సమయంలో థాయ్‌లాండ్‌లో విధులు నిర్వర్తించిన అమెరికా సైనికులు విశ్రాంతి కోసం ఇక్కడికి రావడంతో.. క్రమంగా ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. ప్రస్తుతం అక్కడి అందాలను వీక్షించేందుకు పలు దేశాల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇటు చాలాకాలంగా సెక్స్‌ టూరిజంతో ముడిపడిన నగరంగానూ పట్టాయా గుర్తింపు పొందింది.

అయితే ఇరాన్‌ యుద్ధం కారణంగా 200 రోజులకు పైగా సముద్రంలో యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ విమాన వాహక నౌకలో వేల మంది అమెరికన్‌ సైనికులు గడిపారు. కుటుంబాలకు దూరంగా ఉండడంతో ఆ సమయంలో వాళ్లు మానసికంగా కుంగిపోయారని.. సూసైడ్‌లు చేసుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ తరుణంలో వాటిని ఖండించిన అమెరికా రక్షణ శాఖ.. వాళ్లకు విశ్రాంతి ఇస్తూ వాషింగ్టన్‌ నౌకలో ఫ్రెష్‌ బ్యాచ్‌ సైనికులు అక్కడికి పంపింది. 

దీంతో లింకన్‌తో పాటు మరో రెండు నేవీ నౌకలు అక్కడికి రానున్నాయి. అయితే వాళ్ల సైనికుల రాకకు ముందే పట్టాయా పోలీసులు బీచ్‌, నైట్‌లైఫ్‌ ప్రాంతాల్లో నిఘా పెంచారు. సెక్స్‌ వర్కర్ల కోసం గాలింపు ముమ్మరం చేశారు. వారాంతంలో నిర్వహించిన దాడుల్లో వ్యభిచారానికి పాల్పడుతున్నారనే అనుమానంతో సుమారు 40 నుంచి 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సైనికులు వచ్చే లోపు సెక్స్‌ ట్రేడ్‌ను పూర్తిగా అరికట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

పట్టాయా పోలీస్‌ చీఫ్‌ అనెక్‌ స్రాథోంగ్యూ మాట్లాడుతూ.. ఇక్కడ వ్యభిచార కార్యకలాపాల్ని నియంత్రించడం అంత సులభం కాదు. వాళ్ల నెట్‌వర్క్‌లు చాలా పెద్దగా ఉంటాయి. మసాజ్‌ ముసుగులో చేస్తారని భావించినా.. అలా ఎన్నడూ ఏ రాకెట్‌ దొరకలేదు. అందుకే వాళ్ల కార్యకలాపాన్ని గుర్తించడం కష్టమవుతోంది. అయితే ఒకేసారి వేల మంది వస్తుండడంతో.. బహిరంగ ప్రదేశాల్లోనే అమెరికన్‌ సైనికులను కొందరు సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. 

పట్టాయాకు భారీగా ఆదాయం
అమెరికా సైనికుల రాకతో పట్టాయా ఆర్థిక వ్యవస్థకు కాస్త ఊతం లభిస్తుందని స్థానిక అధికారులు భావిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, దుకాణాలు తదితర వ్యాపారాలకు ప్రయోజనం కలగనుందని భావిస్తున్నారు. ఒక్కో అమెరికా సైనికుడు రోజుకు సుమారు 1,000 నుంచి 3,000 థాయ్‌ బాత్‌(రూ.2,800 నుంచి రూ.8,500 వరకు) ఖర్చు చేసే అవకాశం ఉందని పట్టాయా మేయర్‌ పొరమాస్‌ న్గాంపిచెస్‌ అంచనా వేశారు. అయితే సిబ్బంది మొత్తం ఒకేసారి నగరంలోకి రాకుండా విడతల వారీగా.. అక్కడికి వెళ్లే అవకాశం ఉండటంతో ఈ ప్రభావం కొన్ని రోజుల పాటు కొనసాగనుంది.

అటు అమెరికా కూడా అలర్ట్‌.. 
అటు అమెరికా కూడా తమ సైనికులకు హెచ్చరికలు జారీ చేసింది. పట్టాయాలో షోర్‌ లీవ్‌ సందర్భంగా అపరిచిత వ్యక్తులు లేదంటే సెక్స్‌ వర్కర్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని లేదా సున్నితమైన సైనిక వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని రక్షణ అధికారులు సూచించినట్లు సమాచారం. 

ఇదీ చదవండి: ఖల్లాస్‌.. ఇక హర్ముజ్‌ మాదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement