11వేలకుపైగా విమానసర్విసులు రద్దు
విద్యుత్ అంతరాయంతో 5లక్షల ఇళ్లలో అంధకారం
న్యూయార్క్: అమెరికా ఈశాన్య రాష్ట్రాల ప్రజలను మంచు తుపాను గజగజా వణికిస్తోంది. అంతటా అరమీటర్ మందంతో మంచు పేరుకుపోవడంతో రైలు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వాహనాల రాకపోకలపై నిషేధం కొనసాగింది. మంచుతుపాను దెబ్బకు ఇప్పటిదాకా 11,055 విమానసర్వీసులను రద్దుచేశారు. పాత రికార్డులను బద్దలుకొడుతూ ఎనిమిది రాష్ట్రాల్లో మంచు తుపాను జనజీవనాన్ని స్తంభింపజేసింది.
మేరీల్యాండ్లో చాలా చోట్ల అరమీటర్ మందంతో మంచు కురిసింది. ఇక రోడ్ ఐలాండ్లోని ప్రోవిడెన్స్ ప్రాంతంలో ఏకంగా 96.26 సెంటీమీటర్ల మందంలో మంచు కురిసింది. 1978 ఏడాది తర్వాత ఇక్కడ ఇంతటి స్థాయిలో మంచు కురవడం ఇదే తొలిసారి అని అమెరికా జాతీయ వాతావరణ సేవల విభాగం ప్రకటించింది. విద్యుత్స్తంభాలు, సబ్స్టేషన్లపై మంచు భారీగా పడటంతో విద్యుత్ అంతరాయం ఏర్పడి దాదాపు 5,00,000 ఇళ్లకు కరెంట్ సరఫరా ఆగిపోయింది. వర్జీనియా నుంచి మసాచుసెట్స్ దాకా చాలా ప్రాంతాల్లో విద్యుత్లైన్లు తెగిపోయాయి. న్యూయార్క్లో చాలా వరకు పాఠశాలలు, వ్యాపారాలు మూతబడ్డాయి.


