అలనాటి గాయని జమునా రాణి ఇకలేరు | singer Jamuna Rani dies at 88 | Sakshi
Sakshi News home page

అలనాటి గాయని జమునా రాణి ఇకలేరు

Aug 1 2026 6:15 AM | Updated on Aug 1 2026 6:28 AM

singer Jamuna Rani dies at 88

బెంగళూరు వృద్ధాశ్రమంలో తుదిశ్వాస 

ఆ గళం కురిపించిన మధురాలెన్నో

సూపర్‌హిట్‌ గీతాలు ‘ముక్కు మీద కోపం’, ‘మావామావా’ ఆమె పాడినవే.. 

మిథునం సినిమాలో ఆఖరి గీతం 

1998లో ‘కలైమామణి’ పురస్కారం

గొంతులో చిలిపితనం చిలకరించినా.. విరహపు ఆవేదనను పలికించినా.. అది ఆ కంఠానికే చెల్లింది! ‘ముక్కు మీద కోపం’అని అలకపాట పాడినా, ‘మావా మావా’అని ఉత్సాహంతో కేరింతలు కొట్టినా, ‘పద పదవే వయ్యారి గాలిపటమా’అంటూ పండగ సందడి తెచ్చినా.. పాటల ప్రేమికులకు ఆ గొంతు ఒక మధుర స్వప్నం. దశాబ్దాల పాటు తన స్వరంతో శ్రోతల గుండెల్లో అమృత వర్షం కురిపించిన ప్రముఖ నేపథ్య గాయని కె.జమునా రాణి (88) ఇక లేరు.  

జమునారాణి గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో బెంగళూరులోని వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె వృద్ధాప్య సమస్యలతో ఆమె బాధపడుతున్నట్లు తెలిసింది. ఆమె గురువారం ఉదయమే మృతి చెందినా ఎవరికీ తెలియకపోవడం చాలా బాధాకరమని ఆమె స్నేహితుల్లో ఒకరైన గాయని ప్రియదర్శిని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు కాక్స్‌టౌన్‌లోని కల్లహళ్లి శ్మశాన వాటికలో శుక్రవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. పాటకే తన జీవితాన్ని అంకితం చేసిన ఆ కంఠం మూగబోయినా.. జమునారాణి అలపించిన వేల గీతాలు శ్రోతల గుండెల్లో మోగుతూనే ఉంటాయి.  

నాలుగేళ్ల వయసులోనే..
జమునా రాణి 1938 మే 17న ఆంధ్రప్రదేశ్‌లో జని్మంచారు. తండ్రి వరదరాజులు రోడ్డు రవాణా సంస్థలో అధికారిగా పని చేసేవారు. తల్లి ద్రౌపది వాయులీన విద్వాంసురాలు కావడంతో చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారామె. తల్లి వద్ద కర్నాటక సంగీతంలో అనేక కీర్తనలు నేర్చుకున్నారు. నాలుగేళ్ల వయసులో చిన్నపిల్లలకు ఏర్పాటు చేసిన పాటల పోటీలో పాల్గొని, సిల్వర్‌ కప్‌ గెలిచారు. అలా ఆమె పాటల ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత గురువుల వద్ద లలిత సంగీత సాధన చేశారు.

 ప్రముఖ నటుడు, దర్శకుడు చిత్తూరు వి.నాగయ్య తీసిన ‘త్యాగయ్య’ (1946) చిత్రంలో బాల నటుల కోసం పాడటంతో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. ‘వలయపతి’(1952) సినిమాలో హీరోయిన్‌కు పూర్తి స్థాయిలో పాట పాడారామె. అయితే 1955లో విడుదలైన ‘గులేబకావళి కథ’చిత్రంలోని పాటలు సూపర్‌హిట్‌ కావడంతో ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. తమిళనాడుకు చెందిన ఓ నిర్మాత తమిళం, సింహళంలో నిర్మించిన ‘సుజాత’అనే చిత్రంలో సింహళంలో పాటలు పాడే అవకాశం ఆమెకు లభించింది. ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళం భాషల్లో కలిపి దాదాపు ఆరువేలకు పైగా పాటలు పాడారు. సింహళంలో పాడిన తొలి తెలుగు గాయనిగా జమునా రాణి పేరు వార్తల్లో ఉంది.  

17 ఏళ్ల గ్యాప్‌ తర్వాత.. 
1970 వరకూ పాటలు పాడిన జమునా రాణి ఆ తర్వాత సుదీర్ఘ కాలం బ్రేక్‌ తీసుకున్నారు. 1987లో ‘నాయకుడు’కోసం పాట పాడారామె. కమల్‌హాసన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ ‘నాయగన్‌’(తెలుగులో ‘నాయకుడు). ఈ సినిమాలోని ‘నా నవ్వే దీపావళి.. నా పలుకే గీతాంజలి’పాటను పి.సుశీలతో కలిసి పాడారు. ఈ పాట తమిళ వెర్షన్‌ను ఎంఎస్‌ రాజేశ్వరితో కలిసి పాడారు జమునా రాణి. అల్లు అర్జున్‌ ‘వరుడు’ చిత్రంలో ‘ఐదు రోజుల పెళ్లి...’పాట పాడారామె. ఆ తర్వాత రెండేళ్లకు తనికెళ్ల భరణి దర్శకత్వంలో వచ్చిన ‘మిథునం’(2012) సినిమాకి ‘ఎవరు గెలిచారిప్పుడు’పాట పాడారు. బహుశా ఇదే జమునా రాణి పాడిన చివరి పాట అయ్యుండొచ్చు.  

పాటకే అంకితం  
తమిళనాడు ప్రభుత్వం 1998లో ‘కలైమామణి’పురస్కారం, 2002లో ‘అరిన్యర్‌ అన్నాదురై’అవార్డును అందించింది. అమెరికా, బ్రిటన్‌ వంటి దాదాపు 15 దేశాల్లో జమునా రాణి మ్యూజికల్‌ నైట్స్‌ నిర్వహించారు. సంగీతానికే తన జీవితాన్ని అంకితమిచ్చిన ఆమె వివాహం చేసుకోలేదు. – సాక్షి సినిమా డెస్‌్క/బనశంకరి (కర్ణాటక)

మరపురాని పాటలు  
ఆరు వేలకు పైగా ఆలపించిన జమునా రాణి పాటల్లో కొన్ని.. 
‘ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం’ (మూగ మనసులు)  
‘మావా–మావా’ (మంచి మనసులు)  
‘హైలో హైలెస్సా’ (భీష్మ )  
‘ఓ దేవదా’, ‘చెలియ లేదు’.. (దేవదాసు)  
‘ఓ వెన్నెల వయ్యారి చూసేపు ఎవరి దారి’ (శభాష్‌ రాజా)  
‘సరదా సరదా సిగరెట్టు’ (రాముడు–భీముడు)  
‘కోటు బూటు వేసిన బావ వచ్చాడయ్యా’, 
‘పద పదవే వయ్యారి గాలిపటమా’ (కులదైవం)  
‘అందానికి అందము నేనే జీవన మకరందము నేనే’ (చివరకు మిగిలేది)  
‘తలచిన తలపులు ఫలమైతే తీరని ఊహలు నిజమైతే’ (భాగ్యదేవత)  
‘రావాలని రావాలి రమ్మంటే రావాలి’ (మర్మయోగి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement