గుంటూరు: తెలిసిన వ్యక్తులు జరిపిన దాడిలో తలకు రక్తస్రావమైన బాధిత మహిళ ఆమె భర్తతో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు రావడం కలకలం రేపింది. తల వద్ద రక్తం కారుతూ వస్తున్న ఆమెను గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు వెంటనే గుర్తించారు.
ముందుగా జీజీహెచ్కి వెళ్లి చికిత్స చేయించుకోవాలంటూ ఆమెకు సూచించారు. గాయపడిన ఆమెను పోలీసులు నచ్చచెప్పి, చికిత్స నిమిత్తం జీజీహెచ్కు ఆటోలో హుటాహుటిన పంపించారు. తొలుత బాధిత మహిళ అయిన గోరంట్ల గ్రామానికి చెందిన పి.సునీత మీడియాతో మాట్లాడారు. ‘కొంత కాలంగా ఓ ప్రైవేట్ కళాశాలకు హౌస్ కీపింగ్ పనులు నిర్వహిస్తున్నాను. హౌస్ కీపింగ్ పనుల విషయమై ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన సూపర్వైజర్లు నాతో గొడవకు దిగుతున్నారు. సదరు కంపెనీ సూపర్వైజర్లు హైదరాబాద్లో ఉంటున్న నిర్వాహకుల ఆదేశాల మేరకు నాతో అమర్యాదగా మాట్లాడుతున్నారు. ఆడ మనిషికి హౌస్ కీపింగ్ పనులు ఎందుకంటూ హేళన చేస్తున్నారు.
సదరు కంపెనీకి చెందిన కార్మికులు గోరంట్ల గ్రామంలో గంజాయి తాగుతుండగా దానిపై మేం అభ్యంతరం వ్యక్తం చేశామని’ చెప్పారు. దీంతో మాపై రెండు విధాలుగా కక్ష పెంచుకుని సోమవారం ఉదయం ఐదుగురు మహిళలతో సదరు కంపెనీ సూపర్వైజర్లు వచ్చి వాదనకు దిగారు. ఈ క్రమంలో నాపై రాళ్లతో దాడి చేయగా, కుడి చెవిపై తీవ్ర రక్తస్రావమైందని తెలిపారు. నాపై హత్య ప్రయత్నం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను వేడుకుంది. ఆమెతోపాటు భర్త రాహుల్ మీడియాతో మాట్లాడారు.


