అందరి అమ్మాయిల్లా హాయిగా సాగిపోలేదు ఆమె జీవితం. అంతుచిక్కని అరుదైన వ్యాధితో పోరాడుతూ..మరోవైపు స్కూల్లో చీత్కారాలు సూటిపోటీ మాటలతో సాగింది ఆమె బాల్యం. ఆఖరికి కాలేజీలో సైతం అవే సమస్యలు వెంటాడాయి. విచిత్రం ఏంటంటే ఆమె ఒక పేషెంట్ కానీ డాక్టర్ కావలన్నది ఆమె కల. ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా కాలు కూడా కదపలేని ఆమె డాక్టర్ అయ్యేందుకు ఎంతలా పోరాడిందో తెలిస్తే..కన్నీళ్లు ఆగవు. ఇవాళ డాక్టర్స్ డే నేపథ్యంలో అసాధారణ ధైర్యంతో పోరాడిని ఈ యువ డాక్టర్ విజయగాథ గురించి తెలుసుకుందామా..!
ఆ అమ్మాయే హినా రామ్టెకే. ఢిల్లీకి చెందిన ఆమెకు 13 ఏళ్ల వయసు వచ్చినా..చిన్నపిల్లలానే ఉండేది ఆమె రూపం. చదువులో చక్కగా రాణించేది. కానీ విపరీతమైన అలసటతో ఏదో సత్తువలేని విధంగా ఉండేది. ఏదో చిన్న అనారోగ్యం అనే అనుకుంది. శీతకాలం కూడా కావడంతో ఇలా ఉందనే అనుకున్నారు. కానీ చూస్తుండగానే ఆమె కాళ్లు చేతులు చల్లటి నీటిలో పెడితే ముదురు నీలం రంగులోకి మారిపోయాయి. దాంతో వైద్యుడిని సంప్రదించగా..ఆమె వేళ్లను గమనించి పీడియాట్రిక్ని కలవమని సూచించారు.
అక్కడ రక్త పరీక్షలు చేయగా ఆమెకు అరుదైన ‘స్క్లెరోడెర్మా’ అనే ఆటోఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. స్క్లెరోడెర్మా అనేది ఒక వ్యాధి. దీనిలో రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని సొంత కణజాలాలపై దాడి చేస్తుంది. దీనివల్ల చర్మం గట్టిపడటం అంతర్గత అవయవాలు దెబ్బతినడం జరుగుతుంది. కొంతమంది రోగులలో ఇది ఊపిరితిత్తులు, గుండె, జీర్ణవ్యవస్థ రక్తనాళాలను కూడా ప్రభావితం చేస్తుందట. 13 ఏళ్ల వయసులో ఆమెకు ఆ వ్యాధి ఏంటో తెలియలేదు.
అలాగే వైద్యులకు కూడా దీని గురించి పెద్దగా తెలియదు. తన రోజులన్నీ ఆస్పత్రి సందర్శనలతో గడిచిపోయాయి. అప్పుడే తెలిసింది..హీనా ఆ వ్యాధితో జీవితాంత గడపక తప్పదని. దీనికి తోడు నుదిటిపై తెల్లటి మచ్చలు నెమ్మదిగా పెద్దదవ్వడం మొదలయ్యాయి. అలాగే స్కూల్కి వెళ్తుంటే ఆయాసం, ఊపిరాడనట్లు అనిపించేది. దాంతో కిటికీ ఉన్న బెంచ్ వద్దే కూర్చోనేది. ఆ తర్వాత చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాల్సి వచ్చింది. కానీ ఆ మచ్చలు తగ్గకపోగా..పరిమాణం పెరిగింది, మరింతగా వ్యాపించాయని చెప్పుకొచ్చింది.
కాలేజ్ లైఫ్ అంటే ప్రతి అమ్మాయి ఆడుతూ తుళ్లుతూ గడపుతుంది. కానీ హీనా ఆస్పత్రి అపాయింట్మెంట్లు, ప్రపంచానికి కనపడకుండా తనలోని భాగాలను ఎలా దాచుకోవాలి అనేవాటి గురించే సతమతమవ్వాల్సి వచ్చేది. అయినా చదువుని వదల్లేదు. విజయవంతంగా ఇంటర్ పూర్తి చేసి, వైద్య ప్రవేశ పరీక్షకు సన్నద్ధమైంది. ఆ సమయంలోనే బ్రాంకియోలైటిస్ అని నిర్ధారణ అయింది. అయినప్పటికీ ఆ పరీక్ష పాసై వైద్య కోర్సులో జాయిన్ అయ్యింది. అయితే అక్కడ సీనియర్లు, మిగతా విద్యార్థులు హీనాని వింతగా చూసేవారు.
కొందరు తనతో మాట్లాడవద్దని, దూరంగా ఉండమని హీనా ముఖం మీదే చెప్పేవారు. అన్ని కష్టాల మధ్య కూడా ఆమె తన ఆత్మవిశ్వాసంతో కొంతమంది స్నేహితులను సంపాదించుకుంది. అంతేగాదు అక్కడ ఆమె కాలేజీ రోజుల్లో దగ్గు ఎక్కువైంది. ముఖ్యంగా చలికాలంలో నడవడానికి, మెట్లు ఎక్కడానికి కష్టంగా ఉండేది. కనీసం పరీక్ష రాయడం కూడా కష్టమైంది. రోజువారీ పనులు కష్టమయ్యాయి. సొంతంగా తినలేకపోయేది, స్నానం చేయలేకపోయాది. అవన్నీ హీనా అమ్మే చేసేంది. పరీక్షలు రాస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరిగేవి హీనాకు. ఎందుకంటే..పుండ్ల కారణంగా వేళ్లలో భరించలేని నొప్పితో విలవిలలాడేది. వేసివికాలం ఆమె ప్రాణానికి హాయిగా ఉండేది.
అంత కష్టంలోనూ తన అభిరుచులను వదులుకోలేదు. టేబుల్ టెన్నిస్ వంటి ఆటల్లో యూనివర్సిటీ స్థాయిలో బహుమతి గెలుచుకుంది కూడా. ఇంతలా శారీరకంగా, మానసికంగా పోరాడుతుంటే కాలేజ్ వార్షికోత్సవంలో ఆమె తోటి విద్యార్థులు తనతో చెప్పకుండానే డ్యాన్స్ పోటీ నుంచి తన పేరుని తొలగించేశారని నాటి సంఘటనను గుర్తు చేసుకుంది. అలా వైద్య కోర్సుని పూర్తి చేసి ఇంటర్న్షిప్ ప్రారంభించింది. 12 నెలల ఇంటర్న్షిప్ సమయంలో,క్లినకల్ నైపుణ్యాలను అలవోకగా నేర్చుకుంది.
అయితే ఆ క్లినక్ పనులు నేర్చుకోవడానికి చాలా శ్రమ అలసట, ఆయాసంతో ఇబ్బంది పడ్డానంటూ నాటి పరిస్థితిని వివరించింది. హీనా అనుకున్నట్లుగానే ఆమె కల నెరవేరే క్షణం రానే వచ్చింది. కాలేజీ స్నాతకోత్సవంలో డాక్టర్గా పట్టా అందుకుంది సగర్వంగా. అలా హీనా తన వ్యాధి ముదిరి ఇబ్బంది పెడుతున్నా..అలు పెరగని పోరాటం చేసి డాక్టర్ అయ్యింది.
తన శక్తిని హరించే వేసే వ్యాధితో పోరాడుతు డాక్టర్ అవ్వడం తన జీవితంలో అతి పెద్ద విజయం అని గర్వంగా చెబుతోందామె. ఆమెకు ఇప్పుడు 26 ఏళ్లు ఆక్సిజన్ థెరపీ ఆమె దైనందిన జీవితంలో ఒక భాగం. అయినా పోరాడుతూనే..నేర్చుకుంటూ ఉంటానని సగర్వంగా చెబుతోందామె. తాను ఎప్పుడూ..ఒక లక్ష్యంతో జీవిస్తూ ముందుకు వెళ్తానని ధీమాగా చెబుతుండటం విశేషం.


