మోదీ 76వ పుట్టినరోజు: వారణాసిలో భారీ ఎత్తున సంబరాలు | PM Modi 76th Birthday, NDA Leaders Gather In Varanasi As Seva Sankalp Abhiyan Begins, Check More Details | Sakshi
Sakshi News home page

మోదీ 76వ పుట్టినరోజు: వారణాసిలో భారీ ఎత్తున సంబరాలు

Sep 17 2026 9:03 AM | Updated on Sep 17 2026 10:08 AM

76 Years of PM Modi Service, Outreach and Celebrations

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) సీనియర్‌ నేతలు, ముఖ్యమంత్రులు గురువారం వారణాసిలో సమావేశం కానున్నారు. మోదీ లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసితో పాటు ఆయన జన్మస్థలమైన గుజరాత్‌లోని వడ్నగర్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మోదీ ప్రజాజీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ పేరిట నెల రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు కొనసాగనుంది.

వారణాసి కార్యక్రమాలు
వారణాసిలో జరిగే కార్యక్రమంలో ‘సేవా సంకల్ప్‌ బైక్‌ యాత్ర’ ప్రధానంగా ఉంటుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ యాత్రను వారణాసి నుంచి గుజరాత్‌లోని వడ్నగర్‌ వరకు ప్రారంభించనున్నారు. అదే సమయంలో వడ్నగర్‌ నుంచి వారణాసి వైపు మరో యాత్ర ప్రారంభమవుతుంది. ఎన్డీయేకు చెందిన పలువురు నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే వారణాసి సమావేశానికి హాజరవుతారని భావిస్తున్నారు. చిరాగ్‌ పాశ్వాన్‌, అప్నాదళ్‌ నేత అనుప్రియా పటేల్‌ తదితరులు వేడుకలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

సేవా కార్యక్రమాలు
‘సేవా మేరా యోగదాన్‌’ కింద రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు సహా 25 సేవా కార్యక్రమాలను బీజేపీ చేపట్టింది. ప్రజలు కనీసం ఒక కార్యక్రమంలో పాల్గొనాలని కోరింది. దేశవ్యాప్తంగా యువత, సేవా యాత్రికులతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అభినందనలు.. విమర్శలు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే మోదీ పుట్టినరోజు వేడుకలకు ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాధనాన్ని వినియోగించడంపై ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ ప్రశ్నలు లేవనెత్తారు. ఛత్తీస్‌గఢ్‌లో 1.5 కోట్లకు పైగా దీపాలను వెలిగించేందుకు ప్రణాళిక ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, మధ్యప్రదేశ్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలకు మోదీపై ప్రశంసా వీడియోలు రికార్డు చేయాలని ఆదేశించారన్న ఆరోపణలను సీజేపీ సహ కన్వీనర్‌ సౌరవ్‌ దాస్‌ వెల్లడించారు. ఈ ఆరోపణలను హెచ్‌టీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

ఇదీ చదవండి: గణేశ మండపంలో అవయవదాన సందేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement