దోహా చేరుకున్న తాలిబన్‌ నేతలు | Talibans go to Doha setting stage for Afghan peace talks | Sakshi
Sakshi News home page

దోహా చేరుకున్న తాలిబన్‌ నేతలు

Sep 6 2020 4:46 AM | Updated on Sep 6 2020 4:46 AM

Talibans go to Doha setting stage for Afghan peace talks - Sakshi

ఇస్లామాబాద్‌: అఫ్గాన్‌ ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం తాలిబన్‌ నేతల బృందం ఖతార్‌ రాజధాని దోహాకు చేరుకుంది. ఫిబ్రవరిలో దోహాలో అమెరికా– తాలిబన్ల మధ్య జరిగిన శాంతి ఒప్పందానికి ఈ చర్చలు కొనసాగింపు. ఈ చర్చల కోసం అమెరికా అటు అఫ్గాన్‌ ప్రభుత్వం, తాలిబన్లపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. చర్చల సారాంశం ఆధారంగా అఫ్గాన్‌ భవితవ్యం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్త్రీలు, మైనార్టీల హక్కుల పరిరక్షణ, మిలిషియాలను నిరాయుధులను చేయడం,  పునరావాసం కల్పించడం వంటి అనేక కీలకాంశాలు ఈ చర్చలపై ఆధారపడి ఉన్నాయి.

గత వారం చర్చల కొనసాగింపునకు సంబంధించి అఫ్గాన్‌ అధ్యక్షుడితో యూఎస్‌ సెక్యూరిటీ సలహాదారు రాబర్ట్‌ ఓ బ్రెయిన్‌ మంతనాలు జరిపారు. మరోవైపు తాలిబన్లను చర్చలకు ఒప్పించేందుకు పాకిస్తాన్‌ వైపు నుంచి ఒత్తిడి తెచ్చారు. ఇప్పటికే ఈ చర్చలు జరగాల్సిఉండగా, ఖైదీల విడుదలపై ఎటూ తేలకపోవడంతో ప్రతిష్ఠంభన ఏర్పడింది. చర్చలకు ముందే ఇరుపక్షాలు హింసను విడనాడాలని యూఎస్, అఫ్గాన్‌ ప్రభుత్వాలు చెబుతుండగా, తర్వాతే  కాల్పుల విరమణపై సంప్రదింపులు జరపాలని తాలిబన్లు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement