పల్నాడు: ‘ఒరేయ్ మీ నాన్న నాకు మంచి స్నేహితుడురా... నీకు కూల్డ్రింక్ ఇప్పిస్తా..రా’ అంటూ బాలుడికి మాయమాటలు చెప్పి సైకిల్తో ఉడాయించిన ఘటన గణపవరం గ్రామంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకునూరి నాగేశ్వరరావు కుమారుడు పవన్కుమార్ స్థానిక జెడ్పీహైస్కూలులో ఐదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో స్నేహితులతో ఆడుకునేందుకు సైకిల్పై ఇంటి నుంచి బయలుదేరాడు. సినిమాహాల్ రోడ్డులో వెళ్తుండగా ఓ యువకుడి ఎదురై పవన్కుమార్ను ఆపాడు. మీ నాన్న నాకు తెలుసు.. బజారుకు వెళ్దాం రా అంటూ మాటలు కలిపాడు. పవన్కుమార్ను సైకిల్పై వెనుక కూర్చొబెట్టుకుని మెయిన్రోడ్డులోని ఓ బడ్డీ దుకాణం వద్దకు తీసుకెళ్లాడు.
పవన్కుమార్కు కూల్డ్రింక్ ఇప్పించి, గ్లాసులు తీసుకొనివస్తా ఇక్కడే ఉండమని చెప్పి సైకిల్ తీసుకొని వెళ్లాడు. ఎంతసేపటికి తిరిగిరాకపోయేసరికి బాలుడు పవన్కుమార్ ఇంటికి వెళ్లి విషయాన్ని తండ్రికి వివరించాడు. అగంతక వ్యక్తి కోసం గ్రామంలో వెతికినా ఫలితం లేకపోవటంతో ఓ ఇంటి సీసీ కెమేరాల ఫుటేజీని పరిశీలించారు. బాలుడిని సైకిల్పై ఎక్కించుకుని వెళ్తున్న సంఘటన సీసీ కెమెరాలో రికార్డు అవటంతో బాలుడి తండ్రి నాగేశ్వరరావు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చదవండి: పల్నాడులో కలవరపెడుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలు!


