శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) జమ్మూ క్యాంపస్లో నిర్వహించిన కార్యక్రమానికి గైర్హాజరైన పలువురు విద్యార్థులకు ఐఐఎం స్టూడెంట్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 17న క్యాంపస్లోని అకడమిక్ బ్లాక్లో నిర్వహించిన ‘జ్యోతి ప్రజ్వలన’ కార్యక్రమానికి విద్యార్థుల హాజరు తప్పనిసరి అని, ఎందుకు రాలేకపోయారో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
వైద్య కారణాలు మినహా ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకోబోమని, గైర్హాజరైన వారికి రూ. 500 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మొదట సుమారు 65 మంది విద్యార్థులకు ఈ నోటీసులు పంపినప్పటికీ, ప్లేస్మెంట్లు, అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయిన వారి నోటీసులను ఉపసంహరించుకున్నామని, ఇప్పటివరకు ఎవరికీ జరిమానా విధించలేదని స్టూడెంట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అకుల్ శర్మ తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే యుధ్వీర్ సేథీ, ఐఐఎం డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ సహాయ్ పాల్గొన్న ఈ వేడుకకు హాజరును తప్పనిసరి చేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది.
విద్యాసంస్థల్లో స్వతంత్ర ఆలోచనలను పెంపొందించాల్సింది పోయి, రాజకీయ నాయకుల పుట్టినరోజు వేడుకలకు విద్యార్థులను బలవంతంగా రప్పించడం, జరిమానాలు విధిస్తామని బెదిరించడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ జే అండ్ కే ఇన్చార్జ్ సయ్యద్ నసీర్ హుస్సేన్ ప్రశ్నించారు. అయితే, విద్యార్థులు క్యాంపస్ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఎవరిపైనా జరిమానా వేయలేదని, ఈ అంశాన్ని అనవసరంగా రాజకీయ కోణంలో చూస్తున్నారని ఐఐఎం అధికార ప్రతినిధి తెలిపారు.
ఇదీ చదవండి: Air India Crash: బోయింగ్ 787పై కొత్త సందేహాలు


