రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం మరోసారి భీకరంగా మారింది. నిన్న గురువారం రాత్రి ఆ దేశంపై పెద్ద ఎత్తున డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకపడినట్లు తెలుస్తోంది. ఈ దాడులలో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డట్లు సమాచారం.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ పరిస్థితులు సద్ధుమణగడం లేదు. ఇరు దేశాల మధ్య ఓ వైపు శాంతి చర్చలకు అవకాశం ఉందంటూనే మరోవైపు దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకపడింది. ఆదేశంలోని రైల్వే, ఎనర్జీ సెక్టార్ లక్షంగా దాడులు జరిపింది. ఈ అటాక్స్లో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా పెద్ద ఎత్తున భవనాలు నెలకొరిగాయి.
అయితే దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. తమ దేశంపై 420 డ్రోన్లు, 39 మిస్సైల్స్, 11 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిందన్నారు. వాటిలో 374 డ్రోన్లను, 32 మిస్సైల్స్ను, 5 క్షిపణులను గాలిలోనే ధ్వంసం చేశామని పేర్కొన్నారు. అయితే కొన్ని ఉక్రెయిన్ భూభాగాలను తాకాయన్నారు. రష్యా జరిపిన దాడిలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని వారిలో పిల్లలు అధికంగా ఉన్నారని జెలెన్స్కీ పేర్కొన్నారు.


