ఐరోపా చరిత్రలోనే అత్యంత ఘోరమైన వేడిగాలుల కారణంగా ఇప్పటివరకు 1,300 మందికి పైగా ప్రాణాలుకోల్పోయారు. ఒక్క స్పెయిన్లోనే 1,000 కి పైగా మరణాలు నమోదయ్యాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల ఆసుపత్రులు, విద్యుత్ గ్రిడ్లు మరియు అత్యవసర సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. తీవ్రమైన వేడి కారణంగా ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ వార్డులు హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్, కిడ్నీ ఫెయిల్యూర్, గుండె జబ్బుల రోగులతో కిక్కిరిసిపోయాయి.వాతావరణ మార్పుల (Climate Change) వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రజలు పడుతున్న కష్టాలు, ప్రభుత్వ చర్యలకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట హాట్ టాపిక్గా మారాయి.
రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు - భారీ ప్రాణనష్టం
జూన్ 21 నుండి ఇప్పటివరకు ఐరోపా వ్యాప్తంగా 1,300 మందికి పైగా అదనపు మరణాలు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.
Heat wave in China too... 🌞🔥🔥
Europe is melting
China tries to beat the heat with city-wide cooling systems...💦🚿💦🚿pic.twitter.com/dDAqlXNpcp— sunita (סוניטה) 🧡🤍💚 (@sunita747) July 1, 2026
స్పెయిన్ పరిస్థితి: స్పెయిన్లో ఉష్ణోగ్రతల కారణంగా 1,028 మంది మరణించారు. గత ఏడాది (జూన్ 2025) నాటి 407 మరణాలతో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువ. 2026 మొదటి ఆరు నెలలు స్పెయిన్ చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదయ్యాయి.
ఇతర దేశాలు: జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్, స్లోవేకియా, హంగేరి వంటి దేశాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. స్లోవేకియా, హంగేరి దేశాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 41 డిగ్రీల సెల్సియస్ దాటాయి. ఐరోపా వ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మంది ప్రజలు 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నారు.
ప్యారిస్లో అయితే మరీ దారుణం
ప్యారిస్లోని ‘ప్యారిస్-సాక్లే’ ఆసుపత్రిలో రోగుల శరీర ఉష్ణోగ్రతలను తగ్గించడానికి సరిపడా ఐస్ (మంచు) ముక్కలు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సిబ్బంది పక్కనే ఉన్న ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు, సూపర్మార్కెట్ల నుండి ఐస్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. అనేమంది రోగులు 40 డిగ్రీల శరీర ఉష్ణోగ్రతతో కోమాలోకి వెళ్లిపోతున్నారు. శరీరం ఈ వేడిని తట్టుకోలేనప్పుడు గుండె పనిచేయడం ఆగిపోతుందని ఎమర్జెన్సీ విభాగాధిపతి డాక్టర్ నికోలస్ గొంజాల్వెజ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆసుపత్రుల్లో కూలింగ్ సిస్టమ్స్ మెరుగుపరచడానికి ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను 100 మిలియన్ యూరోల అత్యవసర నిధిని ప్రకటించారు. అలాగే వైద్య సదుపాయాల కోసం 30 వేల ఎయిర్ కండిషనర్లను కొనుగోలు చేస్తున్నారు. కొన్ని పాత కాలపు ఆసుపత్రి భవనాల్లో ఏసీలు లేకపోవడంతో మందులు పాడవకుండా ఉండేందుకు ఐస్ బ్లాకులు, ఫ్యాన్లు వాడుతున్నారు.
విరిగిపోయిన విద్యుత్ గ్రిడ్లు - పెరిగిన ప్రమాదాలు
ఉక్రెయిన్లో తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల విద్యుత్ వాడకం పెరిగి, అక్కడి గ్రిడ్ దెబ్బతినడంతో అత్యవసర విద్యుత్ కోతలు విధించారు. ప్యారిస్ పరిసరాల్లోని వేలాది ఇళ్లకు కూడా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేశారు, ఎండలో చేసే పనులపై ఆంక్షలు విధించారు. బహిరంగ సభలను రద్దు చేశారు. బాల్కన్ ప్రాంతంలో కార్చిచ్చులు (Wildfires) చెలరేగాయి.
ఇదీ చదవండి: షాకింగ్ : భారతీయ నావికుడి బాడీలో అవయవాలన్నీ మాయం!
మరోవైపు ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం నదులు, చెరువుల్లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిపోతున్న వారి సంఖ్య పెరిగింది. ఫ్రాన్స్లో 74 మంది, పోలాండ్లో ఒకే రోజు 17 మంది నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోవడం ఆందోళన రేపుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికల ప్రకారం, ఐరోపా ఖండం ప్రపంచ సగటు కంటే రెండింతలు వేగంగా వేడెక్కుతోంది.
ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీ


