సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా మారికవలస గురుకులం దగ్గర ఆందోళన కొనసాగుతోంది. గిరిజనుల గురుకుల పాఠశాల పోరాటంపై పోలీసులు ఉక్కు పాదం మోపారు. మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి బాలరాజును పోలీసులు అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తుండగా అడ్డుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం అని కూడా చూడకుండా పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారు.
రోడ్డుపై ఉండడానికి వీల్లేదని జీప్ ఎక్కాలంటూ నార్త్ జోన్ ఏసీపీ అప్పలరాజు బెదిరింపులకు దిగారు. పోలీసుల తీరుపై పుష్పశ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లడం తప్పా అంటూ ఆమె ప్రశ్నించారు.
మారికవలస హైవేపై ఉద్రిక్తత
మారికవలస హైవేపై ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, వైఎస్సార్సీపీ నాయకులు మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతు.. మహిళలు చూడకుండా పోలీసులు అమర్యాదగా వ్యవహరించారన్నారు. గిరిజన మహిళలంటే అంత చులకన. తల్లిదండ్రుల పోరాటానికి సంఘీభావం తెలపడం తప్పా?. శాంతియుతంగా నిరసన చేస్తే అడ్డుకుంటారా? గిరిజనుల హక్కులను కాల రాసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు’’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖలో హై టెన్షన్..
విశాఖలో హై టెన్షన్ నెలకొంది. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ మారికవలస గురుకుల పాఠశాలలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ప్రశ్నించడానికి వెళ్తున్న ఎమ్మెల్యే మత్స్యలింగంను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అనుమతి లేదంటూ బలవంతంగా అడ్డుకుని విశాఖ మూడో టౌన్ స్టేషన్కు తరలించారు.
ప్రజా గొంతుకను నొక్కేందుకే ఈ అక్రమ అరెస్టులా.? అంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు, గిరిజన సంఘాలు భగ్గుమంటున్నాయి. గురుకుల విద్యార్థులకు అండగా నిలిచినందుకు వెళ్తున్న ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తారా? వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ దగ్గరకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.


