కోలకతా, సాక్షి: పశ్చిమ బెంగాల్లో బీజేపీ సర్కార్ తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. బెంగాల్ ప్రజలను ఆకట్టుకునేదిశగా లక్ష ఉద్యోగాలు, ఇందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్,ఉద్యోగులకు డీఏ పెంపు లాంటి అనేక జనాకర్షక తాయిలాలను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి స్వపన్ దాస్గుప్తా సోమవారం ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వపు మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర రుణ భారాన్ని తగ్గించడం, ఆదాయ వసూళ్లను పెంచడం, మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధిని వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తూ, ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలను ఆయన వివరించారు.
"వికసిత్ భారత్" విజన్కుఅనుగుణంగానే "వికసిత్ బంగ్లా"అభివృద్ధి ఎజెండా ఉంటుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. మునుపటి ప్రభుత్వం నుండి తమకు రూ. 8.15 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందని, అయితే ప్రస్తుతమున్న అన్ని సామాజిక సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
బడ్జెట్లోని ముఖ్యాంశాలు:
లక్ష ఉద్యోగాలు : ప్రభుత్వ రంగంలో లక్ష ఖాళీలను భర్తీ చేయనున్నామనే ప్రకటన ప్రధానంగా నిలిచింది. ఇందులో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించారు. పోలీస్ శాఖలో 20వేల పోస్టులు, విద్యాశాఖలో 50,000 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిలో ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల సడలింపును మరో రెండేళ్లపాటు పొడిగించారు.
ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యాన్ని (DA) అక్టోబర్ నుండి 20శాతం పెంచనున్నారు.
ప్రభుత్వ మరియు ప్రభుత్వ సాయం పొందే పాఠశాలల్లో చదువుకునే బాలికలకు రూ. 50,000 స్కాలర్షిప్ అందజేస్తారు.
అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందిస్తున్న రాష్ట్రాల్లో ఇపుడిక బెంగాల్ కూడా చేరిపోయింది. ఇందు కోసం రూ. 550 కోట్లు కేటాయించారు. దీని కోసం త్వరలోనే 'పింక్ కార్డ్' (Pink Card) పథకాన్ని ప్రారంభించనున్నారు.అన్నపూర్ణ యోజన పథకం కోసం రూ. 36,000 కోట్లు కేటాయించారు.
పీఎం ఆవాస్ యోజన కింద బెంగాల్లో మరో 25 లక్షల మందికి పీఎం ఆవాస్ ఇళ్లను నిర్మించి ఇస్తారు.
ఉపాధి హామీ పథకం (MGNREGA) పని దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచారు.
వలస కార్మికులకు ఆయుష్మాన్ భారత్: వలస కూలీల కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులను అందజేస్తారు. గిగ్ కార్మికుల (Gig workers) కోసం సంక్షేమ బోర్డును ప్రతిపాదించారు.
కోల్కతా సమీపంలో సరికొత్త 'గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం' (Greenfield airport) ఏర్పాటు కానుంది.
ఎమ్మెల్యే నిధుల పెంపు: ఎమ్మెల్యే అభివృద్ధి నిధులను రూ. 70 లక్షల నుండి రూ. 1 కోటికి పెంచారు.
- AI మిషన్ ప్రారంభం, భూమి రికార్డుల డిజిటలైజేషన్, మైనింగ్ కార్యకలాపాల కోసం కేంద్రీకృత వేలం విధానం
- సివిక్ వాలంటీర్ల సంఖ్యలో 2000 పెంపు, గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు, కండక్టర్లకు వేతనం పెంపు
రిటైర్డ్ జర్నలిస్టులకు రూ. 5,000 నెలవారీ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆర్థికమంత్రి వెల్లడించారు. దీంతోపాటు రాజకీయ కారణాలతో జైలులో ఉన్న వారికి నెలకు రూ.10,000 అందించనున్నారు. సాంప్రదాయ బెంగాలీ చాపలు , జనపనారతో తయారు చేసిన ఫైల్లో ఈ బడ్జెట్ను తీసుకురావడం మరో విశేషం.
ఇదీ చదవండి: అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి హఠాన్మరణం


