పూంఛ్లో మట్టిదిబ్బ కూలి ఏడుగురి మృతి
తల్లి, ఇద్దరు బిడ్డల సజీవ సమాధి
డోడాలో బస్సుపై బండరాయి.. ఇద్దరి మృతి
మరో ఘటనలో మహిళ మరణం
భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు
తీర్థయాత్రల తాత్కాలిక రద్దు
గువాహటి/జమ్మూ/డెహ్రాడూన్: జమ్మూ కశ్మీర్ అతాలాకుతలమవుతోంది. సోమవారం కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలను ఆకస్మిక వరదలు చుట్టుముట్టాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. వేర్వేరు ఘటనల్లో 11 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. హిమాలయ ప్రాంత రాష్ట్రాలు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలోనూ సోమవా రం భారీ వర్షాలు జన జీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. మంగళవారం కూడా ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కావచ్చునని భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది.
ఉత్తరాఖండ్, బిహార్, అసోం, మేఘాలయాల్లో సోమవారం భారీ వర్షాలు నమోదైనట్లు తెలిపింది. రానున్న నాలుగైదు రోజుల్లో వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుకుగా ఉంటాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడిన కారణంగా రుతుపవనాలు చురుకుగా మారాయని తెలిపింది. ఉత్తరాఖండ్లో ఒక బాలిక సరయూ నదిలో కొట్టుకుపోయి గల్లంతయ్యింది. దీంతో ఉత్తరాఖండ్సహా, జమ్మూ కశ్మీర్లో పలు తీర్థయాత్రలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఫలితంగా వందలాది మంది యాత్రీకులు శిబిరాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.
మట్టిదిబ్బ కూలి
భారీ వర్షాల కారణంగా జమ్మూ కశ్మీర్లోని పూంఛ్ ప్రాంతంలో కొండచరియ విరిగిపడ్డ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఎత్తైన ప్రాంతంలో ఉన్న లోరాన్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని భారీ మట్టిదిబ్బ ఒకటి అకస్మాత్తుగా ఇంటిపై పడిందని తెలిపారు. మరణించిన ఏడుగురిలో తల్లి, ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారని చెప్పారు. రాజౌరీ ప్రాంతంలో ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన వికాస్ అహ్మద్ అనే వ్యక్తి మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. పూంఛ్ ప్రాంతంలో గత శనివారం నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి.
ఇదిలా ఉండగా జమ్మూ కశ్మీర్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొత్తం 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సోమవారం పూంఛ్, రజౌరీ జిల్లాల్లో సహాయక చర్యలు కూడా మందగించాయి. డోడా ప్రాంతంలో సోమవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించగా మరో ఆరుగురు గాయపడ్డారు.
రగ్గీ నల్లా ప్రాతంలో జమ్మూ కిశ్తవార్ జాతీయ రహదారిపై బండరాయి ఒకటి దొర్లుకుంటూ వచ్చి ప్రయాణికుల బస్సుపై పడింది. ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయడగా వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈలోపుగానే మనీశ్ కుమార్ అనే వ్యక్తి మార్గమధ్యంలో మరణించినట్లు అధికారులు తెలిపారు. రాయి ధాటికి బాగా దెబ్బతిన్న బస్సులోంచి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీశామని చెప్పారు. కష్తీఘర్ ప్రాంతంలో సంభవించిన రెండో ఘటనలో ఒక రాయి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో శివ్ దేవి అనే మహిళ మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒక ఇల్లు కూడా దెబ్బతినిందని చెప్పారు.
తీర్థయాత్రల నిలిపివేత
భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడంతో ఉత్తరాఖండ్లోని నాలుగు జాతీయ రహదారులతోపాటు సుమారు 150 రహదారుల్లో రాకపోకలు స్తంభించి పోవడంతో చార్ధామ్ యాత్ర (కేదారనాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి) యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. రహదారులు రాకపోకలను అనువుగా మారిన వెంటనే యాత్రను పునరుద్ధరిస్తామని చెప్పారు.
అప్పటివరకూ యాత్రీకులు ఎవరినీ తీర్థయాత్ర మార్గాల్లో ప్రయాణించేందుకు అనుమతించరాదని ఘర్వాల్ కమిషనర్ ఆనంద్స్వరూప్ జిల్లా అధికారులు అందరినీ ఆదేశించారు. వాతావరణ శాఖ అధికారులు సోమవారం డెహ్రాడూన్, తేహ్రీ, హరిద్వార్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో అరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో యాత్రీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా యాత్రీకులను క్యాంపులకు పరిమితం చేస్తున్నామని వివరించారు. అదేవిధంగా జమ్మూ కశ్మీర్లోనూ అమర్నాథ్, వైష్ణోదేవి, శివఖోరి యాత్రలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.


