కనువిప్పు | A funny story by Kayyur Balasubramanyam | Sakshi
Sakshi News home page

కనువిప్పు

Feb 8 2026 4:31 AM | Updated on Feb 8 2026 4:31 AM

A funny story by Kayyur Balasubramanyam

ఒక అడవిలో ఒక బోదురు కప్ప ఉండేది. ఆ బోదురు కప్ప గొప్పలకి పోవడం మొదలు పెట్టింది. నీటిలో ఉన్న జీవులను నేల మీద ఉండలేరని వెటకారం చేసేది. నేలమీద ఉన్న జీవులను నీటిలో ఉండలేరని ఎగతాళి చేసేది. నీటిలోను, నేల మీద ఉండగల జీవి తానొక్కటేనని విర్రవీగడం మొదలు పెట్టింది. ఓ కాకి ఇదంతా గమనించింది. ఎలాగైనా కప్పకు బుద్ధి చెప్పాలని అనుకుంది. 

ఒక రోజు చెరువులోంచి నేల మీదకొచ్చిన కప్పకు, నేలపై అన్నం మెతుకులు తింటున్న కాకి కనిపించింది. ‘ఏం కాకి బావా! ఎంత సేపైనా నేల మీదేనా, నాలాగా నీటిలోకి వచ్చేదేమైనా ఉందా?’ అంటూ వ్యంగ్యంగా అంది కప్ప. 
ఆ మాటకు కాకి ‘ఎందుకు రాను బావా! నువ్వు మా ఆకాశానికి ఎగురుకుంటూ రా! నేను అలాగే మీ చెరువులోకి ఈదుకుంటూ వస్తా’ అని తడుముకోకుండా అంది. 

ఆ మాటకు కంగు తిన్నది కప్ప. ‘నిజమే కదా! రెండు చోట్లా ఉండగలను కాని, ఆకాశంలో ఎగరలేను కదా! ఇందులో పెద్ద గొప్ప ఏముంది?ఎలాగైనా ఆకాశంలో కూడా ఎగిరి, మూడు చోట్లా ఉండగలనని నిరూపించుకుని, ఎగిరే పక్షులకు కూడా నా సత్తా ఏమిటో చూపాలి’ అనుకుంది. అనుకున్నదే తడవుగా, ‘ఓస్‌ అదంత కష్టమేమీ కాదు, నీటిలోనూ, నేలపైనా ఉన్న దాన్ని ఆమాత్రం ఆకాశంలోకి ఎగరలేనా? రేపు ఉదయం ఎగురుతాను చూడు’ అని కాకితో తల ఎగరేస్తూ అంది. అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన కప్పకు బుద్ధి చెప్పడానికి ఇదే మంచి సమయం అని కాకి సరే అంది.

ఎగరడానికి ముందు రెక్కలు కావాలి కనుక కప్ప వెంటనే నెమలి దగ్గరకు వెళ్ళింది. ‘నెమలి మిత్రమా! నీ ఈకలు కొన్ని నాకు కావాలి. దానికి ప్రతిగా నీకు మొక్కల విత్తనాలు ఇస్తాను’ అని అడిగింది. నెమలి కొన్ని ఈకలు ఇచ్చింది. ఆ ఈకలు తీసుకుని దర్జీపిట్ట దగ్గరకు వెళ్ళింది కప్ప.

‘దర్జీపిట్ట మిత్రమా! నాకు ఈ ఈకలతో రెక్కలు కుట్టివ్వవా! దానికి బదులుగా నీకు గింజలు ఇస్తాను’ అంది. ‘సరే’నని దర్జీ పిట్ట కప్పకు నెమలి ఈకలతో రంగు రంగుల రెక్కలను కుట్టి ఇచ్చింది. మరుసటి రోజు ఉదయం కాకి దగ్గరకు వెళ్లి, ‘చూడు! నాకు రెక్కలు లేవనే కదా, ఎగరలే ననుకున్నావ్‌. నీ రెక్కలు నల్లవి. నా రెక్కలు చూడు రంగు రంగులవి. నీకన్నా పైకి ఎగరగలను’ అంటూ బలమంతా కూడగట్టుకుని రెక్కలను ఊపుతూ పైకెగిరింది. కప్ప బరువుకి రెక్కలు ఊడిపోయి, గాల్లో ఎగిరిపోయాయి. 

కప్ప గిరా గిరా గిరికీలు కొడుతూ కిందకు పడబోయింది. కప్పకు కళ్ళు తిరుగుతున్నట్టు, గుండె ఆగిపోతున్నట్టు అనిపించింది. అహంకారానికి పోయి ప్రాణం మీదకి తెచ్చుకున్నానని భయంతో బెక బెకమని అరవసాగింది.అంతా గమనిస్తున్న కాకి వెంటనే ఎగిరి తన వీపుపై కప్పను పెట్టుకుని, కింద పడకుండా జాగ్రత్తగా చెరువు గట్టు మీద దించింది. తను గొప్పలకు పోయి అందరినీ హేళన చేసినా, తనను కాపాడిన కాకి ముందు తలదించుకుని, క్షమించమని అడిగింది కప్ప. 

‘ప్రతి జీవి శరీర ఆకృతి, నిర్మాణం ఒకో రకంగా ఏర్పడి ఉంటుంది. దానికి తగ్గట్టుగా జీవన విధానం ఉంటుంది. అది తెలుసుకుని నడుచుకోకపోతే ఏ జీవికైనా ముప్పు తప్పదు. అహంకారపు పొరలు బుద్ధిని కమ్మేస్తాయి. వాటికి మనం దూరంగా ఉండాలి. ఇకనైనా ఎవరినీ హేళన చేయకుండా బుద్ధిగా ఉండు’ అంటూ కాకి కప్పకు సుద్దులు చెప్పింది. కాకి  మాటలను విన్న కప్ప బుద్ధి తెచ్చుకుని, ఎవరినీ ఎగతాళి చేయకుండా అందరినీ గౌరవిస్తూ, స్నేహ పూర్వకంగా మెలగసాగింది. కప్పకు కనువిప్పు కలిగించినందుకు నీటిలోని జీవులు, నేలపైన జీవులు కాకిని అభినందించాయి.

కథాకళి
25.1.2026 ఫన్‌డేలో ప్రచురించిన ‘మధురం’ కథకి పాఠకులు సూచించిన టాప్‌ 5 పేర్లు. 

హ్యాపీ జర్నీ
సెడింబి జయలక్ష్మి నరసింహరావు

సెకండ్‌ ఇన్నింగ్స్‌
టి. సూర్య కుమారి (హైదరాబాద్‌)

వైతరణి వెళ్ళొస్తా!
డాక్టర్‌ కోటేశ్వరరావు (గూడూరు)

స్వర్గానికి స్మాల్‌ ట్రిప్‌
ఏ వి సోమయాజులు (కాకినాడ)

చావు (అ)భయం
దీక్షిత (నంద్యాల)

-కయ్యూరు బాలసుబ్రమణ్యం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement