ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డి (nandini sidhareddy)ని వరించింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 2026 సంవత్సరానికి గాను ఆయన రాసిన "అనిమేష" కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులు, మానవీయ కోణాలను ఈ కవితా సంపుటిలో సిధారెడ్డి చిత్రించారు. సాహిత్య అకాడమీ అవార్డు కింద రూ. లక్ష నగదు, తామ్రపత్రం, శాలువాను ప్రదానం చేస్తారు.
సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం రాష్ట్రానికే గర్వకారణమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
తెలంగాణ మట్టి సువాసనను, ఉద్యమ స్ఫూర్తిని తన కలంతో విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ కవి, సాహితీవేత్త శ్రీ నందిని సిధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం అత్యంత సంతోషదాయకం
ఇది తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవం. వారికి నా హృదయపూర్వక అభినందనలు. pic.twitter.com/o1wqCEcSPu— KTR (@KTRBRS) March 16, 2026
మెదక్ జిల్లా బందారం గ్రామంలో సిధారెడ్డి 1955లో జన్మించారు. ఆయన తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.పూర్తిచేసి, ‘ఆధునిక తెలుగుకవిత్వంలో సూర్యుడు’ అనే అంశంపై ఎం.ఫిల్ (1981) పట్టా ఆ తర్వాత ‘ఆధునిక కవిత్వం, వాస్తవికత – అధివాస్తవికత’ పై పరిశోధన చేసి పి.హెచ్.డి (1986) పట్టా పుచ్చుకున్నారు. నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్గా పనిచేశారు.


