న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా తన పర్సనాలిటీ రైట్స్ (వ్యక్తిత్వ హక్కులు) ఉల్లంఘన జరిగిందంటూ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. తన పేరు, ఫోటోలను దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను తొలగించాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ కేసులో వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘన ఏమీ లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ ధర్మాసనం.. ప్రాథమికంగా పరువు నష్టం కలిగించేలా ఉన్నట్లు గుర్తించిన ఐదు సోషల్ మీడియా పోస్టులను, పత్రాలను తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. వీటి మినహా సామాజిక మాధ్యమాల్లో ఉన్న మిగిలిన కంటెంట్ ఏదీ పరువు నష్టం కలిగించేలా లేదని, అందువల్ల మిగతా పోస్టుల విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.
రాజకీయ నాయకులపై వచ్చే విమర్శలు, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా వాక్ హక్కుల మధ్య ఖచ్చితమైన సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రాజకీయ క్షేత్రంలో తీసుకునే నిర్ణయాలపై వచ్చే విమర్శలను పర్సనాలిటీ రైట్స్ పరిధిలోకి తీసుకురాలేమని అభిప్రాయపడింది.


