రిటైర్ అయిన తరువాత ఏం చేయాలి? కాలక్షేపం ఎలా? మరీ ముఖ్యంగా డబ్బులు ఎలా మధనపడే వారికి కేరళకు చెందిన రిటైర్డ్ టీచర్ రేమాబాయి జీవితం స్ఫూర్తినిస్తుంది. ఇంతకీ ఆమె చేశారు? తెలుసుకుందాం ఈ కథనంలో.
కేరళలోని కొల్లమ్కు చెందిన రేమాబాయి జువాలజీ టీచర్గా,హెడ్మిస్ట్రెస్గా 30 ఏళ్ల పాటు విద్యారంగంలో సేవలందించారు. 2022 మే 31న ఆమె పదవీ విరమణ చేశారు. ఆమె భర్త, ఒక రిటైర్డ్ సీనియర్ బ్యాంక్ మేనేజర్. అలాగే సర్జన్లైన ఆమె కుమారుడు, కోడలు ఢిల్లీలో పనిచేస్తున్నారు. అయితే అదే ఏడాది తల్లి మరణం, ఒంటరితనం వల్ల ఏర్పడిన మానసిక వేదనను జయించడానికి ఆమె తన ఇంటి పెరటి స్థలంలో మొక్కల పెంపకం ప్రారంభించారు. అలా డ్రాగన్ ఫ్రూట్ సాగును చేపట్టారు. దీని మీద బాగా పరిశోధించి 'మలేషియన్ కింగ్' (Malaysian King) రకానికి చెందిన రెడ్ డ్రాగన్ ఫ్రూట్ను ఎంచుకున్నారు. కేవలం 1,750 చదరపు అడుగుల పెరటి స్థలంలో 90 కాంక్రీట్ స్తంభాలు, పాత టైర్ల సాయంతో 360 మొక్కలతో సాగు ప్రారంభించారు.
ప్రారంభంలో 360 మొక్కలు నెలకు రూ. 50వేలకు మించి ఆదాయాన్ని అందించగా,ఆ తరువాత ఆదాయం సుమారు రూ. 1.5 లక్షలకు పెరిగింది. ఈ ఫలితాలు, మరింత భూమి కొనకుండానే తన సాగును విస్తరించడానికి ఆమెను ప్రోత్సహించాయి. ఫలితంగా నెలకు రూ. 4 లక్షలు ఆర్జించేస్థాయికి చేరుకున్నారు. అంతేకాదు ‘జెసీ వరల్డ్’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా డ్రాగన్ ఫ్రూట్ సాగులో తన అనుభవాలను పంచుకుంటూ ఉంటారు.
డ్రాగన్ ఫ్రూట్ -మిద్దెతోట
మిద్దెపై మట్టిలేని సాగు (Soil-less Cultivation): పెరట్లోనే కాకుండా తన ఇంటి మిద్దెపై (Terrace) బరువు కాకుండా ఉండటానికి మట్టికి బదులుగా ఇంట్లోనే తయారు చేసిన కంపోస్ట్, ఆవు పేడను డ్రమ్ములు/బారెళ్లలో నింపి మొక్కలను పెంచడం ప్రారంభించారు. సేంద్రీయ పద్ధదితో ఆమె సక్సెస్ను అందుకోవడం విశేషం. పాత వంటగది వ్యర్థాలు, ఆకులు, కొబ్బరి/పనస వ్యర్థాలు మరియు చేపల వ్యర్థాలతో ఫ్రిష్ అమినో యాసిడ్స్ వంటి 15 రకాల ద్రవ ఎరువులను తయారు చేసి పంటకు అందించారు. దీనివల్ల సాధారణంగా 5-6 నెలలు మాత్రమే వచ్చే దిగుబడి, ఆమె వద్ద ఏడాదికి 10 నెలల పాటు నిరంతరాయంగా వస్తోంది.
ఇదీ చదవండి: ఎర్రకోట పేలుడుకు నిధులిచ్చారంటూ రూ. 30 లక్షలు దోచేశారు
పెరడు, మిద్దె సాగు ద్వారా నెలకు సగటున 750 కేజీల పండ్ల ఉత్పత్తి లభిస్తుంది. హోల్సేలర్లు, ఆర్గానిక్ స్టోర్లు కేజీ రూ. 175 చొప్పున ఆమె ఇంటి నుంచే కొనుగోలు చేస్తారు. పండ్ల అమ్మకాలతో పాటు డ్రాగన్ ఫ్రూట్ మొక్కల కొమ్మలను (Stem Cuttings) ఒక్కోటి రూ. 70 చొప్పున విక్రయిస్తున్నారు. భారత్తో పాటు మాల్దీవులు, శ్రీలంకలోని 2,500 మందికి పైగా కస్టమర్లకు వీటిని విక్రయించారు. (తెలంగాణకు ఒకే రోజులో 5,500 కొమ్మలు సరఫరా చేశారు). అటు పండ్ల విక్రయం, ఇటు కొమ్మల అమ్మకాల ద్వారా ప్రస్తుతం ఆమె నెలకు దాదాపు రూ. 4 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు.
ఇదీ చదవండి: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ కత్తిపోట్లు, సంచలన విషయాలు


