అమృత్సర్: పంజాబ్లో పోలీస్ ఏఎస్ఐ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI) హర్జిత్ సింగ్ను కాల్చిచంపిన కేసులో నిందితుడిగా ఉన్న దీపక్ సింగ్ పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఈ కేసులో అతడికి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదితో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
అమృత్సర్లోని ముల్చక్కు చెందిన దీపక్ సింగ్ మరో వ్యక్తితో కలిసి శుక్రవారం ఏఎస్ఐ హర్జిత్ సింగ్ను వెంబడించి కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో హర్జిత్ సింగ్తో ఉన్న మరో వ్యక్తి కూడా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, టవర్ డంప్ విశ్లేషణ, స్థానిక నిఘా ద్వారా సమాచారం సేకరించారు. ఈ క్రమంలో శనివారం రాత్రి సుమారు 9.45 గంటలకు స్కూటర్పై వెళ్తున్న ఇద్దరు అనుమానితులను పోలీస్ చెక్పోస్టు వద్ద ఆపేందుకు ప్రయత్నించారు.
అయితే వారు పోలీసులపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు ఆత్మరక్షణలో ఎదురుకాల్పులు జరిపారని, ఈ ఘటనలో దీపక్ సింగ్కు బుల్లెట్ గాయాలయ్యాయని చెప్పారు. అతడిని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
మరో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. కాల్పుల అనంతరం, పోలీసులు నిందితుల వద్ద నుంచి ఒక బోర్ పిస్టల్, రెండు మ్యాగజైన్లు, ఎనిమిది లైవ్ కార్ట్రిడ్జ్లు, మొబైల్ ఫోన్, నేరానికి ఉపయోగించినట్లు భావిస్తున్న హోండా యాక్టివా స్కూటర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పాకిస్తాన్ ఉగ్రవాదితో లింకులపై దర్యాప్తు
ఈ హత్య వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదికి సంబంధం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తులో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం.. పాకిస్తాన్లో ఉన్న ఓ ఉగ్రవాది నిందితులకు డబ్బు ఆఫర్ చేసి ఈ దాడికి పాల్పడేలా ప్రేరేపించినట్లు అనుమానిస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే ఈ అంశంపై పూర్తి ఆధారాలు, ఉగ్రవాది వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.
ఇదీ చదవండి: భారత్కు భారీ ముప్పు.. 180 మంది శాస్త్రవేత్తల హెచ్చరిక


