తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సోషల్ మీడియా ప్రచారానికి వినియోగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ‘ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే తిరుమల లడ్డూ ఉచితం’ అంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమిళనాడుకు చెందిన షణ్ముగం అనే వ్యక్తి ఫేస్ బుక్లో ఈ వీడియోను పోస్టు చేసినట్లు సమాచారం. తన చానల్ను సబ్స్క్రైబ్ చేసిన వారికి ఒక్కొక్కరికీ ఒక్కో తిరుమల లడ్డూను ఇస్తున్నట్లు వీడియోలో చూపించారు.
ఇలా సుమారు 30 మందితో సబ్స్క్రైబ్ చేయించుకుని.. వారికి 30 లడ్డూలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా మరో వీడియోలో తన చానల్ను సబ్స్క్రైబ్ చేసి.. వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసిన వారికి తిరుమల లడ్డూల బాక్స్ను పంపిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. ఈ వీడియోలు వైరల్ కావడంతో భక్తుల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సోషల్ మీడియా ప్రచారానికి ఉపయోగించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇంత పెద్ద మొత్తంలో లడ్డూలు ఎలా వచ్చాయి?
తిరుమలలో లడ్డూ ప్రసాదం జారీకి నిర్దిష్ట నిబంధనలు, పరిమితులు ఉన్నాయి. అలాంటప్పుడు సదరు వ్యక్తి వద్దకు పెద్ద సంఖ్యలో లడ్డూలు ఎలా చేరాయి? వాటిని అధికారికంగా తిరుమల నుంచి పొందారా? లేక మరే మార్గంలో సమకూర్చుకున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీడియోలో చూపించిన లడ్డూలు నిజంగా టీటీడీ ప్రసాదాలేనా తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై టీటీడీ అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.
చదవండి: ‘ఒరేయ్ మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్ రా.. రా కూల్డ్రింక్ తాగుదాం!’


