
చిన్నపిల్లల్లా కీచులాడుతున్నారు
రష్యా–ఉక్రెయిన్పై ట్రంప్ ఆగ్రహం
వాషింగ్టన్/కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతులెత్తేశారు. రెండు దేశాలనూ ఇంకొన్నాళ్లు కొట్టుకోనివ్వడమే మేలని వ్యాఖ్యానించారు. గురువారం వైట్హౌస్లో జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్తో భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవి మరీ చిన్నపిల్లల మాదిరిగా కీచులాడుకుంటున్నాయంటూ ఆక్షేపించారు.
‘‘కొన్నిసార్లు ఓపికున్నంత సేపు కొట్టొకోనివ్వడమే మేలు. తర్వాత ఇద్దరినీ చెరోవైపు లాగేయాలి. నిన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఇదే మాట చెప్పా’’ అని ట్రంప్ అన్నారు. అయితే, ‘‘నా మాట వినకపోతే చాలా కఠినంగా వ్యవహరిస్తా. యుద్ధానికి తెర దించకపోతే రెండు దేశాలపైనా ఆంక్షలు విధిస్తా’’ అంటూ మరోసారి కుండబద్దలు కొట్టారు.
రష్యా డ్రోన్ దాడుల్లో ఐదుగురు మృతి
బుధవారం రాత్రి ఉత్తర ఉక్రెయిన్లోని ప్రిలుకీ నగరంపై రష్యా డ్రోన్ దాడిలో ఐదుగురు మరణించారు. ‘‘స్థానిక ఫైర్ చీఫ్ ఒలెక్జాండర్ లెబిడ్ ఇంటిపై డ్రోన్ దాడులు జరిగాయి. ఆయన భార్య, కుమార్తె, ఏడాది వయసున్న మనవడు చనిపోయారు’’ అని అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. చిన్నారి తల్లి కీవ్లో పోలీసు అధికారి. అక్కడ రష్యా దాడులు పెరగడంతో బాబును తల్లిదండ్రుల దగ్గర వదిలేందుకు వచ్చి తనతో పాటుగా బలైంది. పుతిన్తో ట్రంప్ ఫోన్ సంభాషణ జరిగిన కొద్ది గంటల్లోపే ప్రిలుకీపై దాడి జరగడం గమనార్హం. ఆదివారం తమ వైమానిక స్థావరాలపై జరిపిన దాడులకు గట్టి ప్రతీకారం తీర్చుకుంటామని పుతిన్ తనతో అన్నట్లు అనంతరం ట్రంప్ చెప్పారు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ప్రయత్నాలు సాగిస్తుండటం తెల్సిందే.