ఇరాన్–అమెరికా శాంతి చర్చలకు బ్రేక్‌! | Is US Iran peace talks in Switzerland called off Details Here | Sakshi
Sakshi News home page

ఇరాన్–అమెరికా శాంతి చర్చలకు బ్రేక్‌!

Jun 19 2026 1:32 PM | Updated on Jun 19 2026 3:20 PM

Is US Iran peace talks in Switzerland called off Details Here

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు శాశ్వత తెర పడే ప్రయత్నాలకు విఘాతం కలిగింది. అమెరికా-ఇరాన్‌ మధ్య జరగాల్సిన శాంతి ఒప్పందం తాలుకా కీలక సమావేశం వాయిదా పడింది. శుక్రవారం స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్‌ పర్వత రిసార్ట్‌లో జరగాల్సిన ఈ భేటీ చివరి నిమిషంలో రద్దైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో.. తాత్కాలిక కాల్పుల విరమణ (ట్రూస్) భవిష్యత్తుపై భారీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శాంతి ఒప్పందానికి అవసరమైన పరస్సర అవగాహన ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌ అధ్యక్షులు సంతకాలు కూడా చేశారు. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం స్విట్జర్లాండ్‌లో ఇవాళ భేటీ జరగాల్సి ఉంది. దీనికి ఇరాన్‌-అమెరికా విదేశాంగ అధికారులతో పాటు పశ్చిమాసియా ప్రతినిధులు ఈ భేటీకి హాజరవుతారని అంతా భావించారు. అయితే.. ఇంతలోనే ట్విస్ట్ చోటుచేసుకుంది.  ఏర్పాట్లలో సమస్యలు తలెత్తడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ స్విట్జర్లాండ్ పర్యటన రద్దు చేసుకున్నారు. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తుండడంతోనే చర్చలు ఆగాయని ఇరాన్‌ ప్రకటించింది. దీంతో మరోసారి చర్చలకు బ్రేక్‌ పడింది. 

ఇప్పటికే ఇరాన్–అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక 60 రోజుల ఒప్పందాన్ని కుదిరింది. ఈ కాలంలోనే శాంతి చర్చలు పూర్తి కావాల్సి ఉంటుంది. అయితే ఒప్పందం అమలు చేసే దశలో కీలకమైన ఈ భేటీ రద్దు కావడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

వైట్ హౌస్ ప్రకారం.. చర్చలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, సమన్వయం, ప్రయాణాలు, షెడ్యూల్ వంటి విషయాలు(లాజిస్టిక్స్) అనూహ్యంగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అలాగే అమెరికా అధికారులు మాత్రం ఈ ఒప్పందం ఇంకా పూర్తిగా రద్దు కాలేదని, భవిష్యత్తులో చర్చలు కొనసాగవచ్చని సంకేతాలు ఇచ్చారు. 

ఇదే సమయంలో ఇరాన్ మాత్రం అమెరికా ముందుగా ఒప్పందాన్ని అమలు చేయాలన్న స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చర్చలకు షరతులు విధిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా అమెరికా అధిక డిమాండ్లు చేస్తే ఒప్పుకోబోమని హెచ్చరించారు.

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు వేలాది మంది మరణించగా, ఎనర్జీ ధరలు పెరిగి ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. తాజా ఒప్పందం కింద ఇరాన్‌కు ఆర్థిక ఆంక్షల సడలింపు, ఆస్తుల విడుదల వంటి అంశాలు ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ ఈ చర్చల్లో భాగం కాకపోవడం వివాదంగా మారింది.

అదే సమయంలో లెబనాన్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. హెజ్‌బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 16 మంది మరణించగా, పలు ప్రాంతాల్లో భీకర బాంబు దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్ మధ్య కూడా ఈ యుద్ధ విధానంపై అభిప్రాయ భేదాలు బయటపడుతున్నాయి. కొన్నిగంటల ముందు ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి జేడీ వాన్స్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన ఈ యుద్ధ లక్ష్యాలు.. ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా నిలిపివేయడం, ప్రాంతీయ దాడులను ఆపడం. అయితే ఈ రెండూ ఇప్పటివరకు పూర్తిగా సాధ్యం కాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ కొత్త ఒప్పందంలో ఆర్థిక సడలింపులు, పునర్నిర్మాణ నిధులు వంటి అంశాలు ఉండటం చర్చలకు కొత్త మలుపు ఇచ్చాయి.

చర్చలు ప్రస్తుతానికి రద్దు కావడంతో మిడిల్‌ ఈస్ట్‌లో శాంతి ఆశలు మరోసారి అనిశ్చితిలో పడిపోయాయి. రాబోయే రోజుల్లో ఇరాన్–అమెరికా మళ్లీ చర్చల టేబుల్‌కి వస్తాయా? అనేది ప్రపంచ రాజకీయాల్లో కీలక ప్రశ్నగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement