సాక్షి, విశాఖపట్నం: మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారు. గిరిజన మహిళ అని కూడా చూడకుండా చీర లాగి అనుచితంగా ప్రవర్తించారు. గిరిజన విద్యార్థుల సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులు దౌర్జన్యానికి దిగారు. పోలీసుల వ్యవహరించిన తీరుపై మాజీ డిప్యూటీ సీఎం కన్నీరు పెట్టుకున్నారు.
విశాఖ జిల్లా మారికవలస గురుకులం దగ్గర ఆందోళన కొనసాగుతోంది. తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రులు పుష్పశ్రీవాణి, బాలరాజు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పుష్పశ్రీవాణి, బాలరాజును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీవాణి అరెస్టు సమయంలో మాజీ డిప్యూటీ సీఎం అనే గౌరవం లేకుండా పోలీసులు వ్యవహరించారు. వాహనం ఎక్కించే సమయంలో పోలీసులు.. చీర పట్టుకొని లాగారు. పోలీసులు తీరుపై పుష్పశ్రీవాణి మండిపడ్డారు. మర్యాద లేకుండా వ్యవహరించవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పుష్ప శ్రీవాణి, బాలరాజు అరెస్ట్
హాస్టల్ తరలింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని గిరిజన హాస్టల్ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు వైఎస్సార్సీపీ నేతల మద్దతు ప్రకటించారు. వైఎస్సార్సీపీ నేతలు కుంభా రవిబాబు, శోభా స్వాతి రోడ్డుపై బైఠాయించారు. గిరిజన హాస్టల్కు వచ్చే అన్ని మార్గాలో పోలీసులు బారికేడ్లు పెట్టి వాహనాలను అడ్డుకుంటున్నారు.

మద్దతు తెలిపేందుకు వస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. మారికవలస గురుకుల పాఠశాల వెళ్తుండగా పోలీసులు అడ్డుకుంటున్నారు. మారికవలస హైవేపై పుష్ప శ్రీవాణి, బాలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అరకు ఎమ్మెల్యే మత్స్యలింగాన్ని కూడా అరెస్ట్ చేశారు. సాలూరులో రాజన్న దొర, గాజువాకలో దేవన్రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.


