
కీవ్: రష్యా మరోసారి రెచ్చిపోయింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్తోపాటు పలు ప్రాంతాలపై ఆదివారం రాత్రి డ్రోన్లు, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడింది. దాడుల్లో కీవ్లో ఏడుగురు సహా మొత్తం 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కనీసం 30 మంది క్షతగాత్రులయ్యారు.
రష్యా 352 డ్రోన్లు, 11 బాలిస్టిక్ క్షిపణులు, ఐదు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ పేర్కొంది. వీటిలో 339 డ్రోన్లు, 15 క్షిపణులను తమ గగనతల వ్యవస్థలు అడ్డుకున్నాయంది. నివాసప్రాంతాలు, ఆస్పత్రులు, క్రీడా సముదాయాలు లక్ష్యంగా దాడులు జరిగాయని ఆర్మీ తెలిపింది. కీవ్లో ఐదంతస్తుల అపార్టుమెంట్లో కొంతభాగం కుప్పకూలగా ఏడుగురు చనిపోయారని, నలుగురు శిథిలాల్లో చిక్కుకున్నారంది.