రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మ గురించి తపస్సు చేశారు. ‘ఏ వరమూ లేకుండానే కావరంతో వీడు పెట్టే బాధలు భరించరానివిగా ఉన్నాయి. ఇక వరములిస్తే లోకాలు తట్టుకోగలవా దేవా? కనుక, ఏ వరాలూ కుంభకర్ణుడికి ఇవ్వవలదు’ అని బ్రహ్మదేవుడిని ప్రార్థించారు దేవతలు.
కుంభకర్ణుడిపై కారుణ్యత్వము మాని, అతడిని మాయావివశుడిని జేసి, ఏదో ఒక చిన్న వరాన్ని ప్రసాదిస్తే లోకాలకు శుభం జరుగుతుంది అన్నారు. వెంటనే బ్రహ్మదేవుడు ‘సకల జీవుల రసనలపై నిలిచి నాట్య మాడే నీవు, ఈ కుంభకర్ణుడి రసనపై ఇప్పుడు నిలిచి, నీ చాతుర్యంతో వ్యర్థ ప్రలాపాలను పలికించి, లోకాలకు హాని కలిగించే వరం ఏదీ అతడు కోరుకోకుండా చేయుము!’ అని సరస్వతీదేవిని ఆదేశించాడు. అలాగేనంది ఆమె.
అప్పుడు బ్రహ్మ, తపస్సులో ఉన్న కుంభకర్ణుడి ముందు ప్రత్యక్షమై ‘కుంభకర్ణా! నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో’ అన్నాడు. బ్రహ్మ చెప్పినట్లుగా సరస్వతీదేవి కుంభకర్ణుడి నాలుకపై చేరి, ఆ క్షణం కుంభ కర్ణుడి చేత ‘ఆరుమాసాలు సుఖనిద్ర, ఒకరోజు భోజనం’ ప్రసాదించమని అడిగించింది. ‘నిజమే, అదే మేలు. నీవు కోరిన ప్రకారమే సుఖ నిద్రలో ఉండు’ అని కుంభకర్ణుడికి వరమిచ్చాడు బ్రహ్మదేవుడు. కుంభకర్ణుడు వెంటనే నిద్రలోకి జారు కున్నాడు. దేవతలు సంతోషించారు.
‘ఉత్తర రామాయణం’ కావ్యం, ద్వితీయాశ్వాసంలోని ఈ సందర్భాన్ని ఆధారం చేసుకుని, ఆ కావ్యకర్తయైన కంకంటి పాపరాజు ఇలా వ్యాఖ్యానించాడు: క. పౌరుషంబునకు దైవం/ బారయ ఫలకారి యందు రాదైవంబే/ వైరస్యము వహించిన/ నేరూపున పురుషుడొందు నిష్టార్థంబుల్. మనిషి కోరుకునే కోరికలను, ఆ కోరికలు సఫలం కావాలని చేసే ప్రయత్నాలను దైవం ఫలవంతం చేస్తాడు. అటువంటిది, ఆ దైవమే, చేసే ప్రయత్నాలపట్ల విముఖు డైతే, ఆ వ్యక్తి తన కోరికలను ఎలా తీర్చుకుంటాడు? తీర్చుకోలేడు. ఆ పరిస్థితి రాకుండా ధర్మయుక్తమైన జీవితం గడుపుతూ, దైవం పట్ల భక్తిశ్రద్ధలు కలిగి ఉండటం మనిషి చేయవలసిన పని.
– భట్టు వెంకటరావు
ఇవి చదవండి: కుటుంబం: సామాజిక సౌధానికి పునాది


