ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంటోందా? తాజా చర్చల్లో తాము కోరుకున్న దాదాపు అన్ని అంశాలకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న పరోక్ష చర్చలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఖతార్ రాజధాని దోహాలో ఇటీవల జరిగిన తాజా రౌండ్ చర్చల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇరాన్ మా ప్రభుత్వం కోరుకున్న దాదాపు అన్ని షరతులకు అంగీకరించినట్లు అనిపిస్తోంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఇంకా తుది శాంతి ఒప్పందం దిశగా పరిస్థితి పూర్తిగా స్థిరపడలేదని కూడా ఆయన అంగీకరించారు.
“మేము చర్చలు జరుపుతున్నాం. ఏమి జరుగుతుందో చూడాలి. నాకు అనిపిస్తోంది.. వారు మేము కోరిన దాదాపు అన్నింటికీ అంగీకరించారు” అని ట్రంప్ సీఎన్బీసీ(Trump CNBC Interview)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఇరాన్ సైనికంగా ఇప్పటికే బలహీనపడిందని, కొన్ని మిసైళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అవసరమైతే వాటినీ లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం తమకు ఉందని హెచ్చరించారు.
“వారు డ్రోన్తో ఒక నౌకపై దాడి చేశారు. దానికి నేను ప్రతిస్పందనగా చర్య తీసుకున్నాను. గత వారంలో.. వరుసగా మూడు రాత్రులు, అంతకుముందు రెండు రాత్రులు తీవ్రంగా దాడులు చేశాం” అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి..
ఇదిలా ఉంటే.. దోహాలో జరిగిన చర్చల్లో ఇరాన్ నిధుల విడుదల, హర్ముజ్ జలసంధిలో సముద్ర రవాణా భద్రత వంటి కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే అణు కార్యక్రమం (Nuclear programme) అంశం ఈ దఫా చర్చల్లో చర్చకు రాలేదని రాయిటర్స్ కథనం వెల్లడించింది.
అదే సమయంలో చర్చల్లో “సానుకూల పురోగతి” కనిపించిందని ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొనడం గమనార్హం. జూన్లో జరిగిన తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఆధారంగా చేసుకుని ఈ చర్చలు ముందుకు సాగుతున్నాయి అని ఖతార్ ప్రతినిధి మీడియాకు తెలిపారు. మరోవైపు.. వాషింగ్టన్ వర్గాలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నాయి.
అణు కార్యక్రమంపై చర్చలు తర్వాతి దశలోనే ప్రారంభమవుతాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు.
ఇప్పటికే అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తుల సమక్షంలో వేర్వేరు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఇరాన్ మాజీ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం తదుపరి దశ చర్చలు జరిగే అవకాశం ఉందని ఖతార్ విదేశాంగ శాఖ వెల్లడించింది. మొత్తంగా చూస్తే, ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గే దిశగా కొన్ని సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ, అణు అంశంపై స్పష్టత రాకపోవడం వల్ల పరిస్థితి ఇంకా అనిశ్చితంగానే ఉంది.


