గంపెడాశలతో ఇండస్ట్రీలో అడుగుపెడదామని వస్తున్న ఎంతోమంది తప్పుదారి పడుతున్నారంటోంది బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా. అవకాశాల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నవారిని కొన్ని అదృష్య శక్తులు నిలువునా ముంచేస్తున్నాయంటోంది. తాజాగా ఓ పాడ్కాస్ట్లో తనుశ్రీ దత్తా మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో మొదట అందానికి ప్రాధాన్యతనిస్తారు. వారికి టాలెంట్ ఉందా? లేదా? అనేది ఆలోచించరు. అందాన్ని చూసి పొగడ్తలు కురిపిస్తారు. కానీ అది విని మీరు బోల్తా కొట్టకూడదు.
ముందు పొగడ్తలు
నా చిన్నతనంలో నా తల్లి అపరిచితులతో మాట్లాడకూడదని, వారిచ్చే చాక్లెట్లు తీసుకోకూడదని చెప్పేది. ఇండస్ట్రీలో అలాంటి అపరిచితులు, వారిచ్చే చాక్లెట్లు చాలా రకాలుగా ఉంటాయి. వారి కోరిక తీర్చుకునేందుకు ముందు మిమ్మల్ని పొగుడుతారు. తర్వాత మీ కలల్ని, ఆశయాల్ని ఆసరా చేసుకుని మిమ్మల్ని వాడుకుంటారు. ఈ క్రమంలో అవకాశాలు అందుకుని ముందడుగు వేసిన కొందరు విజయం సాధిస్తారు, మరికొందరు బాధతో ఇంటికి తిరిగెళ్లిపోతారు.
నన్ను నేను అమ్ముకోను
ఇంకొంతమందైతే ముందుకు వెళ్లలేక, వెనక్కూ వెళ్లలేక వ్యభిచారంలోకి నెట్టబడతారు. ఇలాంటి రహస్యాలు బయటకు ఎప్పుడూ రావు. ఎందుకంటే సక్సెస్ స్టోరీలు మాత్రమే బయటకు వస్తాయి, వాటి గురించే అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే నా మాటల వల్ల నలుగురు అలర్ట్ అయి వారిని వారు కాపాడుకున్నా అదే నాకు సంతోషం. ఇండస్ట్రీలో కాంప్రమైజ్ సాధారణమే అని ఓ నటి అన్నందుకు ఆమెతో స్నేహాన్నే తెంచుకున్నాను. నేను ఆర్టిస్ట్ను.. ఒకరికి నా జీవితాన్ని అమ్ముకునేదాన్ని కాదు అని చెప్పుకొచ్చింది.
మీటూ
మీటూ ఉద్యమం సమయంలో తను కూడా బాధితురాలినేనంటూ మీడియా ముందుకు వచ్చింది తనుశ్రీ దత్తా. నానాపటేకర్ లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమాలోని ఓ పాట షూటింగ్లో నానా పటేకర్ సహా మరో ముగ్గురు తనను వేధించారని ఆరోపించింది. అయితే ఘటన జరిగిన మూడేళ్లలోపు ఫిర్యాదు చేస్తేనే విచారిస్తామని, ఇది పదేళ్ల కిందటినాటి ఘటన కావడంతో విచారణ కుదరదని న్యాయస్థానం కేసు కొట్టివేసింది. బాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన తనుశ్రీదత్తా.. తెలుగులో వీరభద్ర చిత్రంలో యాక్ట్ చేసింది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది.
చదవండి: తెలుసు కదా.. షూటింగ్లోనే తేడా కొట్టింది: రాశీ ఖన్నా


