తాలిబన్లకు భారీ షాక్‌.. | Pakistan Army Strikes On Afghanistan Air Base | Sakshi
Sakshi News home page

తాలిబన్లకు భారీ షాక్‌..

Mar 5 2026 7:02 AM | Updated on Mar 5 2026 8:35 AM

Pakistan Army Strikes On Afghanistan Air Base

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్తాన్‌లోని బగ్రాం ఎయిర్‌ బేస్‌పై పాకిస్తాన్‌ భారీ వైమానిక దాడులు చేపట్టింది. పాక్‌ ప్రభుత్వ టీవీ బుధవారం ఈ విషయం వెల్లడించింది. అఫ్గాన్‌ తాలిబన్లు పాకిస్తాన్‌తో 2,600 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుల్లోని 53 ప్రాంతాల్లో దాడులకు తెగబడటంతో పాక్‌ ఆర్మీ ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి ఘజబ్‌ లిల్‌ హక్‌ పేరుతో భారీ ఆపరేషన్‌ ప్రారంభించింది.

అందులో భాగంగానే బగ్రాం వైమానిక స్థావరంపై తీవ్ర దాడులు జరిగాయని, అఫ్గాన్‌ తాలిబన్ల దురాక్రమణ చర్యలకు తగు బుద్ధి చెప్పామని పాక్‌ టీవీ పేర్కొంది. ఎయిర్‌బేస్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని, అందులోని ఓ హంగార్, రెండు గిడ్డంగులు ధ్వంసమయ్యాయంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ కథనాన్ని ఉటంకించింది. వారం రోజుల వ్యవధిలో అఫ్గానిస్తాన్‌లోని సైనిక లక్ష్యాలపై 50కి పైగా వైమానిక దాడులు జరిగాయని తెలిపింది. తాలిబన్లపై ఇలాంటి దాడులు మున్ముందు కూడా కొనసాగుతాయని హెచ్చరించింది.

టీటీఏ కమాండర్‌ హతం
పెషావర్‌: సరిహద్దులోని తోర్ఖామ్‌ వద్ద పాకిస్తాన్‌ సైన్యం జరిపిన కీలక ఆపరేషన్‌లో ఆఫ్ఘన్‌ తాలిబన్‌ కమాండర్‌ (టీటీఏ) కహ్రామాన్‌ హతమయ్యారు. ఈ ఘటనలో కమాండర్‌తో పాటు అతని అనుచరులు కూడా మరణించారు. తోర్ఖామ్, పాకిస్తాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్, ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హార్‌ మధ్య ప్రధాన సరిహద్దు క్రాసింగ్‌. పాకిస్తాన్‌ భూభాగంలోకి చొరబడి భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకోవడానికి కుట్ర పన్నుతున్న తాలిబన్లు లక్ష్యంగా ఈ దాడి జరిగిందని పాక్‌ ప్రభుత్వం తెలిపింది. సరిహద్దును చేరుకోవడానికి వారు ప్రయత్నించగా భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయని, భద్రతా దళాలు చేసిన దాడిలో ఖహ్రామాన్, అతని సహచరులు అనేక మంది మరణించారని వెల్లడించింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రధాన ఆపరేషన్‌లో మొత్తం 67 మంది ఆఫ్ఘన్‌ తాలిబన్లను చంపినట్లు పాకిస్తాన్‌ భద్రతా దళాలు పేర్కొన్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement