-
Book Review: అనువాదం ఒక సవాలు
‘భిన్న నేపథ్యాలు, కులాలు, మతాలు, ఇతివృత్తాలు, కథ నాలు, మాండలీకాలు ఉన్న 26 కథలను ఆంగ్లంలోకి అనువాదం చేయడమెట్లా? వాటిలోని విభిన్నతను, ప్రత్యేకతను అనువాదంలోకి తీసుకురావడమెట్లా?... ఇవీ అల్లాడి ఉమ, ఎం. శ్రీధర్లకు ఈ పుస్తకం అనువాదం సమయంలో వచ్చిన కొన్ని ప్రశ్నలు. ఇంగ్లిష్ అనువాదంలో వెలువడ్డ తెలుగు కథల సంక లనం ‘తెలుగు: ద బెస్ట్ షార్ట్ స్టోరీస్ అఫ్ అవర్ టైమ్స్’కు ఓల్గా సంపాదకులు. హార్పర్ పెరెన్నియల్ వాళ్ళు ప్రచురించారు. ‘గత ముప్పై ఏళ్ళల్లో వచ్చిన ముఖ్యమయిన కథల్లోంచి ఎంపిక చేసుకున్న ఈ 26 కథలు భారతీయ పాఠకులకు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిస్తే నా యత్నం, ప్రచురణకర్తల ఉద్దేశం, అనువాదకుల ప్రయత్నం నెరవేరినట్లే’ అంటారు ఓల్గా. ఈ పుస్తకంలోని రచనలనూ, రచయితలనూ తెలుగు పాఠకులకు పరిచయం చేయా ల్సిన అవసరం లేదు. ఈ కథలన్నీ మనల్ని కదిలించినవే, ఆలోచింప జేసినవే. తెలుగు కథకు సరిగ్గా నూటా ఇరవై ఏళ్ళు. వేలాది కథలు, వందలాది కథల సంపుటాలు ఈ శతాబ్ద కాలంలో వెలువడ్డాయి. ముఖ్యంగా 1990 నుండి వైవిధ్యమైన భావజాలాలు, అస్తిత్వాలు తెలుగు పాఠకులను కదిలించాయి. ఆ భిన్నత్వం అనుభవం నుండి, ప్రతిఘటన నుండి, ఉద్యమాల నుండి వచ్చింది. ఏ గొంతులు, మనుషులు, జీవితాలు, భాషలు సాహిత్యానికి వెలుపల ఉంచబడ్డాయో సరిగ్గా అవే, సాహిత్యం అంటే ఇదీ– కథ అంటే ఇదీ అంటూ ముందు కొచ్చాయి. అలాంటప్పుడు అన్ని కథల్లోంచి ఇరవై ఆరు కథలు ఎంపిక చేయాలంటే ఓల్గా తన ఉపోద్ఘాతంలో చెప్పినట్లు, కష్టమయిన పనే. ఈ సంకలనంలో సతీష్ చందర్ ‘డాగ్ ఫాదర్’, ఎండ్లూరి మానస ‘బొట్టు భోజనాలు’, పెద్దింటి అశోక్ కుమార్ ‘జుమ్మే కి రాత్’, కరుణ ‘నీళ్లు చేపలు’, పి. సత్యవతి ‘ఇట్లు స్వర్ణ’, కోట్ల వనజాత ‘ఇత్తు’, ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి ‘సముద్రపు పిల్లోడు’, వి. ప్రతిమ ‘మనిషి విత్తనం’, వి. చంద్రశేఖరరావు ‘ద్రోహ వృక్షం’, వాడ్రేవు వీరలక్ష్మీదేవి ‘బినామీ’, సన్నపురెడ్డి వెంక ట్రామిరెడ్డి ‘సేద్దెగాడు’, ఎం.ఎం.వినోదిని ‘ఒక విలన్ ఆత్మ హత్య’, కె.ఎన్. మల్లీశ్వరి ‘రెండంచుల కత్తి’, మల్లిపురం జగదీశ్ ‘ఇప్ప మొగ్గలు’, కేతు విశ్వనాథరెడ్డి ‘అమ్మవారి నవ్వు’, కొలకలూరి ఇనాక్ ‘కొలిమి’, మహమ్మద్ ఖదీర్ బాబు ‘గెట్ పబ్లిష్డ్’, జూపాక సుభద్ర ‘ఎంపీటీసీ రేణుకెల్లు’, అక్కినేని కుటుంబరావు ‘పనివాడితనం’, కె.వరలక్ష్మి ‘మంత్రసాని’, అట్టాడ అప్పల్నాయుడు ‘బతికి చెడ్డ దేశం’, షాజహానా ‘సిల్సిలా’, జి.ఆర్.మహర్షి ‘పురాగానం’, బి.ఎస్.రాములు ‘మెరుగు’, ఓల్గా ‘సారీ జాఫర్’, కుప్పిలి పద్మ ‘వే టు మెట్రో’ కథలు ఉన్నాయి. పలు భాషలు, పలు రాతలు, పలు రచయి తలు, పలు సందర్భాలు, పలు కాలాలు, కానీ ఒక అనువాదం! అందుకే అనువాదాన్ని పలు అంచుల కత్తి అనడం అతిశయోక్తి కాదేమో. తాము లేవనెత్తిన చర్చకు సమాధానమే అన్నట్లుగా, రచనల, రచయితల విభిన్నతను అనువాదాల్లోకి తీసుకు రావడానికి అల్లాడి ఉమ, ఎం. శ్రీధర్ తెలుగు పదాలను, ఉర్దూ మాటలను యథాతథంగా ఆంగ్లంలోకి తీసుకొచ్చారు. ‘నా తమిళ జీవితాన్ని, అనుభవాన్ని ప్రతిఫలించే ఆంగ్లం కావాలి’ అని మీనా కందసామి అన్న మాటలు గుర్తొస్తాయిక్కడ. అనువాదం అనువాదంలాగా ఉండాలా, అసలులాగే ఉండాలా, పదకోశం ఇవ్వాలా లేదా పాఠకులే కొంత ప్రయత్నించి అర్థం చేసుకోవాలా అన్న చర్చలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అయితే మూల కథలోని పదాలను అనువాదంలో అలాగే ఉంచేయడం ఎప్పుడూ ఒకలాగే పని చేయకపోవచ్చు. రచనల్లోని విభిన్నతే వాటిలోని నిగూఢ అర్థాలకు కూడా వర్తిస్తుంది కదా. (చదవండి: కాలానికి ముందు పయనించిన కవి) – కె. సునీతారాణి -
రాజుగారి మూడు ప్రశ్నలు
పూర్వకాలంలో విజయపురి అనే రాజ్యాన్ని విక్రమసింహుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు మంచివాడే కానీ అహంకారం మెండు. సభలో ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే వాడు. రాజుగారి ధోరణి మంత్రి కట్టప్పకి నచ్చేది కాదు. ఎలాగైనా రాజులోని ఆ చెడు లక్షణాన్ని దూరం చేయాలనుకున్నాడు మంత్రి. ఒకరోజు ఆస్థానంలో సభ జరుగుతుండగా మళ్ళీ రాజుగారు సొంత డబ్బా కొట్టుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే మంత్రి ‘మహా ప్రభూ..! మీ తెలివితేటల గురించి సభలోని వాళ్లందరికీ బాగా తెలుసు. కానీ మన రాజ్యం పొలిమేరలో ఉన్న అవంతిపురంలో అందరూ తెలివైన వారేనని ఒక ప్రచారం ఉంది. వారి ముందు మీ తెలివితేటలను ప్రదర్శిస్తే మీ ప్రతిభ పొరుగు రాజ్యాలకు కూడా విస్తరిస్తుంది’ అని సూచించాడు. సరేనంటూ మరునాడే మారువేషంలో మంత్రిని వెంటబెట్టుకొని అవంతిపురం బయల్దేరాడు రాజు. ఆ ఊరు చేరగానే ఒక పశువులకాపరి కనిపించాడు. తన తెలివితో ముందుగా అతడిని ఓడించాలని అనుకున్నాడు రాజు. వెంటనే అతని దగ్గరికి వెళ్లి ‘నేను మూడు ప్రశ్నలు అడుగుతాను జవాబులు చెబుతావా?’ అన్నాడు. వెంటనే ఆ పశువుల కాపరి సరే అన్నట్టు తలూపాడు. మొదటి ప్రశ్నగా ‘సృష్టిలో అన్నింటికన్నా వేగవంతమైనది ఏది?’ అని అడిగాడు. ‘గాలి’ అంటూ సమాధానం వచ్చింది. ‘పవిత్రమైన జలము ఏది?’ అని ప్రశ్నించాడు. ‘గంగా జలం’ అని టక్కున సమాధానం చెప్పాడు. ముచ్చటగా మూడో ప్రశ్న... ‘అన్నింటికన్నా ఉత్తమమైన పాన్పు ఏది?’ అనగానే ‘మంచి చందనంతో చేసిన పాన్పు’ అని పశువులకాపరి జవాబిచ్చాడు. ‘బాగా చెప్పావు.. సరిగ్గా నా మదిలో కూడా అవే జవాబులు ఉన్నాయి’ అన్నాడు రాజు. అప్పుడు ఆ పశువుల కాపరి విరగబడి నవ్వడంతో రాజుకు కోపం వచ్చింది. రాజు పట్టరాని కోపంతో ‘ఎందుకు ఆ నవ్వు?’ అంటూ విరుచుకుపడ్డాడు. ‘నేను చెప్పిన తప్పుడు సమాధానాలన్నీ మీరు ఒప్పు అని అంటుంటే మరి నవ్వక ఏం చేయాలి?’ అని మొహం మీదే అనేశాడు పశువులకాపరి. అయితే సరైన సమాధానం ఏమిటో చెప్పమని గర్జించాడు విక్రమసింహుడు. ‘సృష్టిలో అన్నింటికన్నా వేగమైంది మనసు, విలువైన జలం ఎడారిలో దొరికే జలం, ఉత్తమమైన పాన్పు అమ్మ ఒడి’ అని పశువులకాపరి బదులిచ్చాడు. తన తెలివి తక్కువ తనానికి సిగ్గుపడుతూ ఊళ్లోకి వెళ్లకుండానే వెనుదిరిగాడు రాజు. అప్పటి నుంచి తన అహంకారాన్ని వదిలి రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ అందరితో కలిసిమెలిసి ఉండసాగాడు. -
పిల్లల కథ: జానకమ్మ తెలివి
రామాపురం అనే గ్రామంలో రామదాసు అనే పిసినారి ఉండేవాడు. అతనికి ఒక పాత పెంకుటిల్లు ఉండేది. ఆ గ్రామంలో అతను మిక్కిలి ధనవంతుడైనా పిసినారితనంతో ఇల్లు కట్టలేదు. అతని భార్య జానకమ్మ ఉత్తమ ఇల్లాలు. ఆ గ్రామంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఎంత ప్రయత్నించినా దొంగ మాత్రం దొరకలేదు. రామదాసుకు అత్యవసరంగా దూరంగా ఉన్న పట్టణానికి పోవలసి వచ్చింది. అతడు తన భార్యతో ‘మన ఇంటికి దొంగరాడు. మన ఇల్లే పాడుబడిన కొంప. దీన్ని చూసిన ఏ దొంగ కూడా మన ఇంట్లో దొంగతనం చేయడానికి ముందుకు రాడు. అయినా నీ జాగ్రత్తలో నీవు ఉండు’ అని చెప్పి పట్టణానికి వెళ్ళాడు. అతని ఊహకు భిన్నంగా మరునాడే ఆ దొంగ రామదాసు ఇంటిలోనికి ప్రవేశించాడు. జానకమ్మ చాలా ధైర్యం గలది.. ఉపాయశాలి కూడా. అందువల్ల ఆమె ఆ దొంగకు వణికి భయపడినట్లు నటిస్తూ ‘బాబ్బాబూ! నీకు కావాల్సింది తీసుకుని వెళ్ళు. అంతే కానీ నన్ను మాత్రం ఏమీ చేయకు. నీకు పుణ్యం ఉంటుంది’ అని బతిమిలాడింది. దొంగ ఏమీ మాట్లాడకుండా చీరలు, నగలు సర్దుకోసాగాడు. అప్పుడు జానకమ్మ ‘దొంగన్నా! మా వారు చాలా పిసినారి. నీవు ఈ ఊర్లో ఎవరినైనా అడిగి ఆయన గురించి తెలుసుకో! ఆయన నాకు చేయించి ఇచ్చినవి ఈ రెండే రెండు బంగారు చిన్ని నగలు, ఈ కొద్ది చీరలు. అవి కూడా నీవు తీసుకొని వెళ్లితే ఆయన నాకు మళ్ళీ నగలు చేయించడు. చీరలను కొనివ్వడు. నీ సోదరిగా భావించి ఈ నగలు, చీరలను వదిలిపెట్టు’ అని అంది. అప్పుడు దొంగ ‘అలాగా! అవి వదలిపెడతాను సరే! కానీ మీ ఇంట్లో డబ్బు ఎక్కడ ఉందో చెప్పు’ అని గద్దించాడు. ‘మేము చాలా పేదవారం నాయనా! మా పేదరికం గురించి మా ఇల్లే నీకు చెబుతుంది. నీవు అడిగావు కనుక చెబుతున్నాను. మావారి బీరువాలో కొంత నగదు ఉంది. నీవు తీసుకొని వెళ్ళు’ అని అంది. ఆ మాటలకు దొంగ సంతోషించి ఆ నగదును తీసుకొని ఆ నగలు, చీరలు అక్కడే వదిలిపెట్టి పరుగుతీశాడు. ఆ తర్వాత ఇరుగు పొరుగువారు వచ్చి రామదాసు ఇంట్లో దొంగలు పడ్డారని తెలుసుకొని అతడు ఊళ్లో లేనందుకు విచారం వ్యక్తం చేశారు. మరునాడు పట్టణం నుండి వచ్చిన రామదాసు భార్యతో ‘మన ఇంట్లో దొంగలు పడ్డారని ఊరంతా చెప్పుకుంటున్నారు. నిజమేనా! నేను నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా!’ అన్నాడు. జానకమ్మ ఏమీ మాట్లాడలేదు. రామదాసు కంగారుగా ‘ఏం మాట్లాడవ్? ఏమేమి పోయాయో చెప్పు’ అంటూ గొంతు పెంచాడు. ‘నా నగలు, చీరలు పోలేదండి. నా మాటలకు కరిగిపోయిన దొంగ వాటిని ఇక్కడే వదిలి పెట్టి వెళ్ళాడు’ అని అంది జానకమ్మ సంతోషంతో. రామదాసు వెంటనే ‘నీ చీరలు, నగలు కూడా నా బీరువాలోనే ఉన్నాయి కదా! అందులోని నా నగదు పోయిందా ఏమిటి? నా ఖర్మ!’ అంటూ కంగారు పడ్డాడు రామదాసు. అప్పుడు ఆమె ‘పోయిందండి’ అంది విచారంగా. ‘అయ్యో! పది లక్షల నగదు.. ఎంత పనైపోయింది! వాటిని కాపాడితే నీకు రెండు బంగారు గొలుసులు చేయిద్దామనుకున్నాను. కానీ నీవు చాలా దురదృష్టవంతురాలివి. నీకు ఆ యోగం లేదు’ అంటూ బాధపడ్డాడు. అప్పుడు ఆమె‘ మీరేనా ఈ మాటలంటున్నది. అలాగైతే నాకు నగలు, చీరలు మీరు బాకీ ఉన్నట్లే’ అని అంది. ‘తమాషా చెయ్యకు. నగదు సంచీ పోయి నేను ఏడుస్తుంటే’ అన్నాడు రామదాసు. ‘అవునండీ.. మీ సంచి దొంగ ఎత్తుకొని పోయాడు’ అంది జానకమ్మ. ‘నా సంచీ ఎత్తుకొని వెళ్ళిన తర్వాత నగదు ఎక్కడ ఉంటుంది? నీ చీరలు, నగల కోసం నాకు అబద్ధం చెబుతావా’ అంటూ కసురుకున్నాడు. ‘అబద్ధాలు చెప్పడం లేదండీ! మీ సంచీని ఆ దొంగనే ఎత్తుకుపోయాడు. అందులో అన్నీ పదిరూపాయల నోట్లే ఉన్నాయి.అంతా కలిసి ఒక వెయ్యి రూపాయల కన్నా మించవు. ముందుగానే జాగ్రత్తగా మీ సంచీలో నుండి యాభై, వంద, ఐదు వందలు, రెండువేల నోట్లను తీసి నా సంచీలో పెట్టి నా దిండు కింద దాచిపెట్టానండీ. ఒకవేళ మనింటికి ఆ దొంగోడు వచ్చినా కేవలం పది రూపాయల నోట్లు మాత్రమే ఎత్తుకొని పోతాడు అని. నా ఊహే నిజమైంది. మీ లక్షల నగదు భద్రంగా ఉంది. వాడికి మీ సంచీని చూపించాను. పిచ్చివాడు.. ఆ పది రూపాయల నోట్లే గొప్ప నగదు అనుకొని, నా చీరలు, నగలు వదిలేసి వెళ్లాడు’ అని చెప్పింది. ఆపద సమయంలో భార్య ప్రదర్శించిన ధైర్యం, తెలివికి అబ్బురపడ్డాడు రామదాసు. అప్పటి నుండి తన పిసినారి తనాన్ని వీడి.. భార్య చెప్పినట్టు వింటూ పదిమందికి ఉపయోగపడే పనులు చేయసాగాడు. -
పట్టువదలని విక్రమార్కుడు.. రుజువుకాని నేరం
పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ‘రాజా.. నువు ఏ నీతి, నియమానికి కట్టుబడి ఇలా శ్రమిస్తున్నావో నాకైతే తెలియదుగాని, ఈ లోకంలో నీతి జయిస్తుందనీ, అవినీతికి శిక్ష ఉంటుందనీ చెప్పటానికి లేదు. ఇందుకు నిదర్శనంగా నీకు గిరిధరుడు అనేవాడి కథ చెబుతాను శ్రమతెలియకుండా విను’అంటూ ఇలా చెప్పసాగాడు.. చాలాకాలం కిందట హరిప్రసాద్ అనే ఆయన మూడు గ్రామాలకు జమీందారు. జమీందారీ వ్యవహారాలన్నిటినీ గిరిధరుడు అనే సమర్థుడు చూస్తూ ఉండేవాడు. అతను మంచివాడూ, జమీందారుకు విశ్వాసపాత్రుడూనూ. అతని ప్రతి సలహానూ జమీందారు మారుమాటాడకుండా స్వీకరించేవాడు. గ్రామాలలో ఎవరికి ఏది కావలసినా గిరిధరుడికి ఒక నమస్కారం పెట్టి పని జరిపించుకునేవారు. క్రమంగా ఊళ్లు పెరిగాయి. వాటితోబాటు నమస్కారాలు పెట్టేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. ఒకేరకం సహాయం ఇద్దరు, ముగ్గురికి అవసరమైనప్పుడు వాళ్లలో పోటీలు ఏర్పడసాగాయి. నమస్కారాలు పెట్టేవాళ్ల మీద పోటీగా కొందరు పళ్లబుట్టలు పట్టుకురాసాగారు. గిరిధరుడు సహజంగా నమస్కారాల వాళ్లను పక్కకు నెట్టి పళ్లబుట్టల వాళ్లకు ఎక్కువ శ్రద్ధ చూపక తప్పలేదు. పనులు చేయించుకునే వాళ్లలో పోటీ ఇంకా పెరిగిపోయింది. పళ్లబుట్టల మీద రూపాయల సంచులు ఎక్కి వచ్చాయి. ఈ విధంగా అడగకుండా డబ్బు తన ఇంటికి నడచివస్తుంటే దాన్ని తోసిపుచ్చటంలో గిరిధరుడికి అర్థం కనిపించలేదు. గుడిపూజారి ఉద్యోగమే గానీ బడిపంతులు ఉద్యోగమేగానీ డబ్బు ముట్ట చెప్పిన వాడికే దక్కుతున్నది. రానురాను గిరిధరుడి భార్య మెడనిండా మోయలేనంత బంగారమూ, ఇంటి నిండా అంతులేని వస్తుసామాగ్రీ ఏర్పడ్డాయి. దీని ఫలితంగా హరిప్రసాదు జమీందారీలో లంచం పెట్టగలవాడికే తప్ప నిజమైన అర్హతలుగల బీదవారికి బతుకు తెరువు లభించకుండా పోయిందని ప్రజలు చెప్పుకోసాగారు. శేషగిరి అనే పేదవాడు ఈ సంగతి స్వానుభవం ద్వారా తెలుసుకున్నాడు. అతను కటిక పేదవాడు. వారాలు చేసి చదువుకుని ఎంతో తెలివితేటలు గలిగినవాడు. అతను గిరిధరుడికి చాలా నమస్కారాలు పెట్టాడు. కాని ఒక్క పళ్లబుట్ట అయినా ఇయ్యలేకపోయాడు. అతనికి ఏ ఉద్యోగమూ దొరకలేదు. తన నమస్కారబాణాలు గిరిధరుడికి ఎక్కడా తగలలేదని తెలిసి, శేషగిరికి ఒళ్లు మండుకొచ్చింది. అతను జమీందారు వద్దకు వెళ్లి ‘మీ జమీందారీ వ్యవహారం ఏమీ బాగాలేదు. లంచం పెట్టితే చాలు ఎలాటి పనికిమాలిన వాడికైనా పని దొరుకుతున్నది. చదువూ, తెలివీ ఉన్న పేదలు నీరుకారిపోతున్నారు’ అంటూ గిరిధరుడి మీద ఫిర్యాదు చేశాడు. జమీందారు నిర్ఘాంతపోయాడు. అతనికి గిరిధరుడి మీద అంతులేని నమ్మకం. గిరిధరుడు ఎందరో పేదవారిని చూసి జాలిపడి, తనతో చెప్పి బంజరు భూములు ఇప్పించాడు. ఇన్ని ఏళ్ల మీద గిరిధరుణ్ణి గురించి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. శేషగిరి మాట నమ్మలేక జమీందారు ‘నీ మాట నిజమైతే గిరిధరుడి ఉద్యోగం నీకిస్తాను’ అని చెప్పి అతణ్ణి పంపేశాడు. తరవాత జమీందారు యాయవారం బ్రాహ్మణ్ణి ఒకణ్ణి పట్టుకుని ‘ఫలానా గ్రామంలో కొత్తగా గుడి కట్టారు. ఈ నూరు రూపాయల సంచీ తీసుకుని ఆ ఊళ్లో ఉండే గిరిధరుడికి ఇచ్చి గుడి పూజారి పని ఇప్పించమని అడుగు’ అని చెప్పి పంపించేశాడు. పూజలు చేయించటంలో చాలాకాలంగా అనుభవం ఉన్న మరొక బ్రాహ్మణ్ణి పిలిపించి ‘నువు ఫలానా గ్రామంలో ఉన్న గిరిధరుడు అనే ఆయనకు నమస్కారం చేసి కొత్త దేవాలయానికి పూజారి పని ఇప్పించమని అడుగు’ అని అతణ్ణి కూడా పంపేశాడు. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి గిరిధరుడి దగ్గరికి వెళ్లారు. యాయవారపు బ్రాహ్మడు రూపాయల సంచీ పట్టుకు కూర్చున్నాడు. అయినా రెండోవాడు తన చిన్ననాటి మిత్రుడు కావటంవల్ల గిరిధరుడు అతనితో చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పి అతను వచ్చిన పని తెలుసుకుని ‘ఈ గుడి మన జమీందారుగారు కట్టించినదే. నీ వంటి అనుభవంగలవాణ్ణి పూజారిగా నియమించటానికి జమీందారుగారు ఎందుకు అభ్యంతరం చెబుతారు?’ అన్నాడు. యాయవారపు బ్రాహ్మడు కూడా అదే పనికోసం వచ్చాడని తెలిసి గిరిధరుడు ‘ఏమీరాని నీకు పూజారి పని ఏమిటి? వెళ్లవోయ్’ అన్నాడు. గిరిధరుడు తన చిన్ననాటి స్నేహితుణ్ణి గుడిపూజారిగా నియమించాలని జమీందారుకు సలహా ఇచ్చిన మీదట, జమీందారు శేషగిరికి కబురుపెట్టి ‘నేను గిరిధరుడికి పరీక్ష పెట్టిచూశాను. అతను లంచగొండి అని రుజువుకాలేదు’ అని చెప్పాడు. శేషగిరి కొంచెం చిరాకుపడి ‘అతను లంచగొండి అనటానికి వేరే పరీక్షకావాలాండీ? అతని భార్య మెడలో ఉన్న కట్టెడు బంగారు నగలు చూడండి! సామానుల కొట్టులాగా ఉండే అతని ఇల్లు చూడండి! మీరిచ్చే జీతం మీద అతను అంత బంగారమూ, అన్ని సామాన్లూ కొనలేడని మీకే తెలుస్తుంది’ అన్నాడు. జమీందారు గ్రామాల తనిఖీ నెపం మీద త్వరలోనే చెప్పాపెట్టకుండా గిరిధరుడి ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కానీ అప్పటికి రెండు రోజుల ముందుగా గిరిధరుడి బావమరిది వచ్చి ‘మా ఊళ్లో మంచిపొలం అమ్మకానికి వచ్చింది. కొందామంటే నా వద్ద డబ్బులేదు. నువ్వయినా కొనుక్కో! చాలా మంచి బేరం’ అన్నాడు. గిరిధరుడు సంకోచించకుండా తన భార్య నగలన్నీ ఒలిచి తన బావమరిదికి ఇచ్చి ‘ఈ నగలు తాకట్టుపెట్టి పొలం కొనుక్కో. తరవాత పొలం మీద వచ్చే ఆదాయంతోనే మెల్లిగా తాకట్టు విడిపించుకోవచ్చు’ అన్నాడు. అదేసమయంలో గిరిధరుడి పొరుగు ఇంట పెళ్లి జరిగింది. వాళ్ల అవసరం కోసం గిరిధరుడు తన ఇంటి సామాను దాదాపు అంతా అరువు ఇచ్చాడు. అలాటి పరిస్థితిలో అకస్మాత్తుగా గిరిధరుడి ఇంటికి జమీందారు వచ్చాడు. గిరిధరుడు ఆయనను చూసి కంగారుపడుతూ ‘అయ్యో కూర్చోవటానికి సరి అయిన కుర్చీ కూడా లేదు’ అని ఒక జంపఖానా పరచి దాని మీద కూర్చునేటందుకు ఒక ముక్కాలి పీటవేశాడు. గిరిధరుడి భార్య ‘ఒక వెండి గ్లాసయినా లేదు’ అనుకుంటూ బాగా తోమిన కంచులోటాలో పాలుపోసి పళ్లెంలో కొన్ని పళ్లుతెచ్చి జమీందారుకు ఇచ్చింది. జమీందారు ఆమెను పరకాయించి చూశాడు. ఆమె మెడలో పసుపుతాడు తప్పలేదు. చేతులు బోసిగా ఉన్నాయి. ఇల్లంతా బావురుమంటున్నది. ‘నా గురించి ఏమీ హైరానా పడవద్దు. గ్రామంలో పని ఉండి వచ్చి, పలకరించి పోదామని తొంగి చూశాను’ అంటూ జమీందారు లేచాడు. గిరిధరుడు నొచ్చుకుంటూ ‘పని ఏదన్నా ఉంటే నాకు కబురు చెయ్యకపొయ్యారా? మీరు రావలసిన పని ఏమిటి? నేనే వద్దామనుకుంటున్నాను. ఈ మధ్య కొంత పన్ను వసూలయింది’ అని డబ్బు సంచీ తెచ్చి జమీందారు ముందు పెట్టాడు. గిరిధరుడు పరమ దరిద్రపుస్థితిలో ఉన్నట్టు నమ్మకం కలగటంచేత జమీందారు ‘ప్రస్తుతం ఈ డబ్బు నీ అవసరానికి ఉంచుకో. లెక్కలు తరవాత తీరికగా చూసుకోవచ్చు’ అని డబ్బు సంచీ తీసుకోకుండా తిరిగి వెళ్లిపోయాడు. తరవాత ఆయన శేషగిరిని పిలిపించి ‘నువు చెప్పినది ఒకటీ రుజువుకాలేదు. గిరిధరుడి ఇల్లు అయ్యవారి నట్టిల్లులా ఉన్నది. అతని భార్య మెడలో పుస్తెలకు పసుపుతాడు తప్పలేదు. అతని మీద ఇలాటి అభాండాలు నాతో ఎందుకు చెప్పావో తెలీదు. నువ్విక వెళ్లవచ్చు’ అని పంపేశాడు. జమీందారు అబద్ధం ఆడి ఉండడు. కానీ గిరిధరుడికి అలాటి పరిస్థితి ఎందుకు ఏర్పడినదీ శేషగిరి ఊహకు అందలేదు. ‘అతణ్ణి దేవుడే కాపాడుతూ ఉండాలి. లేకపోతే అతనిలాటి లంచగొండిని ఎందుకు నిరూపించలేకపోతాను’ అనుకుని తన దురదృష్టాన్ని కూడా తిట్టుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి ‘రాజా.. దైవికంగా గిరిధరుడు తన నేరం బయటపడకుండా తప్పించుకున్నంత మాత్రాన అతను శిక్షార్హుడు కాకుండా పోతాడా? అలాంటివాణ్ణి గుడ్డిగా నమ్మిన జమీందారు అవివేకి కాడా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసీ చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది’అన్నాడు. దానికి విక్రమార్కుడు ‘ఉద్యోగాలు ఇప్పించటంలో గిరిధరుడు అవలంబించిన పద్ధతి నీతితో కూడినది కాదనటంలో సందేహం లేదు. అయితే అవినీతి అన్నది రెండు విధాలుగా ఉంటుంది. కొందరు వ్యక్తులు స్వార్థం కొద్దీ సంఘనీతిని ధిక్కరించి అవినీతిగా ప్రవర్తిస్తారు. అలాటివారి అవినీతికి శిక్ష.. సంఘం నుంచే వస్తుంది. కానీ గిరిధరుడి విషయంలో అవినీతికి కారణం సంఘంలోనే ఉన్నది. జమీందార్ల ఉద్యోగులు కానుకలు పుచ్చుకోవటం తప్పుకాదు. అయినా కానుకలు పుచ్చుకున్నందుకు ప్రత్యుపకారం చెయ్యటం తప్పనిసరి అవుతుంది. గిరిధరుడు ఎవరికి ఉద్యోగం ఇచ్చినా లంచం ఇయ్యాలన్న నియమం పెట్టలేదు. అతను స్వార్థపరుడు కాదనీ, అతనికి కానుకలు ఇచ్చినవారు బుద్ధిపూర్వకంగా ఇచ్చారనీ స్పష్టంగా తెలుస్తోంది. స్వతహాగా అతను చాలా మంచివాడు. ఇతరులకు సహాయపడేవాడు. అంతేగానీ ఇతరులను పీడించేవాడు కాడు. డబ్బుల్లేని బావమరిదికి పొలం కొనుక్కునేందుకు తన భార్య ఒంటి మీది నగలన్నీ ఊడ్చి ఇచ్చాడు. ఎవరో పొరుగువారింటి పెళ్లికి తన ఇంటి సామానంతా అరువిచ్చాడు. స్వతహాగా అతను స్వార్థపరుడూ, శిక్షార్హుడూ కాడు. పోతే జమీందారు కూడా అవివేకి ఎంతమాత్రమూ కాడు. తాను ఎంతో విశ్వాసంతో చూసుకుంటున్న గిరిధరుడి మీద ఫిర్యాదు వస్తే దాన్ని తోసిపారెయ్యక రెండు పరీక్షలకు అతణ్ణి గురిచేశాడు. ఒకవేళ గిరిధరుడి సంపద బయటపడినా జమీందారు అతణ్ణి శిక్షించటానికి అవసరమైన విషయం శేషగిరి రుజువు చేయలేడు. అదేమిటంటే గిరిధరుడు ఎవరికిగానీ లంచం ఇస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానన్నమాట. అలా అడిగే అలవాటుంటే గిరిధరుడు శేషగిరినే లంచం అడిగి ఉండేవాడు. దీన్ని బట్టి జమీందారు తనలో ఉంచిన విశ్వాసానికి గిరిధరుడు అర్హుడనే చెప్పాలి’ అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. (బేతాళ కథలు.. చందమామ, 1980, జనవరి సంచిక నుంచి) సేకరణ: అనిల్ బత్తుల -
కథ: మరైతే.. ఎవరీ మనిషి?
హాల్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్న శివకుమార్ ‘ఏవోయ్!’ అంటూ గట్టిగా కేకేశాడు వంటింట్లో ఉన్న వనజమ్మకు వినపడేలా. ‘ఏంటండీ!’ అంతే గట్టిగా అరిచిందావిడ. ‘బదులుకు బదులు అరవడం ఆపి, కాసేపు ఇటు వైపొస్తావూ? నాకెందుకో భయం భయంగా ఉంది’ ‘అబ్బబ్బా! నేను మీ పక్కన లేకపోతే ఒక్క ఘడియ ధైర్యంతో ఉండరు కదా! ఇప్పుడేమైపోయిందని చిన్న పిల్లాడిలా అంత భయం?’ విసుక్కుంటూ వచ్చిందక్కడికి. ‘కొల్లేటి సరస్సులో తప్పిపోయిన పిల్లకొంగలా ఉంది నా పరిస్థితి. పంచ్లు ఆపి, పరిష్కారం చూపవూ?’ ‘మరీ పిల్ల కొంగ ఏంటండీ? ముసలి కొంగ అనలేరూ?’ అని ఓవైపు దెప్పుతూనే, మరొకవైపు ‘అసలు విషయమేంటో తెమల్చండి!’ అంది. ‘ఈరోజు ముప్పై ఒకటవ తారీఖు తెలుసా?’ అనడిగాడు. ‘అవును. రేపు ఒకటవ తారీఖు కూడా! తమరికి ఎందుకొచ్చిందీ డౌటు?’ ‘ప్రతినెలా ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు. ఆ రామారావు, నాగేశ్వరరావు, కాంతారావులు నన్ను వదలకుండా చంపుకు తింటున్నారనుకో!’ ‘తినరూ మరి! ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం తమరికి పడదు మొర్రో అని మొత్తుకున్నా, నా మాట విన్నారా? అనుభవించండి’ ‘తరుణోపాయం ఆలోచించి, ఓ నారీ! నీ ఆలోచనల అంబుధి నుంచి ఒక చిటికెడు ఉపాయాన్ని నాకు విదిల్చవూ?’ వేడుకున్నాడు శివకుమార్ ‘ఎంచక్కా నెలనెలా వచ్చే పెన్షన్తో గడిపితే ఈ తిప్పలు ఉండేవా చెప్పండి? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎవరో రిటైర్మెంట్ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్తో కోటలు కట్టారని ఎగిరితే, ఏమైంది? అడ్వాన్సులు ఇచ్చి బేరం పెట్టుకున్న ఫ్లాట్స్ అమ్ముడు పోక, పనికిమాలిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురించింది’ ‘సర్లేవోయ్! తెల్లవారడం ఆలస్యం వాళ్లంతా ఇక్కడ ప్రత్యక్షమవుతారు. ఈనెల అమౌంట్ ఇచ్చేస్తానని వాగ్దానం చేశాను. ముందైతే గండం గట్టెక్కించు‘ ప్రాధేయపడ్డాడు శివకుమార్. ‘అయితే నేను చెప్పినట్టు చేయండి. మిగతా డ్రామా నేను నడిపిస్తా!’ అంటూ ఆ ఉపాయాన్ని భర్త చెవిలో ఊదేసింది వనజమ్మ. తలాడించాడు శివకుమార్. భార్య చెప్పిన విషయాన్ని ఇంకా రిహార్సలే చేయలేదు.. ఊహించని విధంగా ఊడి పడ్డాడతను పిడుగులా. ‘ఇప్పుడెలా?’ అన్నట్టు భార్య వంక దీనంగా చూశాడు శివకుమార్. ‘ఏం వర్రీ అవకండి!’ చేత్తో సైగ చేసింది వనజమ్మ. బక్కపలచ బాడీకి లాల్చీ పైజామా తగిలించుకున్న రామారావు, చంకలో లెదర్ బ్యాగ్తో యమ హుషారుగా లోపలికి దూసుకొచ్చాడు. శివకుమార్ పక్కన సోఫాలో కూర్చుంటూ ‘నమస్కారం మాస్టారూ!’ అన్నాడు పళ్ళికిలిస్తూ. ‘ఇంకా ఒకటో తారీఖు రానేరాలేదు. అంత ఆత్రం దేనికో?’ మనసులో తిట్టుకున్నాడు శివకుమార్. ఆ మూగభాష అర్థం చేసుకున్న వాడిలా ‘రేపు వస్తే కాంపిటీషన్ ఉంటుంది కదా.. అందుకే ముందు వచ్చానన్న మాట!’ ఈనెల ఎలాగైనా శివకుమార్ నుంచి డబ్బులు రాబట్టాలని చాలా దృఢసంకల్పంతో ఉన్నాడు రామారావు. కట్టెలా బిర్ర బిగుసుకుపోయిన భర్త వాలకాన్ని చూసి వెంటనే యాక్షన్ పార్ట్లోకి దిగింది వనజమ్మ.. ‘అయ్యో! ఈయన ఆయన కాదన్నయ్యా!’ అంటూ. శివకుమార్ ముఖంలోకి ముఖం పెట్టి మరీ చూస్తూ ‘ఏం, ఈ మాస్టారు మీ వారు కాదా? చిన్నప్పుడు తప్పిపోయి ఇన్నేళ్ళకి ఇంటికి తిరిగొచ్చిన డబల్ సీనా?’ ఆశ్చర్యపోయాడు రామారావు, ‘అంత సీన్ లేదు’ అంది వనజమ్మ. ‘నాటకాలా?’ ‘అయ్యో ఎంత మాట అనేశారు అన్నయ్యా!’ నొచ్చుకుందావిడ. ‘మరైతే ఎవరీ మనిషి?’ అంటూ అనుమానంగా చూశాడు శివకుమార్ వంక. ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ‘ఈయన ఆయనే! కానీ, మునుపటి మన మనిషి కాదన్నయ్యా!’ కొంగు నోటికి అడ్డం పెట్టుకుంది. ‘మామూలుగా చెబితేనే నాకస్సలు అర్థం కాదు. అలాంటిది ఈ వంకర్లు టింకర్లు నైజాంతా! కాస్తంత డీటెయిల్డ్గా చెప్పు చెల్లెమ్మా!’ ప్రాధేయ పడ్డాడు రామారావు. రియలిస్టిక్గా రియాక్ట్ అవుతూ ‘ఈయనకి మతిమరుపు వచ్చింది అన్నయ్యా!’ అంది సీన్ని ఆస్కార్ లెవెల్లో పండిస్తూ. ఖంగుతిన్న రామారావు ‘వామ్మో! తలకి బలంగా దెబ్బ తగిలి గతం మరచిన కేసా? లేక అలై్జమర్సా?’ అంటూ శివకుమార్ నుంచి రావాల్సిన అంత డబ్బు గుర్తుకొచ్చి అపరిచితుడిలా పిచ్చి చూపులు చూశాడు. ‘అంతకంటే ఎక్కువే!’ అంది వనజమ్మ అతడిని మరింత భయభ్రాంతులకు గురిచేస్తూ. ‘అంటే?’ అన్నట్లుగా చూశాడు రామారావు. ‘పాలీమర్స్ అంట! గతం మర్చి పోవడమే కాదు. బొమ్మలా కూర్చోవడం ఈ జబ్బు లక్షణాలంట. అలై్జమర్స్ కంటే అడ్వా¯Œ ్స స్టేజ్!’ అంటూ మరోమారు నోటికి కొంగు అడ్డం పెట్టుకుంది వనజమ్మ. ‘ఇప్పుడు నేనేం చేయాలి?’ తల మీద రెండు అరచేతులు ఉంచుకొని వాపోయాడు రామారావు. అతను తన కహానీ నమ్మేశాడనే ఉత్సాహం ఆపుకోలేక ‘బ్యాగూ గీగూ సర్దుకుని చక్కా వెనుదిరిగి వెళ్లిపోవడమే!’ తన ప్రజెంట్ రోల్ మరచి శివకుమార్ నోరుజారాడు. ‘డింకు చకా.. మీ ఆయన పాలిమర్స్ హుష్ కాక్! నేను కనబడగానే గతమంతా ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా గుర్తుకు వస్తున్నట్టుంది’ హుషారుగా అరిచాడు రామారావు. తనని కోపంగా చూస్తున్న భార్య వైపు తల తిప్పిన శివకుమార్ చప్పున నాలిక్కరుచుకుంటూ ఎప్పటిలా చెక్కిన కట్టె బొమ్మలా కదలకుండా ఉండిపోయాడు. తిరిగి రామారావు తన ముఖంలో ముఖం పెట్టి చూసేలోగా! ‘ఆయనకి గతం గుర్తుకు రావడం కాదు! ఆయనకి పాలిమర్స్ వచ్చిందని తెలిసిన షాక్లో నా గొంతు విని మా ఆయన గొంతు అనుకున్నట్టున్నారు’ ‘నో ఛాన్స్! ఆడ గొంతుకి మగ గొంతుకి కూడా తేడా తెలియనంత వెర్రిబాగుల వాడినా చెల్లెమ్మా?’ ‘అయ్యయ్యో ఎంతమాటన్నయ్యా! మీరు వెర్రిబాగుల వారని ఎవరన్నారు? మీ చెవులు మీ మాట వినాలి కదా’ అసలే కన్ఫ్యూజన్ మనిషి అయిన రామారావు .. వనజమ్మ మాటలకు మరింత కన్ఫ్యూజ్ అయ్యాడు. మన చెవులు మన మాట వినకుండా కూడా ఉంటాయా? బుర్ర గోక్కుంటూ ‘ఏదీ? తిరిగోసారి ఆ డైలాగ్ చెప్పమ్మా!’ అవునో కాదో తేల్చుకుందామని అనుమానంగా అడిగాడు రామారావు. ఇలాంటి ఎగ్జామేదో రామారావు నుంచి ఎదురవుతుందని పసిగట్టిన వనజమ్మ ఆ డైలాగ్ని ఆల్రెడీ బట్టీ పట్టేసింది. ‘మూటాముల్లె సర్దేసుకుని చక్కా వెనుతిరిగి వెళ్లిపోవడమే!’ అనేసింది. ‘డైలాగ్లో ఏదో తేడా కొడుతున్నట్టుందే!’ అనుమానం వ్యక్తపరచాడు రామారావు. నాలుక కరుచుకుంటూ ‘బ్యాగూ గీగూ అనబోయి.. అన్నాను అంతే కదా!’ అంది. ఏం తోచలేదు రామారావుకి. మెల్లగా లేచాడు. వెళ్ళబోతున్న రామారావుని ఆపి ‘అన్నయ్యా, మీరో సాయం చేసి పెట్టాలి’ అడిగింది వనజమ్మ. ‘ఇప్పటికే లక్షలు లక్షలు సాయం చేశాను మీ ఆయనకు. ఇంకా నా వల్ల కాదమ్మా!’ . ‘అయ్యో, ఆ సహాయం కాదన్నయ్యా!’ జేవురించిన మొహంతో ‘రవ్వంత సహాయం కూడా నావల్ల కాదంటే కాదు!’ మొత్తుకున్నాడు రామారావు. ‘మరేంటి.. ఆమధ్య మా ఆయన మీ గురించి అంతలా చెప్పారు?’ విసిరిందొక బాణం. ‘ఏమని?’ కుతూహలంగా అడిగాడు. ‘రామారావు గారైతే కాస్త నయం! డబ్బులు లేవంటే అర్థం చేసుకుంటారు. మిగతా వాళ్ళు జలగల్లా పట్టి పీడిస్తారనుకో!’ అంటూ ప్లాన్ బి ప్రయోగించింది. కాస్త మెత్తబడుతూ ‘ఏమో చెల్లెమ్మా!’ అన్నాడు. ప్లాన్ వర్కవుట్ అయ్యిందని ‘మా ఆయనకి పాలిమర్స్ జబ్బు వచ్చిందని మిగతా వాళ్ళకి కూడా సూచనప్రాయంగా చెప్పండి అన్నయ్యా!’ ‘చెప్పక చస్తానా! సరేనమ్మా!’ అంటూ వెళ్ళిపోయాడు రామారావు. ‘యాహూ!’ అంటూ ఆనందంతో శివకుమార్ చిన్న పిల్లవాడై పోయాడు. అప్పటికి గండం గట్టెక్కింది. ముందుంది ముసళ్ళ పండుగ. ∙∙ ‘మే ఐ కమిన్!’ ఇంట్లో వాళ్ల అనుమతి లేకుండానే లోపలికి దూసుకు వచ్చాడతను. ఇదివరకెప్పుడూ అతడిని చూడని శివకుమార్, వనజమ్మ తెల్ల మొహాలేశారు. టక్కు, టై, మిల్ట్రీ కటింగ్తో కుర్రాడు యమ హుషారుగా ఉన్నాడు. రెండు చేతులెత్తి ఇద్దరికీ నమస్కారం చేసి, వాళ్ళకెదురుగా కూర్చున్నాడు. ‘నా పేరు కృష్ణంరాజు’ వాళ్లను అట్టే సస్పె¯Œ ్సలో పెట్టక తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఈమధ్య కొత్త వాళ్లెవరు ఇంటికొచ్చినా శివకుమార్ ‘పాలిమర్స్ రోల్’ ప్లే చేస్తున్నాడు ఎందుకైనా మంచిదని! ‘ఇంతకూ నీవొచ్చిన పనేంటో’ వనజమ్మ, భుజానికి ఉన్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి టకటకా ఏవో బటన్స్ ప్రెస్ చేసి తిరిగి దాన్ని మూసేస్తూ ‘మీ వారి పేరు నాటకాల శివకుమార్ కదా ఆంటీ!’ అనడిగాడు. కంగారు పడుతూ ‘అవును. నీకెట్లా తెలుసు?’ ఆశ్చర్యపోయింది వనజమ్మ. ‘ మీవారు సర్వీసులో ఉండగా ఆ కంపెనీ వాళ్ళు ఉద్యోగస్తుల పేరిట ‘హాంఫట్ బీమా’ కంపెనీతో డీలింగ్ కుదుర్చుకున్నారు. ఆ బీమా కంపెనీ ప్రతినిధిని. మీ వారికిప్పుడు తొమ్మిదిలక్షల ఎనభైఏడు వేల ఆరువందలయాభై నాలుగు రూపాయలు రావాల్సి ఉంది’ చెప్పాడు. అది వింటూనే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. శివకుమార్కి లోలోపల మహా ఉబలాటంగా ఉంది. ఎప్పుడు ఆ అమౌంట్ని హ్యాండోవర్ చేసుకుందామా అని! వెంట తెచ్చిన ఫైల్లోంచి ఒక పేపర్ తీసి ‘ఈ కాగితం మీద మీవారు ఒక్క సంతకం పెడితే ఆ డబ్బులు శాలరీ అకౌంట్లో పడిపోతాయి’ అంటూ ఆమెకి అందించాడు. తన భర్త ‘పాలిమర్స్ జబ్బు’ గురించి చెప్పేసింది ఏకధాటిగా! ‘అయితే ఈయన సంతకం పెట్టడం కుదరదన్నమాట!’ అంటూ చప్పున ఆ కాగితాన్ని ఆమె చేతిలోంచి లాక్కున్నాడు కృష్ణంరాజు. ‘అంత తొందర ఎందుకయ్యా! ఆయనతో నేను పెట్టిస్తాగా!’ అంది. ‘కుదరదు అంటీ! శివకుమార్ గారు ఈ కాగితం మీద సంతకం పెట్టేటప్పుడు ఒక వీడియో తీసి, దాన్ని వాట్సాప్లో హెడ్ ఆఫీస్కి పంపాల్సి ఉంటుంది.’ డైలమాలో పడింది వనజమ్మ. కృష్ణంరాజు కంటపడకుండా శివకుమార్ భార్యకు కనుసైగ చేశాడు. ‘ఒక చిన్న హెల్ప్ బాబూ!’ అని అడిగింది వనజమ్మ. వరాలిచ్చే దేవుడిలా తలూపాడతను. ‘ఒక పది నిమిషాలు అలా ఇంటి బయట ఉండి వస్తావూ?’ విన్నవించుకుంది. ‘ష్యూర్ ఆంటీ!’ అంటూ బయటకు వెళ్లాడు. ‘ఏమోయ్! మా ఆఫీసువాళ్ళు ఉద్యోగస్తుల పేరుతో బీమా చేసినట్టు మాకెప్పుడూ వినపడలేదే!’ బుర్ర గోక్కున్నాడు శివ కుమార్. ‘ఆ..మీ చాదస్తం నాకు తెలియదా?మీ తాత చుట్టం అయినట్టు డబ్బులొస్తాయంటూ పనిగట్టుకొని ఇతగాడు ఇంటిదాకా వస్తాడా? బుర్ర తక్కువ ఆలోచనలు మానేసి, ముందు ఏం చేద్దామో చెప్పండి’ భర్తను తొందర పెట్టింది వనజమ్మ. ‘ఈ కృష్ణంరాజు దగ్గర కాసేపు ఆ పాలిమర్స్ జబ్బుకు పాతరేస్తే సరి!’ పరిష్కారం చెప్పాడు శివకుమార్. వనజమ్మ తలూపుతూ పిలిచిందతడిని. లోపలికి వస్తూనే ‘అంకుల్ ఓకే కదా..!’ క్లారిఫై కోసం అడిగాడు కృష్ణంరాజు. ‘మీ ఆంటీకే పాలిమర్స్! నాకేం? దుక్కలా ఉన్నాను చూడూ?’ అన్నాడు శివకుమార్ దర్పంగా. హీరో చేత విలన్ తుక్కుతుక్కుగా తన్నులు తిన్నాక క్లైమాక్స్లో పోలీసులు వచ్చినట్టు కృష్ణంరాజు విజిల్ ఊదగానే పోలోమని రామారావు, నాగేశ్వరరావు, కాంతారావులు పరుగు పరుగున వచ్చారక్కడికి! ‘తెలివి తేటలు నీకే ఉన్నాయనుకుంటే ఎలా శివకుమార్? మీ ప్లాన్కు విరుగుడు ప్లాన్ మా దగ్గరా ఉంటుంది’ అని రామారావు అంటుంటే నిశ్చేష్టులైన శివకుమార్ దంపతులు నిజంగానే పాలిమర్స్ జబ్బు వచ్చిన వాళ్లలా బిర్ర బిగుసుకుపోయారు. కాస్త తేరుకున్నాక కృష్ణంరాజు వంక చూస్తూ ‘మరైతే ఎవరీ మనిషి?’ అడిగాడు శివకుమార్ వణుకుతున్న గొంతుతో. ‘మేం ముగ్గురం కలసి తెచ్చుకున్న కిరాయి మనిషి!’ అంటూ బిగ్గరగా నవ్వాడు నాగేశ్వరరావు. - ఎనుగంటి వేణుగోపాల్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement