భారతదేశంలోని కరెన్సీ నోట్ల విషయంలో కొత్త మార్పు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాధారణ కాగితపు నోట్లకు బదులుగా ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. దీనికోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చేసిన ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
ఆర్బీఐ ప్రతిపాదన ప్రకారం.. మొదటి దశలో రూ.10, రూ.20 నోట్లను ప్లాస్టిక్ నోట్లగా ప్రయోగాత్మకంగా చలామణిలోకి తీసుకురానున్నారు. ఈ నోట్లు భారతదేశంలోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఎలా పనిచేస్తాయి, వాటి మన్నిక ఎలా ఉంటుంది అనే విషయాలను పరిశీలించేందుకు ఈ ట్రయల్స్ నిర్వహించనున్నారు.
ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతేనే.. భవిష్యత్తులో ప్లాస్టిక్ నోట్ల వినియోగాన్ని పెంచే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మనగలుగుతాయని ఆర్బీఐ చెబుతోంది.
ప్లాస్టిక్ నోట్ల ఉపయోగాలు
ప్లాస్టిక్ నోట్లు, సాధార నోట్ల మాదిరిగా తొందరగా చిరిగిపోకుండా ఉంటాయి. దీంతో ఎక్కువకాలం చలామణిలో ఉంటాయి. కాగా.. ఇప్పటికే కొన్ని దేశాలు ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నాయని, ఎక్కువగా నగదు వినియోగించే ఆర్థిక వ్యవస్థలకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయని ఆర్బీఐ చెబుతోంది.
కాగితపు నోట్లు కనుమరుగవుతాయా?
ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయంటే.. కాగితం నోట్లు కనుమరుగవుతాయా? అనే సందేహం చాలామందిలో కలిగింది. ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ.. ప్లాస్టిక్ నోట్లు, కాగితపు నోట్లతో పాటు చలామణిలో ఉంటాయని స్పష్టం చేసింది. కాగితపు కరెన్సీని పూర్తిగా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం లేదని వెల్లడించింది.
ఇదీ చదవండి: మానవాళికి కొత్త సవాల్.. ఎలాన్ మస్క్ హెచ్చరిక!


