యుద్ధం దిశగా పాక్‌-ఆఫ్ఘాన్‌ | Pakistani Army Attacks Civilian Areas In Afghanistan | Sakshi
Sakshi News home page

యుద్ధం దిశగా పాక్‌-ఆఫ్ఘాన్‌

Mar 14 2026 6:48 AM | Updated on Mar 14 2026 7:04 AM

Pakistani Army Attacks Civilian Areas In Afghanistan

కాబూల్‌: పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ మధ్య ఘర్షణ రగులుతోంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పరస్పర దాడుల్లో సామాన్య జనం బలైపోతున్నారు. పాకిస్తాన్‌ సైన్యం గురువారం రాత్రి తమ రాజధాని కాబూల్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో సాధారణ జనావాసాలపై మోర్టార్లతో దాడులు చేసినట్లు అఫ్గానిస్తాన్‌ తాలిబన్‌ ప్రభుత్వం ఆరోపించింది. ఈ దాడుల్లో కనీసం ఆరుగురు పౌరులు మరణించారని, పది మందికిపైగా గాయపడ్డారని వెల్లడించింది. ఈ దాడులకు ప్రతీకారం పాకిస్తాన్‌ సైనిక కేంద్రాలపై విరచుకుపడ్డామని పేర్కొంది.

ఖైబర్‌ పఖ్తూంక్వాలోని కోహట్‌లో జరిగిన ఈ వైమానిక దాడిలో పాకిస్తాన్‌కు భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపింది. కాందాహార్‌ ఎయిర్‌పోర్టు సమీపంలోని ప్రైవేట్‌ ఎయిర్‌లైన్‌ సంస్థ ఇంధన డిపోలపై పాక్‌ వైమానిక దాడులకు దిగినట్లు అఫ్గాన్‌ ప్రభుత్వ ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్‌ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. పౌర విమానయాన సంస్థలతోపాటు ఐక్యరాజ్యసమితి విమానాలకు ఇక్కడి నుంచే ఇంధనం సరఫరా అవుతుందని తెలిపారు. అఫ్గానిస్తాన్‌ భూభాగంపై విజయవంతంగా వైమానిక దాడులు చేసినట్లు పాక్‌ ప్రభుత్వ టీవీ చానల్‌ పేర్కొంది.

మిలిటెంట్ల స్థావరాలను, వారి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వివరించింది. అఫ్గాన్, పాక్‌ మధ్య మూడు వారాల క్రితం ఘర్షణ ఆరంభమైంది. అఫ్గాన్‌పై తాము బహిరంగ యుద్ధం చేస్తున్నట్లు పాకిస్తాన్‌ ప్రకటించింది. సరిహద్దు వివాదానికి తోడు తాలిబన్‌ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా మిలిటెంట్‌ గ్రూప్‌లను ఉసిగొల్పుతోందని పాక్‌ సర్కార్‌ ఆరోపిస్తోంది.

అలాంటి గ్రూప్‌లకు తాము ఆశ్రయం ఇవ్వడం లేదని తాలిబన్లు కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉండగా, వాయువ్య పాకిస్తాన్‌లోని లకీ మార్వాత్‌జిల్లాలో జరిగిన బాంబు పేలుడులో ఆరుగురు పోలీసులు మృతిచెందారు. పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని దుండగులు బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనకు కారకులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. తాలిబన్ల అండదండలున్న తెహ్రీక్‌–ఇ–తాలిబన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) సంస్థ కారణం కావొచ్చని పాక్‌ అధికారులు అనుమానిస్తున్నారు. 

ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌–అమెరికా దాడులకు దిగుతున్నాయి. ఇరాన్‌ సైతం గట్టిగా ప్రతిఘటిస్తోంది. ఈ యుద్ధం తర్వాత పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ మధ్య భీకర యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరుదేశాల మధ్య సరిహద్దుగా డ్యూరాండ్‌ లైన్‌ఉంది. ఈ సరిహద్దును గుర్తించడానికి తాలిబన్‌ ప్రభుత్వం నిరాకరిస్తోంది. దాంతో వివాదం మొదలైంది.

సరిహద్దులో తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. సంయమనం పాటించాలని అంతర్జాతీయ సమాజం కోరుతున్నప్పటికీ పాక్, అఫ్గాన్‌లు వెనక్కి తగ్గడం లేదు. ఇరుదేశాల ఘర్షణ రానున్న రోజుల్లో పూర్తిస్థాయి యుద్ధంగా మారే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement