పురస్కారాల ఎంపిక విధానంపై అనంత్‌ నాగ్‌ కీలక వ్యాఖ్యలు | Anant Nag Says PM Modi Transformed Film Awards By Bringing Public Participation In Selection Process | Sakshi
Sakshi News home page

పురస్కారాల ఎంపిక విధానంపై అనంత్‌ నాగ్‌ కీలక వ్యాఖ్యలు

Sep 17 2026 9:31 AM | Updated on Sep 17 2026 10:26 AM

Anant Nag Credits PM Modi for Changes in Film Awards

న్యూఢిల్లీ: ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు 2024 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించనుంది. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో సేవలందించిన ఆయనకు భారతీయ సినిమాకు అందించిన విశిష్ట సేవలకు ఈ అత్యున్నత సినీ పురస్కారం ప్రకటించారు. సెప్టెంబరు 22న గుజరాత్‌లోని కెవాడియాలో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో ఈ అవార్డును అందజేయనున్నారు.

అవార్డు ప్రకటన అనంతరం పీటీఐతో మాట్లాడిన అనంత్ నాగ్.. సినీ పురస్కారాల ఎంపిక విధానంలో బంధుప్రీతి, పక్షపాతం ఉండేవని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకురావడం ద్వారా ఆ విధానాన్ని మార్చారని పేర్కొన్నారు. తమకు నచ్చిన వ్యక్తి పేరును ప్రజలు సిఫారసు చేయాలని మోదీ కోరడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఈ విధానం ద్వారా అవార్డుల ఎంపిక ప్రక్రియను ప్రజల ముందుకు తీసుకువచ్చారని వివరించారు.

దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం తనకు వస్తుందని తాను ఊహించలేదని 79 ఏళ్ల అనంత్ నాగ్ తెలిపారు. ఈ పురస్కారాన్ని తన స్వస్థలమైన కర్ణాటక ప్రజలకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. అవార్డును ప్రకటించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అనంత్ నాగ్ 250కిపైగా చిత్రాల్లో నటించారు. కన్నడతో పాటు హిందీ చిత్రాల్లోనూ గుర్తింపు పొందారు. 1973లో ‘సంకల్ప’తో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన ‘అంకుర్’, ‘నిశాంత్’, ‘మంథన్’, ‘భూమిక’, ‘కల్యుగ్’, ‘గెహ్రాయీ’ వంటి చిత్రాల్లో నటించారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ‘మాల్గుడి డేస్’లోనూ కీలక పాత్ర పోషించారు.

ఇదీ చదవండి: మోదీ 76వ పుట్టినరోజు: వారణాసిలో భారీ ఎత్తున సంబరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement