రాంచీ: జార్ఖండ్ లోని హజీరా బాగ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈరోజు ( శుక్రవారం) ఏనుగుల దాడిలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. ఒక చిన్నారి తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. మరణించిన వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారున్నట్లు అధికారులు తెలిపారు.
ఆ రాష్ట్రంలో కొద్దిరోజులుగా ఏనుగుల దాడులు తీవ్రతరమయ్యాయి. ఏనుగుల గుంపులు గ్రామంలోనికి చొరబడి ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఒక ఎనుగుల గుంపు చుర్చూ బ్లాక్ ప్రాంతంలోని గోండ్వార్ గ్రామంలోకి ప్రవేశించి ప్రజలపై దాడి చేశాయి. ఈ దాడులలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో గాయపడ్డ ఆరుగురు ఈ రోజు ఉదయం మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఇందులో ఒక చిన్నారి తీవ్ర గాయాలతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.
గాయపడిన అధికారులలలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు అక్కడి అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. ఏనుగుల గుంపు దాడిలో ఆరుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే గత కొన్ని రోజులుగా ఏనుగుల గుంపు బోక్రో, రామ్ ఘర్, హాజ్రీబాగ్ జిల్లాలలో పర్యటిస్తుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. బోక్రో జిల్లాలోనూ కొంతమందిపై గజరాజులు దాడి చేసినట్లు పేర్కొన్నారు.


