
కీవ్: ఉక్రెయిన్పై రష్యా మరోసారి భీకర క్షిపణి దాడులకు పాల్పడింది. సుమీ నగరం నడిబొడ్డున ఆదివారం జరిపిన వరుస దాడుల్లో కనీసం 34 మంది మృత్యువాత పడగా 117 మంది క్షతగాత్రులయ్యారు. ఉదయం 10.15 గంటల సమయంలో జనావాసాలున్న ప్రాంతంలో పామ్ సండే వేడుకల్లో పాల్గొన్న వారిపై పడ్డాయి. వీటి పేలుడు తీవ్రతకు ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగకమ్ముకుని భీతావహంగా మారింది. ఇద్దరు చిన్నారులు సహా 34 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరో 15 మంది చిన్నారులు సహా 117 మంది గాయపడ్డారు. భవనాలు శిథిలాల దిబ్బగా మారింది. నుజ్జయిన వాహనాల నుంచి మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మండిపడ్డారు. రష్యాను ఉగ్రవాదిగా పరిగణిస్తూ చర్యలు తీసుకోవాలని పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తున్నారంటూ రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఆరోపణలు చేసుకున్న మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.