ఆధ్యాత్మికథ
అసలైన భక్తి
రామాపురం గ్రామం నిత్యం ΄ాడిపంటలతో సస్యశామలంగా ఉండేది. ఒక్కసారిగా ఊరిని కరవు కబళించింది. భూములు బీటలు వారాయి. పశువులు ఆవురావురంటూ ఆకలి కేకలు వేశాయి. నిండు బావులు అడుగంటాయి. కరవును ఎదుర్కోలేక గ్రామస్తులు వలసలు మొదలుపెట్టారు. అది గమనించిన ఓ బ్రాహ్మణుడు ఊరికి ఉత్తర దిక్కున ఉన్న రావిచెట్టు కింద ఉన్న నారాయణుడి శిలకు పూజలు చేయమని చెబుతాడు.
ఆయన మాటలు విని గ్రామస్తులు ఉన్నంతలో నారాయణుడిని ఆరాధిస్తారు. ప్రతిరోజు పూజలు చేస్తారు. ఫలితం మాత్రం కనిపించదు. రోజులు గడుస్తున్నా.. గడ్డుకాలం గ్రామాన్ని వీడలేదు. అలసిన గ్రామ ప్రజలు పూజలను మొక్కుబడిగా మమ అనిపిస్తారు. కరువు అలవాటు కావడంతో కొందరు ఇళ్లకే పరిమితమవుతారు. భగవంతుడు ఉన్నాడా అనే సందేహంతో మళ్లీ వలసలు కొనసాగించారు.
కానీ అదే గ్రామం లోని ఓ వృద్ధుడు బ్రహ్మయ్య మాత్రం పూజలు కొనసాగిస్తూనే ఉంటాడు. అలసట లేకుండా వర్షాలు పడతాయని ప్రతిరోజూ నారాయణు డిని ్ర΄ార్థిస్తూనే ఉంటాడు. తన భక్తిపై నమ్మకంతో పూజకు వెళ్లే క్రమంలో తాటాకుతో అల్లిన గొడుగును వెంట తీసుకువెళతాడు. అది చూసి గ్రామప్రజలు నవ్వేవారు. కానీ ఆయన మాత్రం బ్రాహ్మణుడు చెప్పిన నాటి నుంచి ప్రతిరోజూ నారాయణుడిని కొలుస్తూనే ఉన్నాడు. అలా కాలం గడుస్తుంటుంది.
రోజూలానే బ్రహ్మయ్య నారాయణుడి సేవకు వెళ్లి పూలను శ్రీహరికి సమర్పించి వెనుతిరుగుతాడు. ఉన్నఫళంగా ఆకాశం మేఘావృతం అవుతుంది. క్షణాల్లో కారుమబ్బులు కమ్ముకొని చినుకులు పడడం మొదలవుతాయి. దీనిని గమనించిన వైకుంఠంలోని లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువును ఇలా అడుగుతుంది... స్వామీ, గ్రామంలోని ప్రజలందరూ కలసి ఎన్నో రోజులు పూజించారు. కానీ.. మీరు బ్రహ్మయ్య భక్తికి మాత్రమే కరుణించడంలో ఆంతర్యం ఏమిటి? అని.
అప్పుడు శ్రీమహావిష్ణువు ‘‘భగవంతుడు ఎప్పటికైనా కరుణిస్తాడని బ్రహ్మయ్య నమ్మడమే ఇందులోని ఆంతర్యం. బ్రహ్మయ్య అందరిలా కార్యాచరణ చేసి ఆగలేదు. ఆయన శ్రద్ధాభక్తికి నేను తన్మయం పొందాను. ముఖ్యంగా వర్షం పడుతుందన్న నమ్మకంతో రోజూ గొడుగు కూడా తెచ్చుకునేవాడు. ఆ నమ్మకానికి నేను కట్టుబడి ఉండకపోతే ఆ రావిచెట్టు కింద ఉంది నిజంగానే శిలే అనుకుంటాడు’’ అని బదులిచ్చాడు. భగవంతుడిని పూజించడం అంటే కార్యసాధన చేసి విజయం వరించే వరకూ నిలవడం అని గ్రామస్తులు గ్రహిస్తారు.
– పంతాడి లోకరాజు, సాక్షి, మంగళగిరి
ఇవి కూడా చదవండి: ఒక్కరోజు భోజనం.. ఆరు నెలలు నిద్ర! కుంభకర్ణుడికి ఈ వరం ఎలా?


