మరోసారి యుద్ధమా?.. చివరి నిమిషంలో ట్రంప్‌ యూటర్న్‌ | Iran War Back on the Table?: Trumps Last Minute U Turn Revealed | Sakshi
Sakshi News home page

మరోసారి యుద్ధమా?.. చివరి నిమిషంలో ట్రంప్‌ యూటర్న్‌

Jul 2 2026 7:10 AM | Updated on Jul 2 2026 7:13 AM

Iran War Back on the Table?: Trumps Last Minute U Turn Revealed

ఒకవైపు ఇరాన్‌తో శాంతి చర్చలు కొనసాగుతుండగా.. మరోవైపు వైట్‌హౌస్‌లో యుద్ధంపై అత్యంత కీలక సమావేశాలు జరిగాయి. ఇరాన్‌పై మరోసారి భారీ సైనిక దాడులు చేసి "ఈసారి కథ ముగించేయాలా?" అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అత్యున్నత రక్షణాధికారులతో సుదీర్ఘంగా చర్చించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే చివరి క్షణంలో ట్రంప్ యూటర్న్‌ తీసుకున్నట్లు ఆ కథనం వెల్లడించింది..  

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం..  ట్రంప్ ఇటీవల రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్‌తో అధ్యక్ష భవనంలో పలు దఫాలుగా సమావేశమయ్యారు. ఇరాన్‌తో కొనసాగుతున్న అణు చర్చలను విరమించి, మళ్లీ పెద్ద ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించాలా? అనే అంశంపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

అమెరికా రక్షణ వర్గాల్లోని కొంతమంది అధికారులు ఈ ఆపరేషన్‌ను ఫినిష్‌ ది జాబ్‌ "Finish the Job"గా అభివర్ణించినట్లు సమాచారం. గత సైనిక చర్యలతో ఇరాన్ సైనిక సామర్థ్యం దెబ్బతిన్న నేపథ్యంలో, మిగిలిన మౌలిక సదుపాయాలనూ పూర్తిగా ధ్వంసం చేసి యుద్ధానికి ముగింపు పలకాలని వారు సూచించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తుది ఆమోదం ఇవ్వలేదు. 

ఇప్పుడే మరోసారి భారీ యుద్ధానికి వెళ్తే దౌత్య చర్చలు పూర్తిగా దెబ్బతింటాయని, ఇరాన్ అణు కార్యక్రమాన్ని చర్చల ద్వారానే నియంత్రించడం మంచిదని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చెప్పింది కూడా సబబేనని అధికారులు భావించినట్లు సదరు వార్తా కథనం పేర్కొంది.

అయితే యుద్ధం పూర్తిగా తప్పిపోయిందని భావించే పరిస్థితి లేదని అమెరికా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించినా లేదంటే అమెరికా బలగాలపై దాడులకు పాల్పడినా, పరిమిత స్థాయి సైనిక దాడులు చేపట్టేందుకు ట్రంప్ సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మిలిటరీ ఆప్షన్‌ను పూర్తిగా పక్కన పెట్టలేదని అధికారులు చెబుతున్నారు.

ఇదే సమయంలో ఖతార్ రాజధాని దోహాలో అమెరికా-ఇరాన్ మధ్య మరో విడత పరోక్ష చర్చలు కూడా జరిగాయి. ఈ సమావేశాల్లో హర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకాయానం పునరుద్ధరణ, ఇరాన్‌కు చెందిన సుమారు 6 బిలియన్ డాలర్ల ఫ్రీజ్‌డ్ నిధుల్లో కొంత భాగాన్ని విడుదల చేయడం, ఒప్పంద ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం వంటి అంశాల్లో పురోగతి సాధించినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే అణు కార్యక్రమం, ఆంక్షల ఎత్తివేత వంటి ప్రధాన వివాదాలు మాత్రం ఇంకా పరిష్కారానికి రాలేదు.

హర్ముజ్ జలసంధి ఇప్పటికీ ఇరు దేశాల మధ్య అతిపెద్ద వివాదంగా కొనసాగుతోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గంపై అధిక నియంత్రణ కోరుతున్న ఇరాన్.. అంతర్జాతీయ నౌకాయానం ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనసాగాలని అమెరికా పట్టుబడుతోంది. ఇదే అంశం భవిష్యత్ చర్చల్లోనూ కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ట్రంప్ దౌత్య చర్చలకే ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, పరిస్థితులు మారితే మరోసారి భారీ సైనిక చర్యలకు వెనుకాడబోమనే సంకేతాలను కూడా ఇస్తున్నారు. దీంతో ఇరాన్-అమెరికా ఉద్రిక్తత తాత్కాలికంగా తగ్గినట్లే కనిపిస్తున్నా.. యుద్ధ మేఘాలు మాత్రం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement