కేరళ కంపెనీ సాంకేతికతను పరిశీలిస్తున్న సంస్థ
డ్రైవర్ ప్రమేయం లేకుండా పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించనున్న హెడ్ లైట్లు
ప్రమాదాలను తగ్గించే క్రమంలో ఏర్పాటుకు ఆర్టీసీ చొరవ
దూర ప్రాంత సర్వీసుల్లో ఏర్పాటుకు యోచన
సాక్షి, హైదరాబాద్: బస్సులకు కృత్రిమ మేధతో పనిచేసే హెడ్ లైట్ల ఏర్పాటుకు సంస్థ కసరత్తు చేస్తోంది. కేరళకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన పరిజ్ఞానాన్ని సమకూర్చుకునేందుకు చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా, ఆ సంస్థ రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా కొన్ని బస్సుల్లో ఏర్పాటు చేసి పరిశీలించాలని నిర్ణయించింది. దూరప్రాంత బస్సుల్లో ఈ సాంకేతికత ఎలాంటి ఫలితాలనిస్తుందో సంబంధిత డ్రైవర్ల స్పందనను తెలుసుకుని సమీక్షించి దీని ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది.
భద్రతలో భాగమే...
ప్రస్తుతం కొత్త వాహనాల్లో కాంతి చాలా ఎక్కువగా ఉండే హెడ్లైట్లను వాడుతున్నారు. ఇది ఎదురుగా వచ్చే వాహనా లకు ప్రమాదకరంగా మారుతోంది. కాంతి ఎక్కువగా ఉండటంతో ఎదురు వాహనాల డ్రైవర్లకు రోడ్డు సరిగా కనిపించని పరిస్థితి ఉంటోంది. ఆ కాంతి నేరుగా ఎదురు డ్రైవర్లపై ప్రసరించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అన్ని ప్రాంతాల్లో సరిగ్గా ఉండటం లేదు. రోడ్డుపై సెంట్రల్ మీడియన్ లేని చోట్ల ఇది ప్రమాదాలకు ఆస్కారం కల్పిస్తోంది.
ఇక, రోడ్డు మ లుపులు, గుంతలు, ఇరుకుగా ఉండటం లాంటి సమ స్యలను డ్రైవర్లు రాత్రి వేళ వేగంగా గుర్తించాల్సి ఉంటుంది. అలాంటి సమయాల్లో హెడ్ లైట్లు కీలకంగా వ్యవహరిస్తాయి. ఇలాంటి అన్ని రకాల పరిస్థితులను గమనంలో ఉంచుకుని తనంతట తానుగా కాంతిని పెంచుకోవటం, తగ్గించుకోవటం చేసుకోగలిగే లైటింగ్ వ్యవస్థను ఈ సాంకేతికత సమకూరుస్తుంది. పరిస్థితులకు తగ్గట్టుగా లైటు కాంతిని పెంచుకోవటం, తగ్గించుకోవటం డ్రైవర్ ప్రమేయం లేకుండా ఆ సాంకేతికతనే చూస్తుంది. డ్రైవర్ స్పందించడానికి ముందే ఈ సాంకేతికత స్పందించటం దీని ప్రత్యేకత.
» ఎదురుగా వచ్చే వాహనాల డ్రైవర్ లైట్ కాంతి నేరుగా ఎదుటి వాహన డ్రైవర్ కంటిలోకి ప్రసరించకుండా డిప్పర్ వాడాల్సి ఉంటుంది. కానీ, చాలా మంది డ్రైవర్లు దాన్ని పట్టించుకోకుండా అలాగే దూసుకొస్తారు. అప్పుడు ఆ కాంతికి ఎదురు వాహనం డ్రైవర్ రోడ్డును సరిగా గుర్తించలేదు. ఇలాంటి తరుణంలో, ఏఐ ఆధారిత వ్యవస్థ ఆ వాహన కాంతిని పెంచి డ్రైవర్కు రోడ్డు కొంతమేర కనిపించేలా చేస్తుంది.
» వీధి దీపాల కాంతి ధారాళంగా ఉన్న చోట, ఇతర రకాలుగా వెలుగు ఎక్కువగా ఉన్న చోట, హెడ్ లైట్లు డిమ్గా మారుతుంది. దీంతో బ్యాటరీ వినియోగం తగ్గి ఖర్చు ఆదా అవుతుంది.
» రోడ్డు మలుపులున్న చోట, బస్సు లైట్ల కాంతి రోడ్డు మీద సరిగా ఉండదు. ఈ వ్యవస్థలో ఆ సమస్య కూడా అధిగమించి లైటింగ్ వ్యవస్థ వెంటనే స్పందించి పక్కలకు వెలుగు వచ్చేలా చేస్తుంది.
» డిప్పర్ విషయంలోనూ ఈ సాంకేతికత స్పందించి తదనుగుణంగా వ్యవహరిస్తుంది.
» కొన్ని ప్రీమియం కార్లలో ఈ వ్యవస్థ అందుబాటులో ఉంది. కానీ, బస్సుల్లో ఇప్పటి వరకు లేదు. తొలిసారి ఆర్టీసీ తన బస్సుల్లో దీన్ని ఏర్పాటు చేసుకోబోతోంది.
» కొద్ది రోజుల పాటు దీన్ని పరిశీలించి, సానుకూల ఫలితాలనిస్తోందని డ్రైవర్లు చెబితేనే దాని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.


