2026–27లో 12 వరకు స్టోర్స్
కేరళ, మహారాష్ట్రపైనా దృష్టి
కళామందిర్ సీఈవో రాచమడుగు భరద్వాజ్ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ టెక్స్టైల్ సంస్థ కళామందిర్ ప్రస్తుత మార్కెట్లతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1 లక్ష చ.అ. విస్తీర్ణంలో దాదాపు 10–12 స్టోర్స్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ. 150 కోట్ల వరకు వెచ్చించనున్నట్లు సాయి సిల్క్స్ (కళామందిర్) సీఈవో రాచమడుగు భరద్వాజ్ సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 15 శాతం వృద్ధిని, ఈ పండుగల సీజన్లో 10 శాతం మేర అమ్మకాల వృద్ధిని అంచనా వేస్తున్నట్లు భరద్వాజ్ చెప్పారు. ప్రస్తుతం 83 స్టోర్స్ ఉండగా.. ఆగస్టులో రెండు రాష్ట్రాల్లో మరో 4 ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పాండిచేరిలో కార్యకలాపాలు ఉన్నాయి. కళామందిర్, కాంచీపురం వరమహాలక్ష్మి , వల్లీ సిల్క్స్ తదితర బ్రాండ్స్ ఉన్నాయి.
ఇప్పుడున్న మార్కెట్లలోనే వ్యాపార వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి. కొత్తగా కేరళ, మహారాష్ట్రలో స్టోర్ల ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నాం’ అని భరద్వాజ్ చెప్పారు. రుణరహిత సంస్థగా కార్యకలాపాలు సాగిస్తున్న తాము.. స్టోర్స్ విస్తరణ కోసం సొంత నిధులనే వెచ్చిస్తున్నామని చెప్పారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,654 కోట్ల ఆదాయం రూ. 141 కోట్ల లాభం ఆర్జించింది.
ఎక్స్క్లూజివ్గా వెండి జ్యుయలరీ..
ప్రస్తుతం రసమయి బ్రాండ్ కింద తమ స్టోర్స్లో విక్రయిస్తున్న వెండి జ్యుయలరీకి సంబంధించి ఎక్స్క్లూజివ్ స్టోర్స్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని భరద్వాజ్ వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి వాటిని ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. పశ్చిమాసియా పరిణామాలతో ముడి పదార్థాల వ్యయాలు 5–7 శాతం మేర పెరిగినట్లు భరద్వాజ్ చెప్పారు.
కానీ, ఆ భారాన్ని సాధ్యమైంతవరకు కస్టమర్లకు బదలాయించకుండా చూసేందుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ ఆదాయాల ఆధారిత మార్కెట్లలో ఎల్ నినో ప్రభావాలెలా ఉంటాయనేది కొద్ది రోజుల తర్వాతే తెలుస్తుందని చెప్పారు. ప్రస్తుతం దాదాపు 7,000 మంది వరకు సిబ్బంది ఉన్నారని, కొత్త స్టోర్స్ వచ్చే కొద్దీ ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని ఆయన తెలిపారు.


