పాడి రైతులకూ ఏఐ ఫలాలు: ప్రధాని మోదీ | AI Impact Summit a turning point PM Modi | Sakshi
Sakshi News home page

పాడి రైతులకూ ఏఐ ఫలాలు: ప్రధాని మోదీ

Feb 22 2026 11:47 AM | Updated on Feb 22 2026 12:06 PM

AI Impact Summit a turning point PM Modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 131వ ఎపిసోడ్‌లో దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అత్యాధునిక సాంకేతికత, సామాజిక స్పృహ, భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని మేళవిస్తూ సాగిన ఈ ప్రసంగంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇటీవల జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్- 2026 విశేషాలను పంచుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నేడు కేవలం పరిశ్రమలకే పరిమితం కాకుండా, పాడి రైతులకు కూడా సహాయకారిగా నిలుస్తూ అద్భుతాలు సృష్టిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

భారతీయ తయారీ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ‘జీరో-డిఫెక్ట్’ నాణ్యతతో కూడిన ఉత్పత్తులను రూపొందించాలని స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’లో పిలుపునిచ్చారు. సెమీకండక్టర్లు, అంతరిక్ష పరిశోధనలు, హరిత ఇంధనం తదితర రంగాల్లో యువత చూపుతున్న ప్రతిభే రాబోయే కాలంలో భారత్‌ను అంతర్జాతీయ ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తుందని ఆయన ఆకాంక్షించారు.

ఈ క్రమంలో ఒడిశాకు చెందిన యువ రైతు హిరోద్ పటేల్ ఉదాహరణను ప్రస్తావిస్తూ, సంప్రదాయ వ్యవసాయాన్ని విడిచిపెట్టి, నూతన దృక్పథంతో సాగు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచిన తీరును కొనియాడారు. అవయవ దానం ప్రాముఖ్యతను వివరిస్తూ కేరళకు చెందిన చిన్నారి ఆలిన్ షెరిన్ అబ్రహం త్యాగాన్ని ప్రధాని గుర్తుచేశారు. ఆ చిన్నారి మరణం తర్వాత ఆమె తల్లిదండ్రులు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం మరికొందరికి ప్రాణదానం చేసిందని, ఇలాంటి ఘటనలు సమాజంలో అవయవ దానంపై పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమని పేర్కొన్నారు.

దేశం బానిసత్వ చిహ్నాల నుంచి విముక్తి పొంది తన స్వంత సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటుకోవాలంటూ ప్రధాని ‘పంచ ప్రాణ్’ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 23 నుంచి రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న రాజాజీ ఉత్సవాల గురించి ప్రజలకు తెలియజేస్తూ, మన వారసత్వాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కాగా డిజిటల్ యుగంలో పెరుగుతున్న మోసాల పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరించారు. కేవైసీ (KYC) ప్రక్రియ విషయంలో జాగ్రత్త వహించాలని, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించుకోవాలని సూచించారు. తన ప్రసంగం ముగింపులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జె. జయలలిత జయంతిని పురస్కరించుకుని ఆమెకు ఘన నివాళులర్పించారు. జయలలిత వంటి ప్రజానేతలు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement