విద్యారంగంలో ప్రస్తుతం అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. ఎగ్జామ్ పేపర్ లీక్స్, పరీక్షల రద్దు, విద్యార్థుల ఒత్తిడి, ఆత్మహత్యలు వంటి అంశాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇవన్నీ.. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఈ తరుణంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుత సమస్య నీట్ (NEET) కాదు, అసలు సమస్య ఏఐ (AI) అని పేర్కొన్నారు.
విద్య అంటే..
గతంలో విద్య అంటే.. ఒక వ్యక్తికి అవసరమైన జ్ఞానాన్ని అందించి, ఉద్యోగానికి సిద్ధం చేయడం. డాక్టర్, ఇంజనీర్, లాయర్ వంటి వృత్తులకు కావాల్సిన విషయాలను నేర్చుకుని, ఒక స్థిరమైన జీవితాన్ని గడపడం అనేది చాలామంది లక్ష్యంగా పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.
ఒకప్పుడు సమాచారం పొందడం కష్టంగా ఉండేది. పుస్తకాలు, ఉపాధ్యాయులు, అనుభవజ్ఞుల ద్వారా మాత్రమే జ్ఞానం లభించేది. కానీ ఈ రోజు ఏదైనా సమాచారం కావాలంటే.. ఇంటర్నెట్, ఏఐ వంటి వాటిమీద ఆధారపడుతున్నారు. పెరిగిన టెక్నాలజీ కారణంగా.. ప్రపంచంలోని సమాచారం మన చేతుల్లోకి వచ్చేసింది. అయితే ఈ సమాచారంలో నిజమైన అంశాలు మాత్రమే కాకుండా.. తప్పుడు సమాచారం కూడా ఉంటుందని ఆర్జీవీ పేర్కొన్నారు.
పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు
ఏఐ అనేది కేవలం సమాచారాన్ని అందించడానికి మాత్రమే కాకుండా.. మనుషులు చేసే అనేక పనులను వేగంగా చేయగల స్థాయికి చేరుకుంటోంది. రాయడం, విశ్లేషించడం, కోడింగ్ చేయడం, డిజైన్ చేయడం వంటి పనుల్లో ఏఐ దూసుకెళ్తోంది. దీంతో భవిష్యత్తులో విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదనే అభిప్రాయం బలపడుతోంది. దీన్నిబట్టి చూస్తే రానున్న రోజుల్లో ఏఐ తీవ్రత ఎలా ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టమవుతుంది.
NEET is not the issue
A I is
NEET leaks, cancelled exams, student suicides might leave bodies on the floor and parents screaming which might seem brutal in the way the system is being injured
AI does not wound the system.
It rips its throat out.
For centuries education had one…— Ram Gopal Varma (@RGVzoomin) July 27, 2026
అందుకే.. విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు.. కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఒకప్పుడు బాగా చదువు.. మంచి ఉద్యోగం సంపాదించు.. జీవితాంతం భద్రంగా ఉండు అనే ధోరణి ఉండేది. కానీ ఏఐ యుగంలో ఎప్పుడు ఉద్యోగం పోతుందో కూడా తెలియదు.
ఉద్యోగాలు పోతాయా?
ఇంజనీరింగ్, మెడిసిన్, లా, సీఏ, ఎంబీఏ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుపై కూడా చర్చ జరుగుతోంది. ఏఐ వల్ల కొన్ని పనులు ఆటోమేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీని అర్థం ఈ రంగాల్లో ఉన్న ఉద్యోగాలు పూర్తిగా పోతాయని కాదు. కానీ ఆ రంగాల్లో పనిచేసే విధానం మారుతుంది. ఏఐని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే వారికి ఎక్కువ అవకాశాలు లభించే అవకాశం ఉంది.
ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని విద్యా వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు ఏఐని ఎలా ఉపయోగించాలి, దానితో కలిసి ఎలా పని చేయాలి, సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి వంటి నైపుణ్యాలను తప్పకుండా నేర్పించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తును కేవలం ర్యాంకులు, మార్కులు, డిగ్రీలతో మాత్రమే అంచనా వేయకుండా, వారు మారుతున్న ప్రపంచానికి ఎంతగా సిద్ధంగా ఉన్నారో చూడాలి.
ఇదీ చదవండి: కియోసాకి వ్యూహం.. రియల్ ఎస్టేట్లోకి ఎంట్రీ!


