డిజిటల్ అరెస్ట్, రిటైర్డ్ రైల్వే ఉద్యోగిపై సైబర్ నేరగాళ్ల పంజా
సాక్షి, ఢిల్లీ: డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు సంబంధించి ఢిల్లీలో ఒక దిగ్భ్రాంతికరమైన కేసు వెలుగులోకి వచ్చింది. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (NIA,ATS) అధికారులమని చెప్పుకొని ఒక ఏళ్ల రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నుంచి 30 లక్షల రూపాయలను కాజేసీన వైనం కలకలం రేపింది.
ఢిల్లీలోని ద్వారకాకు చెందిన 74 ఏళ్ల రిటైర్డ్ రైల్వే ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి గత ఏడాది జరిగిన రెడ్ ఫోర్ట్ పేలుడులో నిందితులకు నిధులిచ్చారని భయపెట్టేశారు. ఎర్రకోట పేలుడు కేసు నిందితులకు అతని బ్యాంక్ ఖాతా నుంచే నిధులు వెళ్లాయని బెదిరించారు. బ్యాంక్ ఖాతాను ఉపయోగించారని చెప్పి కేటుగాళ్లు అధికారిని, ఆయన భార్యను భయభ్రాంతులకు గురిచేశారు. దాదాపు ఏడు రోజుల పాటు 'డిజిటల్ అరెస్టు'లో ఉంచారు. దీంతో బెంబేలెత్తిపోయిన భయపడిన ఆ దంపతులు, తమ జీవితకాలం లో దాచుకున్న సొమ్ము రూ. 30 లక్షలను మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు.
ఇదీ చదవండి: సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశ కేసు : సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు
వీడియో కాల్స్ ద్వారా వారిని బెదిరించి, నిఘా పెట్టి, ('డిజిటల్ అరెస్ట్') బయటివారితోగానీ, పిల్లలతోగానీ మాట్లాడకుండా భయభ్రాంతులకు గురిచేశారు. వాట్సాప్లో నకిలీ రహస్య ఒప్పంద పత్రాలు (Confidentiality Agreement) పంపి సంతకాలు కూడా చేయించుకున్నారు. ఖాతాలోని డబ్బులను తనిఖీ చేయాలని, విచారణ ముగిశాక తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. దీంతో బాధితుడు తన ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేసి రెండు విడతలుగా (రూ. 15 లక్షలు చొప్పున) మొత్తం రూ. 30 లక్షలను ఆర్టీజీఎస్ (RTGS) ద్వారా నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేశారు. ఆ తర్వాత నేరగాళ్లు ఆర్బీఐ గవర్నర్ సీల్తో ఉన్న నకిలీ వెరిఫికేషన్ లెటర్ పంపారు. ఆతరువాత యధావిధిగా ముఖం చాటేశారు.
బాధితుడి ఫిర్యాదుతో క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపట్టింది. హర్యానాకు చెందిన సునీల్ సింగ్లా అనే వ్యక్తికి చెందిన 'శ్రీ బాలాజీ ట్రాక్టర్' కంపెనీ బ్యాంక్ ఖాతాకు ఈ డబ్బు బదిలీ అయినట్లు మే నెలలో గుర్తించి, అతడిని మే 11న అరెస్ట్ చేశారు. ఇతని ఖాతా ద్వారా దాదాపు రూ. 1 కోటికి పైగా సైబర్ మోసాల లావాదేవీలు జరిగినట్లు తేలింది. పోలీసులు వెంటనే స్పందించి బాధితుడు పంపిన రూ. 15 లక్షల ట్రాన్సాక్షన్ బ్లాక్ చేయగలిగారు. అందులో రూ. 12 లక్షలను రికవరీ చేసి తిరిగి బాధితుడికి అందించారు.


