బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఎప్పటికప్పుడూ తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటారు. ఈసారి అలానే మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయ సందర్శన గురించి గుర్తుచేసుకుంటూ..ఆ అనుభవాలను షేర్ చేసుకున్నారు. అదీగాక ఆమె శివుడి మీద ఆలపించిన పాట నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో ఇలా నాటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ వివరణ ఇచ్చారు. నటి పరిణితీ చోప్రా, రాజకీయ నాయకుడు రాఘవ్ చద్ధాలకు గతేడాదే పండంటి మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆ ప్రెగ్నెన్సీ సమయంలోనే తాను శివస్తుతిని ఆలపించానని, ఆ వీడియో ఆ సమయంలోనిదే అంటూ అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు
ఈ సందర్భంగా రాఘవ్తో పెళ్లి జరగకుముందు ఆయనతో కలసి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించిన విషయాన్ని కూడా ప్రస్తావించారామె. ఆ పోస్ట్లో ఈ నెల ప్రారంభంలో తాను ‘నమామీశ మీశాన నిర్వాణ రూపం’ అంటూ ఆలపించిన శివస్తుతి వీడియోని విడుదల చేసినట్లు తెలిపారు. అది గర్భధారణ సమయంలో ఒక ప్రశాంతమైన ఉదయం వేళ ఆ శివస్తుతిని రికార్డు చేసినట్లు తెలిపారు. "అయితే దీనికి ఇంతటి ఆదరణ లభిస్తుందని అస్సలు ఊహించలేదు. చాలా ఏళ్లుగా మా కుటుంబంలో ఇది ఒక భాగంగా ఉన్నట్లే, ఇప్పుడు ఇది మీ ఉదయపు పాటల జాబితాలో (ప్లేలిస్ట్) చేరడం నాకు ఎంతో గౌరవంగా అనిపిస్తోంది.
శివస్తుతి అనేది పరమశివునికి అంకితం చేసిన ఒక భక్తి గీతం." అని రాసుకొచ్చారు పోస్ట్లో. అలాగే ఆ భక్తిగీతం తోపాటు పరిణీతి తాను, రాఘవ్ కలిసి ఉజ్జయిని మహాకాళేశ్వరుని సందర్శించిన వీడియోని కూడా పోస్ట్ చేశారు. సెప్టెంబర్లో జరిగిన వారి వివాహానికి కొన్ని వారాల ముందు, అంటే 2023 ఆగస్టులో వారు ఈ ఆలయాన్ని సందర్శించారు.
ఆ వీడియోలో పూజారి హారతి ఇస్తుండగా శివలింగం స్పష్టంగా కనిపించడం చూడొచ్చు. చుట్టూ చాలా మంది జనం ఉన్నప్పటికీ, పరిణీతి-రాఘవ్లు భక్తితో చేతులు జోడించి కూర్చుని ఉన్నారు. ఆ తర్వాత, వారు స్వయంగా హారతి కూడా ఇచ్చారు. ఈ జంట అదే ఏడాది జూలై 2023లో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని (Golden Temple) కూడా సందర్శించారు. మరి ఇలా ప్రెగ్నెన్సీ సమయంలో శివస్తుతి వంటివి చేయొచ్చా అంటే..
ఆ టైంలో చేయొచ్చా..
గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలోనే కాకుండా మానసిక ఆలోచనలలో కూడా మార్పులు వస్తాయి. ఈ సమయంలో స్త్రీ కొన్నిసార్లు ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తుంది, మరికొన్నిసార్లు చాలా భావోద్వేగంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో శివపూజ చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది, ఆందోళన తగ్గుతుంది. భావోద్వేగ ఆలోచనలు తగ్గుతాయి. గర్భధారణ సమయంలో శివలింగ పూజ లేదా భక్తిపాటలు ఆలపించడం వల్ల ప్రతికూల శక్తి నీడ పుట్టబోయే బిడ్డపై పడదు.
గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇది తల్లి బిడ్డ ఇద్దరి మానసిక, శారీరక స్థితిని మెరుగుపరుస్తుంది. ఉపవాసాలు వంటవి చేయకుండా ప్రశాంతత చేకూర్చే ఇష్టదైవ పూజ లేదా పాటలను నిరభ్యంతరంగా చేసుకోవచ్చని అన్నారు. వత్రాలు, నోములు వంటివి తప్పించి హాయిగా ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవచ్చు, ఆయా భక్తి పాటలు ఆలపించొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నచ్చిన పని, ఇష్టదైవ ప్రార్థన వంటివి గర్భిణీలకు ఒత్తిడిని తగ్గించి..మానసిక ప్రశాంతతను అందివ్వడమే కాకుండా సుఖ ప్రసవానికి శరీరాన్ని సిద్ధం చేస్తుందని అన్నారు.
గమనిక: ఇది కేవలం భక్తి, నమ్మకాల ఆధారంగా ఇచ్చిన కథనం మాత్రమే. భక్తులు తీన్ని అనుసరించే ముందు ఆయా ప్రముఖ పండితులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం.
(చదవండి: సీషెల్స్ ద్వితీయ మహిళకు ప్రధాని మోదీ గిఫ్ట్గా కాంచీపురం చీర..! స్పెషాల్టీ ఇదే)


