కోడింగ్‌ను మింగేస్తున్న ఏఐ.. ‘టాపర్ల’ సరికొత్త నిర్ణయం! | AI vs Core: Why IIT Toppers Are Choosing Civil Over Coding | Sakshi
Sakshi News home page

కోడింగ్‌ను మింగేస్తున్న ఏఐ.. ‘టాపర్ల’ సరికొత్త నిర్ణయం!

Jun 22 2026 1:17 PM | Updated on Jun 22 2026 2:22 PM

AI vs Core: Why IIT Toppers Are Choosing Civil Over Coding

న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ప్రపంచాన్ని శాసిస్తున్నదని, భవిష్యత్ ఉద్యోగాలన్నీ దానివేనని అంతా భావిస్తున్న తరుణంలో దేశంలోని ఐఐటీ ప్రవేశాల్లో సరికొత్త ట్రెండ్ సంచలనం సృష్టిస్తోంది. దేశంలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన ఐఐటీ టాపర్లు మాత్రం కంప్యూటర్ సైన్స్‌కు బదులుగా ‘సివిల్ ఇంజనీరింగ్’ వైపు మొగ్గు చూపుతున్నారు. రోడ్లు, భవనాలు, నగరాల నిర్మాణం వైపు ఈ టాలెంటెడ్ విద్యార్థులు ఎందుకు అడుగులు వేస్తున్నారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

ఏఐ భయాలు.. మౌలిక వసతుల జోరు
గత రెండు దశాబ్దాలుగా కంప్యూటర్ సైన్స్ (సీఎస్‌ఈ)ఐఐటీ అడ్మిషన్లలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఏఐ టూల్స్ సెకన్ల వ్యవధిలో క్లిష్టమైన కోడింగ్‌ను పూర్తి చేస్తుండటంతో, రాబోయే 10-15 ఏళ్లలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉంటుందోననే అనిశ్చితి ఐఐటీ టాపర్లలో మొదలైంది. ఇదే సమయంలో భారతదేశంలో ఎక్స్‌ప్రెస్‌వేలు, మెట్రో లైన్లు, స్మార్ట్ సిటీలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల నిర్వహణకు వేలాది మంది ఇంజనీర్ల అవసరం ఉండటంతో, సివిల్ ఇంజనీరింగ్‌ను టాపర్లు సురక్షితమైన కెరీర్‌ ఆప్షన్‌గా భావిస్తున్నారు.

జీతాల తేడాలున్నా మారని ట్రెండ్
ప్లేస్‌మెంట్ల పరంగా చూస్తే ఇప్పటికీ కంప్యూటర్ సైన్స్, ఏఐ విభాగాలదే పైచేయిగా ఉంది. ఉదాహరణకు 2026 క్యాంపస్ సెలక్షన్స్ లో ఐఐటీ రూర్కీకి చెందిన డేటా సైన్స్, ఏఐ మొదటి బ్యాచ్ విద్యార్థులు 100 శాతం ప్లేస్‌మెంట్స్ సాధించారు. ఐఐటీ మద్రాస్‌లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల సగటు ప్యాకేజీ రూ. 46 లక్షలుగా ఉంటే, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ. 17.2 లక్షలు మాత్రమే దక్కింది. అయినప్పటికీ భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ రంగాన్ని ఏఐ శాసించే ప్రమాదం ఉండటంతో, లాంగ్ టర్మ్ భద్రత కోసం టాపర్లు సివిల్ వైపే మొగ్గు చూపుతున్నారు.

రెండు రంగాల జీవనశైలి.. విభిన్నం
సివిల్ ఇంజనీరింగ్ ఎంచుకునే వారు ప్రాజెక్ట్ సైట్‌లలో తిరుగుతూ, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్ట్‌లతో కలిసి క్షేత్రస్థాయిలో పని చేయాల్సి ఉంటుంది. తాము నిర్మించిన వంతెనలు, రోడ్లు కళ్లముందే సాకారం కావడం వీరికి ఒక తృప్తిని ఇస్తుంది. అదే సమయంలో ఏఐ ప్రొఫెషనల్స్ పూర్తిగా ఆఫీస్ లేదా రిమోట్ వర్క్ చేస్తూ, రోజంతా కంప్యూటర్ల ముందే గడపాల్సి ఉంటుంది. ప్రస్తుతం సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి అర్బన్ ప్లానింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వంటి సరికొత్త రంగాలతో పాటు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, సొంతంగా స్టార్టప్‌లు పెట్టుకునే అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement