కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు | Shashi Tharoor Faces Congress Heat Over Kashmir Post | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

Jun 22 2026 12:31 PM | Updated on Jun 22 2026 12:55 PM

Shashi Tharoor Faces Congress Heat Over Kashmir Post

న్యూఢిల్లీ: ఎంపీ శశి థరూర్ మరోసారి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారానికి కారణమయ్యారు. జమ్ముకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయంటూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్, సొంత పార్టీ నేతల నుంచే గట్టి విమర్శలకు దారితీసింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో జరిగిన భేటీపై థరూర్ సానుకూల వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా వేడి పుట్టిస్తోంది.

గవర్నర్‌తో భేటీ.. థరూర్ సానుకూల వ్యాఖ్యలు
శ్రీనగర్ పర్యటనలో ఉన్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలిశారు. ఈ భేటీ అనంతరం ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ‘ఎల్జీతో అద్భుతమైన సమావేశం జరిగింది. కశ్మీర్‌లో పరిస్థితులు, సాధారణ స్థితి వైపు సాగుతున్న ప్రోత్సాహకరమైన పురోగతిపై చర్చించాం’ అని పేర్కొన్నారు. స్థానిక రచయితల సంఘం, మహిళా సంఘాల ప్రతినిధులతో ఎల్జీ మాట్లాడుతుండటం సానుకూల పరిణామమని, ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ భేటీ తనకు ఎంతో ఆశాజనకంగా అనిపించిందని థరూర్ రాసుకొచ్చారు.
 

సొంత పార్టీ నుంచే ఘాటు కౌంటర్
థరూర్ వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రవీందర్ శర్మ తీవ్రంగా స్పందించారు. గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోవడానికి థరూర్ స్థానిక ప్రజలను కలిసి ఉంటే బాగుండేదని ఎక్స్‌లో కౌంటర్ ఇచ్చారు. ఏడేళ్ల క్రితం తాము కోల్పోయిన రాష్ట్ర హోదా కోసం పోరాడుతున్న సొంత పార్టీ నాయకులను కలవడానికి కనీసం సమయం కేటాయించకపోవడాన్ని శర్మ తప్పుబట్టారు.

ప్రధాని మోదీపై వ్యాఖ్యల వివాదం
శశి థరూర్ ఇలా సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. అమెరికా నౌకాదళ దిగ్బంధం మధ్య ముగ్గురు భారతీయ నావికుల మరణంపై, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ జరిపిన చర్చలను థరూర్ సమర్థించడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. అయితే, దీనిపై థరూర్ స్పందిస్తూ.. తానేమీ రాజకీయంగా ప్రశంసించలేదని, భారతీయ పౌరుల భద్రత గురించే మాట్లాడానని, దీన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారని అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement