‘సివిల్‌’కు మళ్లీ స్వర్ణయుగం..! | Civil engineering regains top IITs amid infrastructure push and AI disruption | Sakshi
Sakshi News home page

‘సివిల్‌’కు మళ్లీ స్వర్ణయుగం..!

Jun 16 2026 1:28 AM | Updated on Jun 16 2026 6:27 AM

Civil engineering regains top IITs amid infrastructure push and AI disruption

విద్యార్థుల్లో పెరుగుతున్న ఆదరణ 

మౌలిక రంగంలో అభివృద్ధే కారణం 

రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలతో సివిల్‌ ఇంజనీర్లకు అవకాశాలు 

ఏఐ భయాలు కూడా ఒక కారణమంటున్న విశ్లేషకులు

సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా దూసుకొచ్చిన కృత్రిమ మేధ(ఏఐ) ఇంజినీరింగ్‌ కోర్సుల ఎంపికపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల ఎంపికలు మారుతున్నాయి. ప్రస్తు­తం తొలి ప్రాధాన్య ఎంపికగా కంప్యూటర్‌ సైన్సే కొనసాగుతోంది. అయితే, సివిల్‌ ఇంజినీ­­రింగ్‌ పట్ల విద్యార్థులు మొగ్గుచూపడం తాజా ట్రెండ్‌. 

2026 విద్యాసంవత్సరం ప్రవేశాల్లో ప్రాధాన్యతలను బట్టి చూస్తే ఈ కోర్సు­కు ఆదరణ పెరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో భారీ పెట్టుబడులు, నిర్మాణ రంగంలో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో ఐటీ ఉద్యోగాలపై ఏర్పడిన అనిశ్చితి వంటివి కూడా సివిల్‌ ఇంజినీరింగ్‌ వైపు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. 

మారుతున్న ప్రాధామ్యాలు.. 
గత దశాబ్దకాలంగా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు అత్యధిక డిమాండ్‌ ఉంది. ఇటీవల ఏఐ ఆధారిత సాంకేతికతలు వేగంగా అభివృద్ధి చెందడంతో సంప్రదాయ సాఫ్ట్‌వేర్‌ ఉద్యో­గాల భవిష్యత్తుపై కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో దీర్ఘకాలిక స్థిరత్వం కలిగిన రంగాలపై విద్యార్థులు దృష్టి సారిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలో రహదారులు, రైల్వేలు, మెట్రో ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, స్మార్ట్‌ సిటీలు, పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. దీంతో సివిల్‌ ఇంజినీర్లకు భవిష్యత్తులో విస్తృత అవకాశాలు ఉంటాయన్నది విద్యార్థుల తాజాగా అంచనా వేస్తున్నట్లుగా భావిస్తున్నారు. 

ఇదే సివిల్‌ ఇంజినీరింగ్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తోందని విద్యా రంగ వర్గాలు చెబుతున్నాయి. సివిల్‌ ఇంజినీరింగ్‌పై విద్యార్థుల ఆసక్తి ఎంతగా పెరిగిందో ఐఐటీల ప్రారంభ ర్యాంకులే చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి టాప్‌ ర్యాంకర్లు కూడా సివిల్‌ను ఎంపిక చేసుకోవడం విశేషం. గత ఏడాది ఐఐటీ బాంబేలో సివిల్‌ ఇంజినీరింగ్‌ ఎంపికకు ప్రారంభ ర్యాంకు 2,666 కాగా, ఈ ఏడాది ప్రారంభ ర్యాంకు 385గా ఉంది. ఇక ఐఐటీ ఢిల్లీలోనూ గత ఏడాది సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రారంభ ర్యాంకు 3,030గా ఉండగా, ఈ ఏడాది అది 179కి మారింది. ఈ గణాంకాలు సివిల్‌ ఇంజినీరింగ్‌ను గతంతో పోలిస్తే మరింత ప్రతిభావంతులైన విద్యార్థులు ఎంచుకుంటున్నారని సూచిస్తున్నాయి. 

భారీ అవకాశాల గని.. 
దేశంలో ప్రస్తుతం లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలవుతున్నాయి. భారతమాల, సాగర్‌మాల, హైస్పీడ్‌ రైలు మార్గాలు, మెట్రో విస్తరణ, కొత్త విమానాశ్రయాలు, స్మార్ట్‌ సిటీలు, గ్రీన్‌ ఎనర్జీ పార్కులు వంటి ప్రాజెక్టులు సివిల్‌ ఇంజినీర్లకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో నిర్మాణ నిపుణుల అవసరం పెరుగుతుండటం కూడా విద్యార్థులను ఈ కోర్సు వైపు ఆకర్షిస్తోంది. 

గత పదేళ్లుగా కంప్యూటర్‌ సైన్స్, ఐటీ శాఖలు విద్యార్థుల మొదటి ఎంపికగా కొనసాగాయి. అధిక వేతనాలు, విదేశీ అవకాశాలు, స్టార్టప్‌ సంస్కృతి ఇందుకు ప్రధాన కారణాలుగా ఉండేవి. అయితే ఇటీవల జనరేటివ్‌ ఏఐ, ఆటోమేషన్‌ సాంకేతికతలు వేగంగా అభివృద్ధి చెందడంతో సంప్రదాయ కోడింగ్‌ ఉద్యోగాలపై చర్చ మొదలైంది. కొన్ని సంస్థలు తక్కువ స్థాయి ప్రోగ్రామింగ్‌ పనులను ఏఐతో నిర్వహించే దిశగా అడుగులు వేస్తుండటంతో విద్యార్థులు దీర్ఘకాలిక స్థిరత్వం ఉన్న రంగాలపై దృష్టి పెడుతున్న ధోరణి కనబడుతోంది.

ఇప్పటికీ తగ్గని క్రేజ్‌.. 
మరో వైపు, కంప్యూటర్‌ సైన్స్‌పై విద్యార్థుల ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి కొత్త విభాగాల కారణంగా ఈ రంగం మరింతగా విస్తరిస్తోంది. ఐఐటీ బాంబే, ఢిల్లీ, మద్రాస్, కాన్పూర్, ఖరగ్‌పూర్‌ వంటి అగ్రశ్రేణి ఐఐటీల్లో టాప్‌–100, టాప్‌–200 ర్యాంకర్లలో అత్యధికశాతం మంది ఇప్పటికీ కంప్యూటర్‌ సైన్స్‌నే ఎంచుకుంటున్నారని ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి. పరిశ్రమల అంచనాల ప్రకారం 2026 నాటికి దేశంలో సుమారు 10 లక్షల ఏఐ నిపుణుల అవసరం ఏర్పడే అవకాశం ఉంది. బ్యాంకింగ్, ఆరోగ్యం, తయారీ, ఈ–కామర్స్, రక్షణ, విద్య తదితర రంగాల్లో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కంప్యూటర్‌ సైన్స్‌ పట్టభద్రులకు అవకాశాలు కొనసాగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement