breaking news
Supervisors
-
పారదర్శకంగా అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: అంగన్వాడీ సూపర్వైజర్(గ్రేడ్–2) పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ స్పష్టం చేశారు. పోస్టుల భర్తీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ ఆమె సోమవారం మీడియాతోమాట్లాడారు. 2013లో చేపట్టిన ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను అప్పట్లో పట్టించుకోలేదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వాటి భర్తీకి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. 560 పోస్టుల భర్తీకి అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు అవకాశం ఇచ్చినట్టు చెప్పారు. అర్హులైన వారినుంచి దరఖాస్తులు తీసుకుని పారదర్శకంగా రాతపరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా భర్తీచేసేలా పటిష్ట మైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే 560 పోస్టులకు 21 వేలకు పైగా దరఖాస్తులొచ్చాయని, వారికి ఈ నెల 18న నాలుగు జోన్లలో మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా ఓఎంఆర్ షీట్స్ ద్వారా రాతపరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. రాతపరీక్ష 45 మార్కులతోపాటు.. మరో ఐదు మార్కులకు ఇంగ్లిష్ పై పట్టు ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు వీడియో చేసి పంపాలని నోటిఫికేషన్లో పేర్కొన్నట్టు తెలిపారు. రాతపరీక్ష తర్వాత ఒక్కో పోస్టుకు ఇద్దరి(క్వాలిఫైడ్ లిస్ట్)ని ఎంపిక చేసి వారికి సమాచారం అందించినట్టు తెలిపారు. పో స్టుల భర్తీలో రోస్టర్ విధానం, దివ్యాంగుల కోటా వంటి అన్ని నిబంధనలు పాటిస్తున్నట్టు చెప్పారు. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలు వెల్లడిస్తామన్నారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సైతం ఎటువంటి అనుమానం ఉన్నా తమ ఆన్సర్ షీట్లను కూడా పరిశీలించుకునే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థుల్లో అపోహలు, అనుమానాలు రేకెత్తించేలా అసత్య వార్తలు, తప్పుడు ప్రచారాలు తగదని ఆమె సూచించారు. -
పోలీసుల నిర్వాకం.. గర్భిణి ఖైదీకి గర్భస్రావం, పరిహారంగా రూ. 3 కోట్లు
Pregnant Inmate Suffered Miscarriage As Cops Stopped At Starbucks: అమెరికాలో ఆరెంజ్ కౌంటీ జైలులో ఉన్న మహిళా ఖైదీకి పోలీసుల నిర్లక్ష్యం కారణంగా గర్భస్రావం అయ్యింది. దీంతో కోర్టు బాధిత మహిళకు పరిహారంగా రూ. 3 కోట్లు చెల్లించమని జైలు అధికారులను ఆదేశించింది. వాస్తవానికి 2016లో సదరు మహిళా ఖైదీ 28 ఏళ్ల సాండ్రా క్వినోన్స్కి కొన్ని షరతులతో కూడిన బెయిల్ పై విడుదలైంది. ఐతే ఆమె ఆ బెయిల్ నియమాలను ఉల్లంఘించడంతో జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది. అదే సమయంలో ఆమె గర్భవతి. ఐతే ఆమెకు ఒక రోజు ఉమ్మనీరు లీకవ్వడంతో తన పరిస్థితి బాగోలేదని ఆస్పత్రికి తీసుకెళ్లండని పోలీసులను వేడుకుంది. కానీ పోలీసులు ఆమె పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకువెళ్లడమే కాకుండా గర్భవతి అని కనికరం లేకుండా ... ఇంతటి ఎమర్జెన్సీ టైంలో ఒక కాఫీ హోటల్ వద్ద కారుని చాలాసేపు ఆపేశారు. కనీసం అంబులెన్స్కి కూడా కాల్ చేయలేదు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా... ఆమె తన బిడ్డను కోల్పోవలసి వచ్చింది. దీంతో సదరు మహిళా ఖైదీ తనకు న్యాయం చేయాలంటూ కోర్టు మెట్లెక్కింది. బాధితురాలి తరుఫు న్యాయవాది నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె పట్ల పోలీసులు కావాలనే ఉదాసీనతగా వ్యహరించారని కోర్టుకి తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే అంబులెన్స్కి కాల్ చేయలేదని రెండు గంటల ఆలస్యం కారణంగా అత్యంత విలువైన మాతృత్వపు భాగ్యాన్ని పొందలేకపోయిందని చెప్పారు. దీంతో కోర్టు జైలు సూపర్వైజర్స్ని బాధిత ఖైదీ క్వినోన్స్కు సుమారు రూ. 3 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. దీనికి జైలు సూపర్ వైజర్లు అంగీరించారు గానీ అందుకు సదరు బాధితురాలు కూడా అంగీకరిస్తేనే ఈ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఖరారు అవుతుందని కూడా స్పష్టం చేసింది. తొలుత సదరు మహిళా ఖైదీ పిటీషన్ని అక్టోబర్ 2020లో ఫెడరల్ కోర్టు కొట్టేసింది, కానీ అప్పీల్ కోర్టు గతేడాది ఈ కేసును తిరిగి పునరుద్ధరించి ఈ తీర్పును వెల్లడించింది. (చదవండి: పాకిస్తాన్లో అత్యవసర పరిస్థితి... 937 మంది మృతి) -
బిత్తి చిత్రాల మయూరి
ఫుల్పతియాకు దేవత పూనినట్లు ఉంది. వాళ్లమ్మకేమో భూమి అనేది లేదు. కాలువ సూపర్వైజర్ నీటితీరువా ట్యాక్సు పదిహేను రోజుల్లోపల కట్టమని ప్యూనుతో నోటీసు పంపాడు. అలా కట్టకపోతే ఆస్తిని, పశువులను జప్తు చేస్తామని నోటీసులో ఉంది. ఫుల్పతియా ఉగ్రురాలైంది. ‘‘ఇన్స్పెక్టరూ అరెస్టు చెయ్యాలంటే నన్ను అరెస్టు చెయ్యండి. ఈ వృద్ధాప్యంలో మా అమ్మ చేతికి సంకెళ్లు వేయడం మాత్రం నేనొప్పుకోను. నా బొందిలో ప్రాణముండగా నేనది జరగనివ్వను.’’ఈ విషయం తెలుసుకొని ఊళ్లోని వాళ్లందరూ పొలాల్లోంచి, తోటల్నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి అక్కడ గుమిగూడారు. పద్దెనిమిది సంవత్సరాల ఫుల్పతియా అమ్మను వెనకేసుకుని ‘‘నా ప్రాణం పోనీ. నా శవం ఇక్కడి నుంచి వెళ్లినా, నేను మాత్రం ఇది జరగనివ్వను’’ అని బిగ్గరగా అరిచింది. మాటిమాటికీ ఉమ్మేస్తూ.. కారణం లేకుండా మాటిమాటికీ నవ్వే వాడు తోఫాలాల్ సాహు అందరికంటే ముందు పరుగెత్తుకుంటూ వచ్చి, ఇన్స్పెక్టరుకు సలామ్ చేసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఎదురుగా నిలబడ్డాడు అదను దొరికితే మాట్లాడాలని. ఆ ఊరిలో ఎవరికి ఏ ఆపద సంభవించినా, ఏ దుర్ఘటన జరిగినా, తండ్రీ కొడుకుల మధ్య పోట్లాట జరిగినా, ఎవడైనా తన భార్యను కొట్టినా అందరికంటే ముందు తోఫాలాల్ ఆ స్థలానికి చేరుకుంటాడు. ఇతరులు కష్టాల్లో ఉండటం చూస్తే అతనికి మహానందం కలుగుతుంది. ఎక్కడైనా ఎవరికైనా మంచి జరిగితే ఆ చల్లని సమాచారం విని అతనెప్పుడూ అక్కడికి వెళ్లడు. ఇప్పుడేమో ఫుల్పతియా అమ్మ అరెస్టు మాట విని అందరి కంటే కూడా ఎక్కువ సంతోషం కలిగింది అతడికి. తన తమ్ముని కూతురి పెళ్లి సందర్భంలో ‘‘వదినా, నీవు వచ్చి పెళ్లిమండపం దగ్గర గోడలపై బొమ్మలు గీచిపెట్టు ఫుల్పతియా వాటికి రంగులు వేస్తుంది’’ అని ఫుల్పతియా అమ్మను బతిమాలాడాడు. కానీ ఆవిడ కాదంటే కాదు అంది. నడుము నొప్పిగా ఉందని ఏదో సాకు చెప్పింది. అప్పుడు కూడా ఫుల్పతియా ఎగతాళి చేస్తూ ‘‘పోరాదే అమ్మా! తోఫా కాకా పట్నం నుంచి మంచి డాక్టరును పిలిచి వైద్యం చేయిస్తాడులే’’ అని అంది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు తోఫాలాల్కు ఫుల్పతియా అమ్మను, ఫుల్పతియాను ఎగతాళి చేస్తూ నవ్వే అవకాశం లభించింది. ‘‘ఫుల్పతియా ఎదిగినదానివి, పెళ్లికానిదానివి ఎందుకు పోతావే జైలుకు. ఇప్పుడు మీ అమ్మ పోతే పోనీలే. మీ అమ్మ జైలుకు పోతే జైల్లో సర్కారీ డాక్టరు ఉచితంగా వైద్యం కూడా చేస్తాడు.’’ అంటూ వెకిలిగా నవ్వుతూ అన్నాడతను.‘‘నువ్వు నోరు మూసుకుంటావా లేదా..’’ అని గద్దించి తోఫాలాల్ నోరు మూయించింది.ఇంతలోనే ఊరి సర్పంచ్ తాహా మియా కూడా వచ్చాడు. వస్తూనే గవర్నమెంట్ వాళ్ల మనిషి మాదిరి ‘‘నీకేమైనా పిచ్చి పట్టిందా? ఊరుకో’’ అని ఫుల్పతియాని గద్దించాడు.ఫుల్పతియా ఈ రోజు ఎవరి మాటా వినేట్లు లేదు. ఊరికి పెద్దగానీ, సర్పంచ్గానీ.. తాహా మియా మాటకు అడ్డొస్తూ.. ‘‘మాకు ఈ రోజు ఎవరడ్డు వచ్చినా వాళ్లను వదిలేది లేదు. సర్పంచ్ గానీ, గిర్పంచ్ గానీ’’ అంటూ బల్లగుద్దినట్టు ఫుల్పతియా అన్నది. ఇన్స్పెక్టర్ ఫుల్పతియా దగ్గరకొచ్చి నిలబడిచేతులెత్తి నమస్కారం చేస్తూ, ‘‘ఏమండీ, నేను ఇన్స్పెక్టర్ని కాదు. ఎవరినీ అరెస్టు చేయడానికి రాలేదు. నేను కుటీర శిల్ప విభాగం, పట్నా నుంచి వచ్చాను. నేను వచ్చిన పనేమిటంటే..’’ అన్నాడు.అతని మాటలు విని అక్కడ గుమిగూడిన వాళ్లంతా గొల్లుమన్నారు. ‘‘భలే! ఎవరూ ఏమీ తెలుసుకోకుండానే ఏమిటనీ ఇంత రాద్ధాంతం.’’ కానీ ఈ విషయం నవ్వులాటగా ఉండిపోలేదు. నెమ్మది నెమ్మదిగా ఊరంతా పాకింది. ‘‘ఏమి విడ్డూరం. ఇదెక్కడైనా విన్నారా? పట్నా నుంచి ఎవరో జెంటిల్మన్ ఆఫీసర్ వచ్చి ఫుల్పతియా రాసిన చిత్రాలను చూసి, వీటిని ప్రింటు చేసి అమెరికా, రష్యా పంపిస్తారట’’ ‘‘ఎవరిని పంపుతారట రష్యా, అమెరికాలకు.. ఫుల్పతియా అమ్మనా?’’‘‘డబుల్ ఇనామ్ ఇస్తానన్నారట. కానీ అతనేమో, చూడటానికి మన దేశపువాడిలాగే ఉన్నాడు.’’‘‘ఫుల్పతియా అప్పుడేమో గర్జించింది. ఇప్పుడు చూడుపో, పట్నం నుంచి వచ్చిన ఆ ఆఫీసర్కు రకరకా వంటకాలు తయారు చేస్తోంది.’’‘‘అతడు మన అన్నం తింటాడా? ఏ కులస్తుడో మరి?’’‘‘ఫుల్పతియా అమ్మ అదృష్టం లేచొచ్చిందనుకో’’‘‘అది కాదురా పాపం, ఆవిడ ఆస్తిపాస్తులను భర్తను పోగొట్టుకుని ఎన్ని కష్టాలు అనుభవిస్తోందో నీకేం తెలుసు? ఇంటి వాకిళ్లకు ‘శుభ్లాభ్’ పెండ్లీ పేరంటాలప్పుడు ఊళ్లో వాళ్ల ఇంటి గోడలకు పూలు, తీగలు, వాటి మధ్య దేవుళ్లు దేవతలను చిత్రిస్తోంది కదా! ఆ సుకృత ఫలమే ఇది. మనం అంటాం గానీ భగవంతుడు గుడ్డివాడేమీ కాదు..’’‘‘ఇంకేమీ ఫర్వాలేదు. ఫుల్పతియా పెళ్లి కూడా జరిగిపోతుంది. పెళ్లి ఖర్చులకు అమెరికా, రష్యాల నుంచి పైసలొచ్చేస్తాయి.’’గులాబీ రంగు దిండుపైన గంజాయి ఆకులను కత్తెరతో కత్తిరిస్తూ అనూప్లాల్– ‘‘ ఏమిటేమిటో వాగుతున్నారే. ముందు ఆ వచ్చిన మనిషి ఎవడు? అసలోడా, నకిలీవాడా.. అన్నీ ఆలోచించాలి కదా. మీకు గుర్తుంది కదా ఒకసారి నకిలీ లాటరీ కంపెనీ వాడు, నకిలీ ఏజెంటు వచ్చి లబ్బోలియా ఊరులోని మరచూ మహతోను మోసం చేసి యాభై రూపాయలు కాజేశాడు. అప్పుడు అన్ని ఊళ్లల్లో పుకార్లు పుట్టించారు కదా, మరచూ మహతో లాటరీలో లక్షాధికారి అయ్యాడని! యాభై రూపాయల స్టాంపు పేపరు కొని, దానిపైన అఫిడవిట్ రాయించాడు. అఫిడవిట్ చూపించి, బ్యాంకు నుంచి లక్ష రూపాయలు తీసుకో అన్నాడు. మరేమైందో మనందరికీ తెలిసిన విషయమే కదా. మరచూ మహతో ఆ దెబ్బకు పిచ్చోడైపోవాల్సింది. అదృష్టం బాగుండి పిచ్చివాడు కాలేదు.’’ అని అన్నాడు. అందరూ నవ్వారు. రామ్ఫల్ మాటలు అల్లేదాంట్లో నేర్పరి. ‘‘మరచూకు లక్షరూపాయలు దొరకలేదు గాని ఓటర్ల లిస్టులో అతని పేరు మహతో లక్షాధికారి అని నమోదైంది. అరే ఒకటే ఊరిలో ఇద్దరు మరుచూలు, ఇద్దరూ మహతోలే! ఓటర్ల పేర్లు నమోదు చేసుకునే ఆయన ఒకటే పేరుతో ఇద్దరు వ్యక్తులుంటే చాలా తంటా అవుతుంది అన్నాడు. అప్పుడు మరచూ మహతోను ఊళ్లో వాళ్లు ఎగతాళికి లక్షాధికారి అంటారని చౌకీదారు అన్నాడు. ఇంకేముంది నమోదు చేసే ఆయన ఆ విధంగా నమోదు చేసుకున్నాడు.’’నాగేశర్ దాస్ ఆ ఊళ్లో అబద్ధాలకోరని ప్రతీతి– కానీ అతను చెప్పేదంతా ఊళ్లో వాళ్లు శ్రద్ధగా వింటారు. ‘‘మరచూ మహతోకు తగిలిన లాటరీలో ఒక రహస్యముంది. అది మీలో ఎవరికన్నా తెలుసా?’’ అన్నాడు. ‘‘మరచూ దగ్గరకు వెళ్లి నీవు ఐదువేల రూపాయలు ఖర్చు చేశావంటే మంచి వయసులో ఉన్న వితంతువుతో నీ వివాహానికి ఏర్పాటు చేయిస్తానన్నాడు. మరచూ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నట్లు ఒక కాగితం మీద రాయించుకున్నాడు. పాపం మరచూకు లాటరీ తగల్లేదు. కానీ జోఖన్ అతని చేత రాయించుకున్న కాగితాన్ని ఆధారంగా పెట్టుకుని మరచూ మాట తప్పినందుకు అతని రెండు గేదెలను..’’‘‘ఏమయ్యో, ఈ మనిషి తప్పకుండా సీఐడీ అయి ఉండొచ్చు. లేకపోతే పట్నాల్లో ఫొటోలు, చిత్రాలుకరువా, చిన్న చిన్న పాన్ దుకాణాల్లో కూడా ఒక దాని కంటే మించి ఒకటికి మించిన రంగు రంగుల దేవతల, దేవుడి బొమ్మలు గల కేలండర్లు వేలాడుతూ ఉంటాయి. అలాంటప్పుడు పట్నం నుంచి ఈపల్లెటూరికి వచ్చి, ఈ పల్లెటూర్లో గోడలపై రాసిన చిత్రాలపై మోజుపడటం నమ్మదగిన మాటేనా’’ అని ఒక మధ్య వయస్కుడన్నాడు.సాయంత్రం బండి ఎక్కిపోయే ముందు ‘‘వచ్చేవారం మీకు ఉత్తరం రాసి అన్ని విషయాలూ తెలియజేస్తా’’మని ఫుల్పతియా అమ్మతో చెప్పి పోయాడు ఆ జంటిల్మన్.‘‘బాబూ, అన్ని విషయాలూ చెప్పావు. గానీ నీ పేరు మాత్రం చెప్పలేదు’’ అంది ఫుల్పతియా అమ్మ.‘‘నా పేరు సనాతన్ ప్రసాద్’’ అన్నాడు నవ్వుతూ.‘‘తెలియక కోపంతో ఏమేమో అన్నాను. అవన్నీ మనసులో పెట్టుకోకండి’’ అంది ఫుల్పతియా సిగ్గుతో తలవంచుకుని.‘‘ఉహూ.. మనసులో ఉంచుకుంటాను. నీవునాతో ఏమన్నావు..‘నన్ను అరెస్టు చేయండి’ అని అన్నావు!’’ సనాతన్ ఎగతాళిగా ఆమె వైపు చూస్తూ అన్నాడు. ఫుల్పతియా ముఖం సిగ్గుతో ఎర్రబడింది.పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్లిపోయింది. లక్ష్మి వచ్చిందంటే పైకప్పును కూడా చీల్చుకొని వస్తుంది అంటే ఇదేనేమో. పద్దెనిమిది పంతొమ్మిదేళ్ల కిందట ఫుల్పతియా నాన్న కోర్టు వ్యవహారాల్లో ఉన్న ఆస్తినంతా తగలేసి, తను తగలబడిపోయాడు. కోర్టుకేసులో ఓడిపోయాననే దుఃఖంతో విషం తాగి చనిపోయాడు. అప్పటి నుంచి ఊళ్లో వాళ్ల ఇళ్లల్లో దంచి, విసరి ఒడిలో ఉన్న ఒక్కగానొక్క సంతానాన్ని సాకింది. తన చేతిలో ఉన్న నైపుణ్యం వల్ల ఊళ్లో పేరు ప్రతిష్ఠలుండేవి. కానీ ఇప్పుడు కాగితాలపైన ప్రింటైన రంగురంగుల చిత్రాలు రావడంతో ఇప్పుడు పెళ్లి పేరంటాలకు గోడలపై ముగ్గులూ రకరకాల బొమ్మలూ అలంకరించడానికి ఆమెను ఎవరూ పిలవడం లేదు. నిన్న పోస్ట్మ్యాన్ వచ్చి ఆమెకు రెండొందల యాభై రూపాయలు మనియార్డరు వచ్చిందని డబ్బులిచ్చిపోతే అప్పుడనిపించింది ఊళ్లోవాళ్లందరికీ పాతకాలపు వస్తువులన్నీ బేకారు కాదని. ‘‘పాట్నా నుంచి వచ్చిన ఆ వ్యక్తి నకిలీ కాదని, అసలైన ఆఫీసరేనని ఊరిలోని అందరికీ తెలిసిపోయింది.వారం పది రోజుల తర్వాత సనాతన్ ప్రసాద్ మళ్లీ ఆ ఊరికొచ్చాడు. ‘‘ఫుల్పత్తి అమ్మ వెళ్లిపోయిందని– పాట్నాకు కాదు సరాసరి ఢిల్లీకి, సనాతన్ ప్రసాదే ఆమెను తీసుకెళ్లాడని, ఢిల్లీలో ఒక్కొక్క భిత్తి చిత్రానికి వెయ్యి రూపాయలు మజూరీ ఇస్తారట అని ఊళ్లో వాళ్లకితెలిసిపోయింది.’’‘‘మజూరీ కాదు, బక్షీస్ అను.’’‘‘ఫుల్పత్తీ! వెంటపోలేదా?’’‘‘పోలేదు. ఏదో ఊళ్లో టీచరుగా పనిచేసే ఆవిడ అత్త వచ్చిందట. ఇక్కడే పది పదిహేను రోజులుండి పోవడానికి సెలవు తీసుకొని వచ్చిందట.ఇక చూడండి. అందరూ వచ్చి చేరుతారు– మామాఅత్త, పెద్దమ్మ–పెదనాన్న, మేనత్త–మేనమామ.. వీళ్లే కాకుండా అమ్మవైపు వాళ్లు, నాన్నవైపు వాళ్లు బంధుత్వం కలుపుకుంటూ వస్తారు. ఇంతకు ముందెన్నడూ వీళ్లను పట్టించుకోని వారంతా వస్తారు.’’ చాలా రోజుల తర్వాత స్టేషన్ బజారులో ఉండే బదరీ భగత్ ఫుల్పత్తీ అమ్మ ఫొటో పడిన పేపర్ తీసుకొని వచ్చాడు. చాలా పెద్ద ఆఫీసరు చేత్తో ఫుల్పత్తి అమ్మ బహుమానం తీసుకుంటున్నఫొటోఅది.భగత్ ఉండేదేమో స్టేషన్ బజారులో. జాతికి కోమటాయన. బియ్యం, పప్పుల ధరలతో పాటు ప్రపంచంలో జరిగే సమాచారమంతా తెలుసుకొంటాడు. ఎప్పుడూ పేపరు చదువుతూనే ఉంటాడు. ‘‘ఏరోజు ఫుల్పత్తి అమ్మ తిరిగొస్తుందో ఆ రోజు మనమందరమూ స్టేషన్ వద్ద ఆమెకు బ్రహ్మాండంగా స్వాగతం పలకాల’’ని అందరికీ చెప్పాడు. వెదుర్లతో బోదతో స్వాగత తోరణాలు కట్టించి, వాటికి మట్టి మెత్తి ఆ మట్టి గోడలపైన ఫుల్పత్తితో బొమ్మలు గీయిద్దాం. ఓ ఫులోదీదీ నీకు సంక్రమించిన అమ్మ విద్యను జాగ్రత్తగా నేర్చుకున్నావంటే నీకు కూడా ఒక రోజు సర్కారోళ్లు బహుమానం ఇస్తారు. అప్పుడు మన ఊరు పేరు ప్రతిష్ఠలు ఆలిండియా ఏమిటి, ఇండియా బయటికి కూడా వ్యాపిస్తాయి. ఈ పేపరులో ఏమి రాశారో తెలుసా? శ్రీమతి ఫణియా ఉరఫ్ పన్నాదేవి తాను గీసే ప్రతి చిత్రంలో వచ్చీరాని భాషలో తన పేరుతో పాటు తన ఊరు జిల్లా పేరు కూడా తప్పకుండా రాసుకుంటుంది. మీరే చెప్పండి అలాంటప్పుడు మన ఊరి పేరు గణింపులోకి వస్తుంది కదా’‘‘అవును మరి.’’‘‘పన్నాదేవికి జై పన్నాదేవికి జై!’’ ఊరిలోని యువకులందరూ జయజయ ధ్వానాలు చేశారు. ఇప్పుడు ఫుల్పత్తి చెయ్యి బాగా తిరిగింది. అమ్మ విద్యను ఆకట్టుకుంది. ‘‘ఎందుకు రాదు. అమ్మ చేత నేర్చుకునేటప్పుడు ఫుల్పత్తి తక్కువ దెబ్బలు తిందా’’ అంది ఫుల్పత్తి అత్త. ఆమె తన ఊరు పోరియాలోని కన్యా పాఠశాలలో పంతులమ్మ. ఎప్పుడూ తాంబూలం నములుతూ ఉంటుంది. ఆవిడ బదరీ భగత్తో ‘‘మిగతా పనులన్నీ వాళ్ల అమ్మ ఉన్నప్పుడు ఫుల్పత్తినే చేసేది. నానిన బియ్యాన్ని బండపై చాలా మెత్తగా నూరటం, పిండిని పాలల్లో కలపటం, ఆ తర్వాత అడవి చెట్టు ‘మేధాకార్’ చిగుళ్లను దానిలో వేసి బాగా చిలకటం, బొమ్మలు గీసే పుల్లలకుగుడ్డపీలికలు చుట్టడం, రంగులు కలుపుకోవడం అలాంటి పనులన్నీ ఫుల్పత్తి చిన్నప్పటి నుంచే చేస్తూ ఉంది. ఎప్పుడైనా పిండి కొంచెం మందమైనా చిత్రాలు గీసే పుల్లలకు కట్టిన గుడ్డ పీలికలు వదులైనా, లేకరంగులు ఎక్కువ చిక్కగా తయారైనా లేక పల్చనయినా జుట్టు పట్టుకుని వీపుపైన బాదేది ఢమా ఢమా!’’‘‘మామీ, ఫుల్పత్తిని మీ ఇంట్లో ఉంచుకుని నాలుగు అక్షరాలు నేర్పిస్తే బాగుంటుంది కదా’’ అని బదరీ భగత్ అన్నాడు. ‘‘నిజమేనండీ భగత్గారు, ఫుల్పత్తిని లోయర్ వరకు చదివించి, రామాయణం చదవడంనేర్పించిన తర్వాత అప్పర్ ప్రైమరీ కూడా చదివించాలనుకున్నా. కాని వాళ్లమ్మొండి పట్టు పట్టింది. పిల్లను ఇంక చదివించకూడదని, అక్కకూ ఒకటే కూతురు కదా! మనమేం జేస్తాం.’’ ఆ అత్త అన్నది.‘‘ఇక నీవే ఏదో ఒక మంచి సంబంధం చూసి, ఫుల్పత్తికి పెండ్లి చేయించు. అంతో ఇంతో ఇవ్వాల్సి వచ్చినా ఫర్వాలేదులే’’ అన్నాడు భగత్.దరీ భగత్ ఇచ్చిన జర్దా నోట్లో వేసుకుంటూ, ‘‘బదరీ బాబు, మంచి సంబంధం దొరికేది ఉందే అదంతా భగవంతుని చేతిలో ఉంది. భగవంతుడి దయ ఉంటే ఏ పనైనా సులువుగా అయిపోతుంది’’ అని అంది.నాగేశర్ దాస్ మళ్లీ ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘జోఖన్ ఇక్కడ విచారించి ముందు వెనుకా చూసి ఒక సంబంధం చూశాడు.ఫుల్పత్తిఅమ్మ ఐదువేలు అడ్వాన్స్ ఇచ్చి ఉంటే పెళ్లికొడుకు దొరికుండేవాడు. కానీ ఫుల్పత్తి అత్తకు సంబంధం నచ్చలేదు.’’ఫుల్పత్తి అమ్మ తిరిగొచ్చింది. తన వెంట తనకు లభించిన ఇనాము బాపతు సరుకు మూడు ఎడ్ల బండ్లలో వెంట తీసుకొచ్చింది. స్టేషన్ వద్ద జయజయ ధ్వానాలతో ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. నిజంగానే ముచ్చటైన స్వాగత తోరణాలు కట్టారు. స్టేషన్ వద్ద ఫుల్పత్తి నైపుణ్యం– ఎనిమిదణాల నుంచి పన్నెండణాల వరకు పెరిగింది. సనాతన్ ప్రసాద్ కూడా వెంట వచ్చాడు. బండి దిగుతూనే అతని దృష్టి అందరికంటే ముందు స్వాగత తోరణాలపై ఉన్న చిత్రాలు, వాటి కళా నైపుణ్యంపైన పడింది. వాటి ఫ్రేము తయారు చేయడం, కలశ నిర్మాణం, పువ్వుల తీగల అల్లికలతో కూడిన చిత్రాలు చాలాసేపటి వరకు అతను వాటినే చూస్తుండిపోయాడు. ఇంటికెళ్లిన తర్వాత ఫుల్పత్తిని అడిగాడు. ‘‘ఎర్రరంగు చేపలు ఏ నదిలో దొరుకుతాయి. అక్కడ కలశానికి నాలుగువైపులా నువ్వు గీసిన చేపల ఎర్రరంగును చూసి నా మనసులో ఓ ప్రశ్న రేకెత్తింది’’ అన్నాడు.‘‘ఎక్కడేమిటి? మా ఊరిలోని చంద్రభాగా నదిలో జ్యేష్ఠ ఆషాడ మాసాల్లో కురిసే వర్షాల తర్వాత వెళ్లి చూడండి. మీకే తెలుస్తుంది. ఈ చేపల కారణంగానే నది కూడా అప్పుడప్పుడు ఎర్రగామారిపోతుంది. ఈ నదులు మీ పాట్నా వైపు ప్రవహించవా?’’‘‘అటువైపు చంద్రభాగా, కోసి నది గాని, వాటి ఏ ఉపనదిగాని ప్రవహించదు’’ఫుల్పత్తి మామ నరోత్తమ్ బాబుకు ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోనివ్వకుండా ‘‘ఢిల్లీ విశేషాలేమిటి?’’ అని అందరూ చుట్టుముట్టారు.‘‘ఇప్పుడే వచ్చారుగా! మమ్మల్ని ఇంటివిషయాలుకూడామాట్లాడుకోనివ్వండి’’ అని ఫుల్పత్తి అత్త వాళ్లతో అంది.ఫుల్పత్తి అత్త తన భర్తను లోపలికి తీసుకెళ్లి ఏకాంతంగా అడిగింది. ‘‘ఈ సనాతన్ ప్రసాద్ ఏమంటున్నాడో నీకు తెలుసా?’’‘‘తెలుసు. అతను అంటున్నది నిజమే! ఇక్కడ ఏముందని? నాలుగు గుడిసెలు, తాతల నాటి కాలంలోని ఒక పాత మిద్దె ఉంది అంతే కదా. మీ అక్క ఈ కొంపలోనే పడి ఉంటే ఏం లాభం? భగవంతుడే దయతలచి ఆమె అదృష్టాన్ని మార్చాలన్నప్పుడు మీ అక్క పట్నంలో పోయి ఉండవచ్చు కదా. ఐదు నుంచి తొమ్మిది వందల వరకు నెలసరి జీతం, లోహిదానగరంలో ఉండటానికి మంచి ఇల్లు, సనాతన్ ఆవిడ మంచికే చెప్పాడని ఫుల్పత్తి మామ జవాబిచ్చాడు. ‘‘సనాతన్ మన బంధువా ఏమన్నానా?’’‘‘బంధువులు ఎవరికి సహాయం చేస్తున్నారు ఈ కాలంలో. మనిషి ఎవరూ? అతని హోదా ఏమిటి? ఇది తెలుసుకుంటే చాలు. మన బం«ధువే అవ్వాల్సిన అవసరం లేదు. సనాతన్ గొప్పింటి బిడ్డ. తండ్రి గొప్ప ఆస్తిపాస్తులు సంపాదించి చనిపోయాడు. తండ్రి కట్టించిన పెద్ద ఇల్లుంది. కారుంది. ఏడాదిలో పది పన్నెండువేల చిత్రాలు కొని అమ్ముతుంటాడు. పాట్నాలో పెద్ద పెద్ద చదువుకున్నవాళ్లతోను, క్లబ్బులవాళ్లతోను మంచి పరిచయాలు ఉన్నాయి. పాట్నా కళా అకాడమీ సెక్రటరీగా ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి మరి?’’‘‘అక్క దీనికేమంటుంది? అక్కకిది సమ్మతమేనా?’’‘‘సమ్మతం దేనికుండదు? సమ్మతం లేకపోయినా ఆమెను ఒప్పించే ప్రయత్నం చేయడం మన పని’’ఫుల్పత్తి అమ్మ గోవు. గంగిగోవుతో సమానం. ఆవిడ మనసులో ఎలాంటి మోసం, కపటం లేదు. ఆవిడ వాళ్లు చెప్పిన మాటలన్నీ విని అర్థం చేసుకుని రాజీ అయింది. ఈ పిల్ల ఫుల్పత్తి ఏమంటుందో?ఫుల్పత్తి బొత్తిగా ఒప్పుకోవడం లేదు. ఈ సంబంధం గురించి ఆలోచిస్తున్నారని ఎప్పుడైతే ఫుల్పత్తికి తెలిసిందో అప్పటి నుంచి తిండితిప్పలు మానేసి ఇంట్లోనే పడి ఉంది. అమ్మ నచ్చజెప్పాలని ఎంతో ప్రయత్నించి అలసిపోయింది. మామ కూడా ప్రయత్నించి లాభం లేదనుకున్నాడు. నేను నచ్చచెప్పి ప్రయత్నిస్తానంటూ మామి ఫుల్పత్తివద్దకు వెళ్లింది.‘‘అమ్మాయీ, ఫుల్పత్తి!’’‘‘అత్త ఇక నువ్వొచ్చావా నన్ను ఏడిపించడానికి? ఢిల్లీ పాట్నా పోవాలని నీ మనసు ఉబలాటపడుతోందా? మా తాత తండ్రులు ఉన్న చోటును వదిలి నేనెక్కడికీ పోను. మీరుమొండి పట్టు పట్టారంటే నా శవమే ఈ ఇంటి నుంచి బయటకు పోతుంది’’ అని ఏడవసాగింది.‘చిన్నప్పటి నుంచి ఇంతే ఈ పిల్ల మొండిఘటం..’’సనాతన్ ఆలోచిస్తూ కూర్చున్నాడు. గత రెండు రాత్రుళ్లుగా అతనికి నిద్రలేదు. కళ్లు మూస్తూనే అతనికి తన లోపల ఎవరో కూర్చుని ఉన్నట్లు, తనను గుడ్లురిమి చూస్తూ ‘‘నీవు చేసేదేమిటి? బలత్కారమా?కన్నెను అపవిత్రం చేస్తావా? నీ కామోద్రేకం తీర్చుకోవడానికా ఈ కళా వ్యాపారం? హ, హ, హ.. బిగ్ స్కేల్ ఫేక్ ఆర్ట్ ఇండస్ట్రీ? హి, హి, హి.. ఇండస్ట్రీ పట్నంలో– మీ ఫ్యాక్టరీలో ఫుల్పత్తి, వాళ్ల అమ్మను బలి చేస్తావా? మధుబనీ శైలిలో మర్మజ్ఞుడు. ప్రవక్త, అధికారిగా వ్యవహరిస్తూ లోక కళ్యాణ వాతావరణానికి కళ్లు గప్పి నీవేమో నీ ప్రైవేటు చాంబరులో కూర్చుంటావు. ఫుల్పత్తి, వాళ్లమ్మ వీళ్లే కాకుండా, వందల కొద్దీ కళాకారులు నీ స్లాటర్ హోమ్లో బలిఅవుతూ ఆక్రందనలు చేస్తారు.’’ అని అడుగుతున్నట్లు అనిపించింది.ఈ వేళ తను ఫుల్పత్తితో స్వయంగా మాట్లాడుతాడు.ఈ వేళ ఫుల్పత్తి కొంచెం శాంతంగా ఉంది. తన వాకిలి పక్కనున్న గోడపైన అమ్మ గీసిన నెమలి లేఖలపైన రంగు పూస్తోంది.ఆమె దగ్గరికి వెళ్లి సనాతన్ అడిగాడు, ‘‘నాట్యం చేసేది మగ నెమలా లేక ఆడ నెమలా?’’‘‘నీవెప్పుడైనా నెమలి నాట్యం చూశావా?’’‘‘ఈ అడవిలో ఉండే కుగ్రామంలో నివసించే ప్రతి ఒక్కరూ ప్రతి వర్షాకాలం నెమళ్లు అరవటం వింటారు. అడవిలో అవి నాట్యం చేయడం కళ్లారా చూస్తారు. అసలు మీరు ఏమి చెప్పదలచుకున్నారో స్పష్టంగాఎందుకు చెప్పరు?’’ ‘‘అదే.. అదే.. మీరు మళ్లీ ఒకసారి ఆలోచించుకోండి!’’‘‘మాటిమాటికీ ఆలోచిస్తే ఏమవుతుంది? ఆలోచించాల్సి వస్తుంది. ఒకేసారి సనాతన్ బాబుగారు, మీరు తీసుకుని వెళ్లాలని ఉంటే ఆమె కూడా రావాలనుకుంటేఅమ్మను తీసుకెళ్లండి. అంతేగాని నన్నేమీ అడక్కండి.’’‘‘నాకు తెలుసు. అది వచ్చిన రోజే విన్నాను కదా!’’‘‘మీరు మమ్మల్ని ఏమనుకుంటున్నారు? మమ్మల్ని కూడా బొమ్మల్లోకి జమకట్టారా?’’‘‘అంటే’’‘‘అంటే మీరు డబ్బులిచ్చి ఏమైనా కొనగలరనుకుంటున్నారు.’’‘‘కొనటమా? లేదే! నేనే అమ్ముడుపోవాలనుకుంటున్నాను.’’‘‘సనాతన్ బాబు, మీరు చదువుకున్న వాళ్లు. విషయాలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు.’’సనాతన్ బాబు మౌనం వహించి తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. కొంతసేపాగి ‘‘సరే.. ఒకటడుగుతాను దయచేసి జవాబిస్తారా? అతను ఎవరు? అదే ఆ అదృష్టవంతుడు. మీరు వరించిన అతను ఎవరోచెప్పండి. అతని పేరు విని నేను చాలా సంతోషపడతాను’’ అని అన్నాడు.ఫుల్పత్తి గోడపై పింఛాన్ని విప్పి ఆహ్లాదకరంగా నాట్యం చేస్తూ ఉన్నట్లు రంగు రంగులతో చిత్రించబడిన నెమలి వైపు వేలితో చూపిస్తూ, ‘‘అతడే అక్కడ నాట్యం చేస్తున్నాడే అర్థమైందా?’’ అంది.ఒక నిట్టూర్పు విడిచి సనాతన్ అన్నాడు. ‘‘అర్థం చేసుకున్నా ఏమీ లాభం లేదు. సరే నాది మరొక కోరిక.. అంటే ప్రార్థన అన్నమాట.’’సనాతన్ తన రెండో కోరిక చెప్పుకుంటూ పోతున్నాడు. కానీ ఫుల్పత్తి చాలా ఉత్సాహంగా గోడపైన చిత్రించబడిన నెమలి పింఛానికి రంగులు పూస్తూ ఉంది. ఉన్నట్లుండి నెమలి పింఛాన్ని విప్పి ఎగిరినట్లు అతనికి అనిపించింది. నెమలి అరుపులో అతని మనసులోని బిజూ బన్ వికసించింది. మామిడి వనంలో ఉయ్యాల్లో ఊగుతూ బారామాస పాటలు పాడే బాలికల కంఠధ్వని– బిజూబన్ కుహూక మయూర్.. చాలాసేపటి వరకు ప్రతిధ్వనిస్తూ ఉంది.పల్లెలో మరొకసారి ఈ మాట వ్యాపించింది. పోవడం లేదు. ఫుల్పత్తి అమ్మ ఊరు విడిచి ఎక్కడికీ పోదు. తన భర్త ఇల్లు వదిలి ఆమె ఎక్కడికీ వెళ్లదు. కానీ సనాతన్ ఊరిలో ఒక సెంటర్ తెరవాలని నిర్ణయించుకున్నాడు. పాట్నా, ఢిల్లీ, కలకత్తా నుంచి ఎన్నుకోబడిన బాలికలు, మూడు నెలల ట్రైనింగ్ పొందడానికి ఇక్కడికొస్తారు.అంటే ఐదువందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఇంట్లో కూర్చొనే నెలనెలా దొరుకుతాయన్న మాట. దీంతో పాటు జిల్లాలోని ఆడపిల్లలకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. పేపర్లో కూడా ఈ సమాచారం వచ్చింది. బదరీ భగత్ పేపర్లో పడిన ఈ వార్తను చదివి అందరికీ వినిపిస్తున్నాడు. ఈ దఫా పేపర్లో మన ఊరి పేరు పెద్ద అక్షరాల్లో పడింది. ‘‘మోహన్పూర్ మధుబనీ ఆర్టు సెంటర్’’ ఈ సెంటర్ బిల్డింగ్ శంకుస్థాపనకుదేశంలోని ప్రసిద్ధిగాంచిన చిత్రకారుడు హుస్సేన్ను రమ్మని ఆహ్వానించారు.’’వినే వాళ్లందరూ బిగ్గరగా జయజయధ్వానాలు చేశారు. ‘‘మోహన్పూర్ గ్రామానికి జై.. మోహన్పూర్ గ్రామానికి జై..’’ హిందీ మూలం : ఫణీశ్వరనాథ్ రేణ్డు తెలుగు : పి.విజయరాఘవరెడ్డి -
‘ఎంప్లాయీస్ యూనియన్’ ఉద్యమబాట
కడప అర్బన్, న్యూస్లైన్: కడప, మైదుకూరు, జమ్మలమడుగు, రాయచోటి డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు తమపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ వేధిస్తున్నారని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆందోళనబాట పట్టారు. కడప బస్టాండు ఎదురుగా ఎంప్లాయీస్ యూ నియన్ ఆధ్వర్యంలో కడప డిపో మేనేజర్ వైఖరిపై నిర్వహిస్తున్న ఆందోళన సోమవారం ఆరవరోజుకు చేరుకుంది. ఈ మేరకు ఎంప్లాయీస్ యూనియన్ కడప జోనల్ సెక్రటరి జీవీ నరసయ్య, కడప రీజనల్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్.నాగముని, వీఎం కుమార్, రీజనల్ నాయకులు బండి చెన్నయ్య, రామిరెడ్డి తదితరులు సోమవారం సాయంత్రం కడప ఇ న్చార్జి ఆర్ఎం బ్రహ్మానందరెడ్డికి ఉద్యమ నోటీసు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ కడపలో డిపోలో కొంతమంది ట్రాఫిక్ సూపర్వైజర్లు కార్యకర్త లు, నాయకులను రెచ్చగొట్టడమే కాకుం డా కార్మికుల సమస్యల పరిష్కారానికి డిపో మేనేజర్ల దృష్టికి తీసుకెళ్లినప్పుడు అవహేళనచేసి మాట్లాడుతున్నారని విమర్శించారు. దీంతోపాటు పలు సమస్యల పరిష్కారానికి రీజనల్ మేనేజర్కు, ఇతర అధికారులకు అనేక సంయుక్త సమావేశాల్లో ఫిర్యాదులు ఇచ్చినా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రీజనల్ మేనేజ్మెంట్ తమ ధోరణి మార్చుకోనందున ప్రత్యక్ష ఆందోళనలు చేయాలని ఈ నెల 17న డిపో కార్యదర్శుల సమావేశం లో నిర్ణయించామన్నారు. అందులో భాగంగా ఈ నెల 20,21 తేదీల్లో రీజనల్ వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో ఆందోళనలు చేపడుతున్నామన్నారు. -
కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడంతో ఈ ప్రక్రియ మధ్యాహ్నానికి పూర్తయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెపుతున్నారు. కౌంటింగ్ నిర్వహణకు ఆయా స్ట్రాంగ్ రూమ్ల పరిధిలోనే కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక టేబుళ్లు, మెస్ ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాల వద్దకు తేవడం నుంచి లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వీడియోగ్రఫీ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెబ్ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తారు. లెక్కింపు కోసం ఇప్పటికే సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు, వలంటీర్లను నియమించారు. కౌంటింగ్ ప్రక్రియపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు కౌంటింగ్ అబ్జర్వర్లను సైతం ఎన్నికల సంఘం నియమించింది. జిల్లాలోని 10 అసెంబ్లీలకు 143 మంది అభ్యర్థులు, ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 27 మంది అభ్యర్థుల భవితవ్యం మధ్యాహ్నం వరకు తేలనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ సిబ్బందికి, మీడియాకు ప్రత్యేకంగా పాస్లు ఇచ్చారు. ఈ పాస్ ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. ఖమ్మం పార్లమెంట్ ఫలితాలను విజయ ఇంజనీరింగ్ కళాశాల(తనికెళ్ల) వద్ద, కలెక్టరేట్లో వెల్లడించేందుకు ప్రత్యేకంగా డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 14,39,983 మందికి గాను 11,79,136 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబాబాద్ లోక్సభ పరిధిలోని ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో 5,77,018 మందికి గాను 4,49,489 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పది నియోజకవర్గాల పరిధిలో 253 రౌండ్ల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 36 రౌండ్ల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. దీని ప్రకారం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి 36 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు ఇవే... ఖమ్మంలోని సెయింట్ జోసఫ్ స్కూల్లో ఖమ్మం అసెంబ్లీ, మౌంట్ఫోర్ట్ పాఠశాలలో పాలేరు, ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో కొత్తగూడెం, తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో మధిర, అశ్వారావుపేట, సత్తుపల్లి, బ్రౌన్స్ కళాశాలలో వైరా నియోజకవర్గాల ఓట్లు లెక్కిస్తారు. కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. కౌంటింగ్ ప్రక్రియ ఇలా... కౌంటింగ్ ప్రక్రియకు ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. రిటర్నింగ్ అధికారి టేబుల్ మీద పోస్టల్ బ్యాలెట్ పత్రాల గణన జరుగుతుండగా, ఓటింగ్ యంత్రాల ద్వారా పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్ల లెక్కింపును కౌంటింగ్ హాలులో ఉన్న ఇతర టేబుళ్ల వద్ద అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు చేపడతారు. ఇందుకోసం పోలింగ్ స్టేషన్ నుంచి వచ్చిన ఓటింగ్ యంత్రాల కంట్రోల్ యూనిట్లను లెక్కింపు టేబుళ్ల వద్దకు తెస్తారు. మొదటి పోలింగ్ స్టేషన్ ఓటింగ్ యంత్రపు కంట్రోల్ యూనిట్ను మొదటి టేబుల్తో మొదలై... రెండో పోలింగ్ స్టేషన్ ఓటింగ్ యంత్రపు కంట్రోల్ యూనిట్ రెండో టేబుల్కు... ఇలా కొనసాగుతుంది. ప్రతి లెక్కింపు బల్ల వద్ద ఒక పోలింగ్ స్టేషన్లో పోలయిన ఓట్ల లెక్కింపు ఒకేసారి చేపడతారు. ఉన్న లెక్కింపు బల్లల సంఖ్యను బట్టి అన్ని పోలింగ్ స్టేషన్ల ఓట్ల లెక్కింపు ఏకకాలంలో మొదటి రౌండ్ లెక్కింపుగా చేపడతారు. అంటే ఒక నియోజకవర్గానికి 12 టేబుళ్లను ఏర్పాటు చేస్తే ఒకే రౌండ్లో 12 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారన్నమాట. లెక్కింపు బల్లల సంఖ్య పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని అవసరమైన రౌండ్లలో గణన జరిగి లెక్కింపు పూర్తవుతుంది. అభ్యర్థుల్లో ఉత్కంఠ... ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 30 నుంచి ఫలితాల కోసం వేచి ఉన్న అభ్యర్థులు, కార్యకర్తలతోపాటు ప్రజల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఈ దఫా ఎన్నడూ లేని విధంగా బహుముఖ పోటీ నెలకొనడంతో అభ్యర్థుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ఫలితాలు ఏ మలుపు తిరుగుతాయి... క్రాస్ ఓటింగ్ జరిగిందా అనే అనుమానాలతో అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.