మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్‌ సీరియస్‌ | Russian Missile Strikes Indian Pharma Firm In Ukraine | Sakshi
Sakshi News home page

మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్‌ సీరియస్‌

Apr 13 2025 7:24 AM | Updated on Apr 13 2025 9:59 AM

Russian Missile Strikes Indian Pharma Firm In Ukraine

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను టార్గెట్‌ చేసిన రష్యా దళాలు.. భీకర దాడులు చేశాయి. ఈ క్రమంలో భారతీయ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది. దీంతో, పేలుడు సంభవించి దట్టమైన మంటలు చెలరేగాయి. మరోవైపు.. రష్యా దాడులను భారత్‌ తీవ్రంగా ఖండించింది. భారత్‌తో స్నేహం ఉందని చెప్పే రష్యా కావాలనే ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్‌ అంటూ ప్రశ్నించారు.

వివరాల ప్రకారం.. కీవ్‌లోని భారతీయ ఔషధ కంపెనీ కుసుమ్‌ అనే కంపెనీకి చెందిన గోదాముపై శనివారం రష్యా దాడి చేసింది. రష్యాకు చెందిన డ్రోన్ల దాడిలో గోదాం పూర్తిగా ధ్వంసమైంది. ఈ మేరకు గోదాంపై దాడి జరిగిందని ఢిల్లీలోని ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. రష్యా కావాలనే భారతీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించింది. పిల్లలు, వృద్ధుల కోసం ఔషధాలు నిల్వ చేసిన గోదాములపై ఇలా దాడులు చేస్తోందని విమర్శించింది. భారత్‌తో స్నేహం ఉందని చెప్పే రష్యా కావాలనే ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్‌ అంటూ ప్రశ్నించింది.

ఇక, అంతకుముందు ఉక్రెయిన్‌లోని బ్రిటన్‌ రాయబారి మార్టిన్‌ హారిస్‌ దాడిని ధ్రువీకరించారు. రష్యా డ్రోన్ల దాడిలో ఔషధాల గోదాము పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్‌తోపాటు 29 దేశాల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కుసుమ్‌ హెల్త్‌కేర్‌ వెబ్‌సైట్‌లో ఉంది. భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ గుప్తా యాజమాన్యంలోని కుసుమ్, ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ఫార్మా సంస్థలలో ఒకటి.

 

 

Advertisement
 
Advertisement
Advertisement