అన్నదాన మహిమ! | Devotion And Guest Column Special Story On Annadanam | Sakshi
Sakshi News home page

అన్నదాన మహిమ!

Sep 3 2026 7:34 AM | Updated on Sep 3 2026 7:34 AM

Devotion And Guest Column Special Story On Annadanam

దత్తబోధ

‘అన్నదానాత్పరం నాస్తి దానమన్యదిలాతలే.’ ఈ భూలోకంలో అన్నదానం కంటె గొప్ప దానం మరొకటి లేదు. నిత్యం అన్నదానం చేసే ఓ వ్యక్తి తన మరణానికి ముందు తన కుమారుణ్ణి పిలిచి, తాను చేసినట్లే అన్నదానం చేయాలని కోరాడు. తన దగ్గర అంతగా డబ్బులేని ఆ కుమా రుడు తన సమస్యను నారాయణునికి నివేదించడానికి బదరీకి బయలుదేరాడు.

దారిలో ఒక పెద్ద మామిడి చెట్టు నిండా పండ్లు ఉన్నాయి. వాటిని ఎవరూ ముట్టుకున్న జాడ కనిపించలేదు. ఒక పాము ఎవరు ఎంత కొట్టినా తనకు చావు రావడంలేదని చెప్పింది. ఒక పొలం యజమాని తన పండిన పంట తనకు దక్కడం లేదని వాపోయాడు. తమ సమస్యలను బదరీ నారాయణునికి నివేదించమని కోరారు. దారిలో ఆకలితో ఒక బోయవాని ఇంటికి వెళితే బోయవాడు తన కోసం ఉంచుకున్న దుంపలను ఆ బాటసారికి ఇచ్చాడు. అతడి భార్యాపిల్లలు తమ దుంపలను ఇవ్వడానికి నిరాకరించారు. తెల్లవారే టప్పటికి ఓ పులి బోయవాణ్ణి, అతడి కుటుంబాన్ని చంపిన దృశ్యం చూశాడు.

బదరీ వెళ్లి నారాయణునితో ముందుగా ఇతరుల సమస్యలే నివేదించాడు. అందుకా నారాయణుడు పూర్వ జన్మలో ఒక వేదపండితుడు ఎవరికీ వేద పాఠం చెప్పకుండా చనిపోయి ఈ జన్మలో ప్రయోజనం లేని పండ్ల చెట్టయి పుట్టాడనీ, ఇప్పుడు ఎవరికైనా వేదం చెబితే అతడి సమస్య తీరుతుందనీ చెప్పాడు. పాము పూర్వజన్మలో పెద్ద ఆస్తిగల పిసినారి అనీ, ఇప్పుడు తన మణి మాణిక్యాలకు కాపలా కాస్తూ పడివున్నదనీ, వాటిని ఎవరికైనా దానం చేస్తే సమస్య తీరుతుందనీ చెప్పాడు. పొలం యజమాని తన ముగ్గురు కూతుళ్ళకు కన్యాశుల్కం తీసుకున్నాడనీ, ఇప్పుడు నాలుగో కుమార్తెకు కన్యా శుల్కం తీసుకోకుండా పెళ్లి చేస్తే అతడి పంట చేతికి వస్తుందనీ చెప్పాడు. ఇక బోయవాని ఉదంతం తెలుసుకోవాలంటే ఇప్పుడే కాశీరాజుకు జన్మించిన కుమారుని వద్దకు వెళ్ళమన్నాడు.

బాటసారి ఆ పసిబాలుని దగ్గరకు వెళ్లగా ‘నీకు ఆకలి వేసినప్పుడు దుంపలను ఆహారంగా ఇచ్చిన బోయవాడిని నేనే! తమవంతు ఆహారాన్ని పెట్టని నా భార్య, బిడ్డలు ఈ జన్మలో పందిపిల్లలుగా పుట్టారు’ అని చెప్పాడు. దీంతో అన్నదాన మహిమ అర్థమైన బాటసారి నారాయణుడు చెప్పిన పరిష్కార మార్గాలు రైతు, పాము, మామిడి చెట్టుకు చెప్పాడు. దీంతో, రైతు తన కుమార్తెను బాటసారికిచ్చి పెండ్లి చేశాడు. పాము తన సంపదనంతా అతడికే ఇచ్చింది. మామిడి చెట్టు రూపంలోని పండితుడు వేద పాఠం చెప్పాడు. అందరి సమస్యలను పరిష్కరించిన బాటసారి ధనం, విద్య, భార్యతో తల్లిని చేరి అన్నదానం ప్రారంభించి ధన్యుడయ్యాడు.
- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement