దేశవ్యాప్తంగా బీజేపీ ప్రత్యేక కార్యక్రమాలు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు, ఆయన 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని గురువారం దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి బీజేపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసి వరకు సాగే బైక్ ర్యాలీని ప్రారంభిస్తారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తారు. వారణాసి నుంచి వాద్నగర్ వరకు సాగే బైక్ ర్యాలీని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్యమంత్రులు సైతం హాజరుకాబోతున్నారు.
వాద్నగర్ ప్రధానమంత్రి మోదీ జన్మస్థలం కాగా, ఆయన వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోదీ జన్మదినాన్ని సేవా దినంగా నిర్వహించుకుంటున్న గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యప్రదేశ్లోని ఇండోర్, ఉజ్జయినిలో వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే దేశవ్యాప్త స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. ప్రధానమంత్రి ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం గురువారం సాయంత్రం వేళ దేశవ్యాప్తంగా 700కు పైగా ప్రాంతాల్లో ఆశీర్వాదం దీపం వెలిగించబోతున్నట్లు పేర్కొన్నారు. గురువారం ‘సేవా సంకల్ప్ అభియాన్’ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా నెల రోజులపాటు ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.


