ఒకప్పుడు జియా రాయ్ని చూసి అందరూసానుభూతితో ‘అయ్యో!’ అనుకునేవారు. ఇప్పుడు ప్రపంచమంతా ‘ఆహా!’ అంటూ అభినందిస్తోంది. రెండేళ్ల వయసులో జియా రాయ్ శారీరక, మానసిక ఎదుగుదల లోపాలకు సంబంధించిన స్పెక్ట్రమ్ డిజార్డర్తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు.
ఈతకొలనులో ఈత కొడుతున్న వారిని చూసినప్పుడల్లా ఆ చిన్నారి కళ్లలో ఏదో వెలుగు కనిపించేది. ఆ వెలుగును పసిగట్టిన తల్లిదండ్రులు జియాకు స్విమ్మింగ్ నేర్పించారు. తాజా విషయానికి వస్తే... ముంబైలో పద్దెనిమిదేళ్ల పారా–స్విమ్మర్ జియా రాయ్ ప్రతిష్ఠాత్మకమైన ‘ట్రిపుల్ క్రౌన్ ఆఫ్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్’ను పూర్తి చేసి, ప్రపంచంలోనే మొదటి మహిళా పారా–స్విమ్మర్ గా చరిత్ర సృష్టించింది.
న్యూయార్క్ నగరంలోని మన్హట్టన్ చుట్టూ 48 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా ఈది అద్భుతమైన ఘనతను సొంతం చేసుకుంది జియా రాయ్. అత్యంత కష్టంగా భావించే ‘20 బ్రిడ్జెస్ స్విమ్’ అనే పోటీని పూర్తి చేయడానికి 8 గంటల 53 నిమిషాల సమయం పట్టింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన ఓపెన్–వాటర్ చాలెంజ్లలో ఒకటిగా మన్హట్టన్ సర్క్యూట్ను పరిగణిస్తారు. అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు, పడవల రద్దీని తట్టుకొని, రోజంతా మారుతూ ఉండే శక్తిమంతమైన ఆటుపోటు ప్రవాహాలను ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. ఒకానొక సమయంలో జియా రాయ్ శరీర ఉష్ణోగ్రత పడిపోయి ప్రమాదం బారిన పడింది.
ఎస్కార్ట్ బోట్ తాకకుండా...
న్యూయార్క్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ అసోసియేషన్ నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ నీటి నుండి బయటికి రాకుండా, ఎస్కార్ట్ బోట్ను తాకకుండా మొత్తం దూరాన్ని పూర్తి చేసింది జియా. ఆమె నీటిలో ఉన్నంతసేపు ఒక ఫీడింగ్ పోల్ ద్వారా అవసరమైన ద్రవాలు, పోషకాలను అందించారు.
‘ఆగస్ట్ 30 తెల్లవారుజామున బ్యాటరీ పార్క్లో తన ప్రయాణాన్ని ప్రారంభించి, అదేరోజు మధ్యాహ్నం ఫినిష్లైన్కు చేరుకుంది’ అని ఆమె తండ్రి, నావికాదళంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్గా పని చేస్తున్న మదన్ రాయ్ తెలియజేశారు.
ఆటిజం, స్పెక్ట్రమ్ డిజార్డర్పై అవగాహన కలిగించడానికి తన విజయాన్ని అంకితం చేసింది జియా రాయ్. ఈ విజయం ఆమె ఎన్నో ఏళ్ల కష్టానికి దొరికిన
ప్రతిఫలం.
ఆ వెలుగు చూసి...
రెండు సంవత్సరాల వయసులో జియా, ఎదుగుదల లోపాలకు సంబంధించిన స్పెక్ట్రమ్ డిజార్డర్తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. ప్రతిరోజు తండ్రితోపాటు పార్క్లకు వెళుతుండేది జియా. ఈ క్రమంలోనే ఈ చిన్నారికి స్విమ్మింగ్పై ఆసక్తి పెరిగింది. స్విమ్మింగ్కు సంబంధించి వీడియోల ద్వారా తల్లిదండ్రులు ఈ చిన్నారికి మార్గనిర్దేశం చేసేవారు. బాల్యంలోనే స్విమ్మింగ్పై ఆసక్తి జియాను పారా–స్విమ్మింగ్ కెరీర్లోకి అడుగు పెట్టేలా చేసింది.
ఎన్నో విజయాలు!
ట్రిపుల్ క్రౌన్ సాధించాలంటే మూడు ప్రధాన ఈత పోటీలలో విజయం సాధించాలి. 2024లో ఇంగ్లీష్ చానల్, 2025లో కాటలినా చానల్, 20 బ్రిడ్జెస్ స్విమ్ విజయవంతంగా పూర్తి చేసింది జియా రాయ్.
గతంలోనూ ఎన్నో గొప్ప విజయాలు సొంతం చేసుకుంది. మార్చి 2022లో పాక్ జలసంధిని అత్యంత వేగంగా ఈది, 29 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల 10 నిమిషాల్లో దాటి ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ఆటిజంతోపాటు స్పెక్ట్రమ్ డిజార్డర్తో బాధపడుతూ ఇంగ్లీష్ ఛానెల్ ఈదిన మొదటి అమ్మాయిగా వార్తల్లో నిలిచింది జియా. ఆటలపై ఆమెకు ఉన్న అంకితభావానికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు వచ్చాయి. 2022లో ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’వంటి అనేక ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు లభించాయి.


